ములుగు, ఆగస్టు11(నమస్తేతెలంగాణ) : ములుగు జిల్లా మత్స్యశాఖకు పట్టిన అవినీతి జలగ ఇంకా వదలడం లేదు. మేడారం జాతరలో విధులు నిర్వర్తించిన గజ ఈతగాళ్ల గౌరవ భృతి పంపిణీలో జరిగిన వాటాల పంచాయతీ చిలికి చిలికి గాలి వానలా మారింది. రోజుకో మలుపు తిరుగుతూ మత్స్యశాఖను పట్టి పీడిస్తున్న అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ఉన్నత స్థాయి అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. గత నెల 14న ములుగు జిల్లాలో కాంట్రాక్టు ఎఫ్ఎఫ్వోగా పనిచేస్తున్న అధికారిని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు బదిలీ చేసినప్పటికీ ఆయన రిలీవ్ కాకుండా ఇక్కడే పాగా వేయడం చర్చనీయాంశంగా మారింది.
ఇదే క్రమంలో గత నెల 24న గజ ఈతగాళ్ల గౌరవ భృతి పంపిణీలో ఇన్చార్జి డీఎఫ్వోకు, బదిలీ అయినా రిలీవ్ కాని ఎఫ్ఎఫ్వోకు తీవ్ర స్థాయిలో గొడవ జరగడం, మత్స్యశాఖ రాష్ట్ర అధికారులకు ఆయన ఫిర్యాదు చేయడం, దీంతో గత నెల 27న మత్స్యశాఖలో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న మహిళా అధికారిని విచారణకు ఆదేశించడం తెలిసిందే. ఈ క్రమంలో సదరు విచారణ అధికారిణి గత నెల 30న ఇన్చార్జి డీఎఫ్వోతో పాటు పదవీ విరమణ చేసిన డీఎఫ్వో, బదిలీపై వెళ్లిన ఎఫ్ఎఫ్వోతో కలిసి విచారణ చేసి రాష్ట్ర అధికారులకు నివేదిక సమర్పించారు.
విచారణ క్రమంలో సుదీర్ఘ కాలంగా ఎఫ్ఎఫ్వోగా పనిచేసిన అధికారిపై మత్స్య సహకార సంఘాల నాయకులు పలు ఆరోపణలతో పాటు అవినీతికి పాల్పడిన విషయాలను అధికారి దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఇన్చార్జి డీఎఫ్వో తాను ఇక్కడ పనిచేయలేనని రాష్ట్ర అధికారులకు మొర పెట్టుకోగా విచారణకు వచ్చిన మహిళా అధికారినే ఇక్కడ ఇన్చార్జిగా నియమించారు. అయినప్పటికీ బదిలీ అయిన ఎఫ్ఎఫ్వో రిలీవ్ కాకుండా రాజకీయ ఒత్తిళ్లతో ఇక్కడే కొనసాగేందుకు యత్నిస్తున్నట్లు తెలిసింది. తాను పనిచేసిన సమయంలో నియమించిన గిరిజన మత్స్య సహకార సంఘాలను, తనతో లబ్దిపొందిన ఇతర సంఘాలను సంప్రదించి వారు తనకు అనుకూలంగా వ్యవహరించేలా మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తున్నది. ఉన్నతాధికారులు స్పందించి పట్టు తప్పిన మత్స్యశాఖను గాడిలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.