పాలకుర్తి రూరల్, ఆగస్టు 27 : సీఎం కేసీఆర్ పాలనలోనే గిరిజనులకు ప్రత్యేక గుర్తింపు లభించిందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరాల శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండలంలోని హఠ్యా తండా, భీక్యా నాయక్ పెద్ద తండా, టీఎస్కే తండా, పెద్ద తండా(కే)లో రూ.10 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మంత్రి ఎర్రబెల్లి ఆదివారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రికి గిరిజనులు సంప్రదాయ పద్ధతిలో పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. టీఎస్కే తండాలో మహిళలతో కలిసి ఎర్రబెల్లి నృత్యం చేశారు. ఆనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ బంజారాలు ప్రకృతి బిడ్డలన్నారు. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు గొప్పవన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నా రు. సేవాలాల్ జయంతి ఉత్సవాలను గుర్తించి, నిధులు మంజూరు చేసిన మహాత్ముడు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో 1,077 తండాలను ప్రత్యేక పంచాయతీలను గుర్తించామని ఎర్రబెల్లి వివరించారు. గిరిజన బిడ్డలకు ప్రజాప్రతినిధులుగా అవకాశం కల్పించామన్నారు. వారి కోరిక మేరకు నూతనంగా మరిన్ని తండాలను పంచాయతీలుగా గుర్తించామన్నారు. గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందన్నారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇప్పటికే అసెంబ్లీలో గిరిజన రిజర్వేషన్ల బిల్లును ఆమోదించి, కేంద్రానికి పంపామన్నారు. కేంద్రం గిరిజన రిజర్వేషన్లు అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వంలో తండాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు.
ప్రతి తండా, ఆవాస ప్రాంతాలకు బీటీ రోడ్డు సౌకర్యం కల్పించామన్నారు. గోదావరి జలాలతో చెరువులు, కుంటలను నింపుతామన్నారు. మిషన్ భగీరథ ద్వారా తండాల్లో కూడా ఇంటింటికీ సురక్షితమైన తాగునీరు అందిస్తున్నామని ఎర్రబెల్లి తెలిపారు. పాలకుర్తి మండల కేంద్రంలో సేవాలాల్ మాహారాజ్ గుడికి రూ.10 కోట్లు మంజూరు చేశానని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయరంగం అభివృద్ధి చెందడంతో భూముల ధరలు పెరిగాయన్నారు. వర్గీకరణ పేరుతో గిరిజనులకు ఆదివాసీలకు మధ్య కాంగ్రెస్ చిచ్చు పెడుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గిరిజనులను వర్గీకరణ చేస్తామని, రిజర్వేషన్లు తొలగిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బ్రోకర్ మాటలు మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ గిరిజన వ్యతిరేక పార్టీ అని, దానికి ఓటుతో బుద్ధి చెప్పాలని అన్నారు. తండాల్లో గల్లీ గల్లీకి సీసీ రోడ్డు సౌకర్యం కల్పించానన్నారు. ప్రతి తండాకు పంచాయతీ భవనాలను మంజూరు చేశానని చెప్పారు. నర్సరీలు, వైకుంఠధామాలు, క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశామన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో గిరిజనులను పట్టించుకోలేదని విమర్శించారు. ఎన్నికల కోసం, ఓట్ల కోసం వచ్చే వారిని పట్టించుకోవద్దని సూచించారు. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్టు ద్వారా ఉపాధి హామీ కూలీలకు ఉచితంగా బ్యాగ్లను అందిస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్కు, తండాలను అభివృద్ధి చేసిన తనకు గిరిజనులు అండగా నిలబడాలని కోరారు.
మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్ఎస్లో చేరికలు
మండలంలోని మల్లంపల్లి గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పోశాల వెంకన్న ఆధ్వర్యంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తనను నమ్ముకుని పార్టీలో చేరిన ప్రతి ఒక్కరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీపీవో రంగాచారి, తహసీల్దార్ టీ వెంకటేశం, ఎంపీడీవో వనపర్తి ఆశోక్కుమార్, ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాసరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, మండల రైతు బంధు కోఆర్డినేటర్ వీరమనేని యాకాంతారావు, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ మదార్, పాలకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముస్కు రాంబాబు, కాంట్రాక్టర్ వర్రె వెంకన్న, మాజీ జడ్పీటీసీ గుగులోత్ దేవానాయక్, సర్పంచ్లు బానోతు మహేందర్, గుగులోత్ వాలు, దారవత్ బాలునాయక్, లావుడ్యా శాంతమ్మ, ఎంపీటీసీలు గుగులోత్ వసంత జుమ్మిలాల్, మంద వీరలక్ష్మీ సోమయ్య, లావుడ్యా లలితా దేవేందర్, ఏఈలు శ్రీనివాస్, ప్రశాంతి, రణధీర్రావు, బాబురావు, ఎస్టీసెల్ మండల అధ్యక్షుడు దారవత్ యాకూబ్నాయక్, పోశాల వెంకన్న, సంపత్ శ్రీపాల్రెడ్డి పాల్గొన్నారు.