ఏటూరునాగారం, అక్టోబర్ 21: ములుగు జిల్లాలోని ఏటూరునాగారంలో గిరిజన గురుకులాల జోనల్ స్థాయి క్రీడలు షురువయ్యాయి. స్థానిక గిరిజన గురుకుల బాలుర క్రీడా పాఠశాలలో శుక్రవారం పోటీలను ఐటీడీఏ పీవో అంకిత్ ప్రారంభించారు. మరిపెడ, దామరవంచ, మహబూబాబాద్, ములుగు, ఏటూరునాగారం, వరంగల్, నర్సంపేట, అశోక్ నగర్, హుస్నాబాద్, రెడ్యాలలోని గిరిజన గురుకుల పాఠశాలలు, కళాశాలలకు చెందిన 14,17,19 సంవత్సరాల బాలురు వివిధ క్రీడల్లో తలపడ్డారు.
ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలతో పాటు చదువులో కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ డిప్యూటీ సెక్రటరీ చంద్రశేఖర్, కరీంనగర్, వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి ఆర్సీవోలు డీఎస్ వెంకన్న, రాజ్యలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు క్రీడలు నిర్వహిస్తున్నామని అన్నారు. మూడు రోజుల పాటు జరిగే క్రీడల్లో క్రీడాకారుల ను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయికి పంపిస్తామన్నారు. 11 పాఠశాలలు, కళాశాలల నుంచి 500 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని, వారికి వసతి, భోజన సౌకర్యం కల్పిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ తుమకి వెంకటేశ్వరరాజు చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి, జడ్పీ కోఆప్షన్ వలియాబీ, ఎంపీపీ అంతటి విజయ, ఎస్సై ఇందిరయ్య, స్థానిక సర్పంచ్ ఈసం రామ్మూర్తి, క్రీడల ఆర్గనైజింగ్ కోఆర్డినేటర్ రమణ, ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు తదతరులు పాల్గొన్నారు.