Warangal | వెంకటాపురం(నూగూరు), ఏప్రిల్15 : పాముకాటుకు గురైన మహిళ చికిత్స కోసం పామును చంపి ప్రభుత్వ దవాఖానకు తీసుకొచ్చింది. ఈ ఘటన వెంకటాపురం(నూగూరు) మండలం ముకునూరుపాలెంలో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన మిడియం శాంతమ్మ గ్రామ సమీపంలో ఉపాధి హామీ పనులకు వెళ్లింది. పనులు చేస్తున్న క్రమంలో పాము కాటు వేసింది.
దీంతో ఆమె దానిని చంపి వాటర్ బాటిల్లో వేసి మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తోటి కూలీలతో కలిసి వచ్చింది. వైద్యులకు పామును చూపించి వైద్యం అందించాలని కోరింది. వైద్యులు చికిత్స అందించగా ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. కాగా, శాంతమ్మ పామును చంపి దవాఖానకు వెంట తీసుకురావడంతో గ్రామస్తులు, వైద్యులు, సిబ్బంది నివ్వెరపోయారు.