ఉమ్మడి వరంగల్ను భారీ వర్షం ముంచెత్తింది. బుధవారం రాత్రి నుంచి ఏకధాటిగా కురిసిన కుండపోత వానకు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. మహబూబాబాద్, జనగామ జిల్లాల్లోనూ వర్షం ప్రభావం తీవ్రంగా ఉంది. భారీ వరద ప్రవాహంతో వరంగల్-ఖమ్మం, వరంగల్-ఛత్తీస్గఢ్, వరంగల్-సిరోంచ, వరంగల్-కరీంనగర్ జాతీయ రహదారుల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు జిల్లా జలదిగ్భంధంలో చిక్కుకున్నది. ఏటూరునాగారం మండలంలో జంపన్నవాగు నీటి ప్రవాహం పెరిగి కొండాయిలోని ఎస్సీకాలనీలోకి వరద నీరు చేరింది. దీంతో అధికారులు ముంపు ప్రాంతాల నుంచి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొండాయి వద్ద జంపన్నవాగులో ఏడుగురు గల్లంతు కాగా వారిని కాపాడారు. తాడ్వాయి మండలంలోని మేడారం వద్ద జంపన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో సమ్మక్క-సారలమ్మల గద్దెల వరకు వరద చేరింది. నార్లాపూర్లో వరద నీటిలో చిక్కుకున్న 16మంది వ్యక్తులను రెస్క్యూటీం అధికారులు రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలించారు.
లక్నవరం సరస్సు మత్తడి దశకు చేరింది. గుండ్లవాగు ఉధృతి పెరగడంతో పస్రా గ్రామం వద్ద జాతీయ రహదారి 163కు గండి పడి తెలంగాణ-ఛత్తీస్గఢ్ రాష్ర్టాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గుండ్ల వాగు నీటి ప్రవాహానికి కార్లు, ఆటోలు, టాటా గూడ్స్, ద్విచక్ర వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. వెంకటాపూర్ మండలంలో రామప్ప సరస్సు నీటి మట్టం 35అడుగులకు చేరుకుంది. గట్టమ్మ దేవాలయం వద్ద జాతీయ రహదారిపైకి వరద నీరు వచ్చి చేరడంతో రహదారి దెబ్బతిని ఉదయం రెండు గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. జంగాలపల్లి వద్ద జాతీయ రహదారి 163పైకి రామప్ప సరస్సు వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం రాఘవరెడ్డిపేట-టేకుమట్ల మధ్య చలివాగుపై ఉన్న బ్రిడ్జి వరద ధాటికి కొట్టుకుపోయి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చిట్యాల మండలం నైన్పాక గ్రామంలోని బుడ్డగాళ్ల రేవు వద్ద మోరంచవాగుపై బ్రిడ్జి నిర్మాణం కోసం వచ్చిన అస్సాంకు చెందిన ఐదుగురు, జార్ఖండ్కు చెందిన ఒక కార్మికుడు వరద నీటిలో చిక్కుకోగా ఆర్మీ హెలికాప్టర్లో సురక్షితంగా కాపాడారు. కాటారం మండలం గంగారం గ్రామానికి చెందిన సంతోషం రాజు, భూక్య రాజు, ములకల తిరుపతి ఈ ముగ్గురు రైతులు మానేరు ఒడ్డున విద్యుత్ మోటర్లను తీసుకురావడానికి ట్రాక్టర్లో వెళ్లారు. తిరిగి వచ్చేలోపు చుట్టూ వరద నీరు చేరి మధ్యలో చిక్కుకోగా పోలీసులు, రెస్క్యూ యంత్రాంగం తీవ్ర ప్రయత్నాలు చేసి కాపాడారు.
– నమస్తే నెట్వర్క్
భూపాలపల్లి మండలంలో బుధవారం రాత్రి మోరంచవాగు ఉధృతికి మోరంచపల్లి ముంపునకు గురైంది. పడుకున్నవారికి మెళకువై లేచిచూసేసరికి ఇండ్లలోకి, మంచాలపైకి నీళ్లు వచ్చాయి. చిమ్మ చీకటిలో ఆందోళనతో తేరుకుని చూస్తే గుండెలు పగిలినంత పనైంది. కొందరు తేరుకొని ఇండ్లపైకి చేరగా, మరికొందరు చెట్లు ఎక్కి బిక్కుబిక్కుమంటూ రాత్రంగా గడిపారు. పెంకుటిల్లు, గుడివాసులు పక్కన ఉన్న డాబాలపైకి ఎక్కారు. సెల్ఫోన్ల ద్వారా ఎమ్మెల్యే గండ్రకు సమాచారం అందించి, వీడియోలు కూడా పంపారు. మోరంచపల్లి పరిస్థితిని తెలుసుకున్న ప్రభుత్వం అప్రమత్తమై అధికారయంత్రాంగాన్ని హుటాహుటిన రంగంలోకి దింపింది. మోరంచపల్లి చుట్టూ కిలోమీటర్ పొడవునా ప్రవాహం ఉండడంతో సహాయక చర్యలు చేపట్టలేని పరిస్థితి. దీంతో ఆర్మీ హెలీకాఫ్టర్లను మోరంచపల్లికి పంపేలా చూడాలని ఎమ్మెల్యే గండ్ర కోరగా ఆ మేరకు సీఎం కేసీఆర్ వెంటనే స్పందించి, చీఫ్ సెక్రటరీ శాంతికుమారిని ఆదేశించారు.
ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, రాష్ట్ర విపత్తుల నివారణ, అగ్నిమాపక సిబ్బంది, భూపాలపల్లిలో ఉన్న రాష్ట్ర విపత్తుల, అగ్నిమాపక సిబ్బంది మోరంచవాగు వద్దకు వచ్చి సహాయ చర్యల్లో పాల్గొన్నారు. సుమారు 900 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చి గణపురం మండలం కర్కపల్లి పాఠశాల, గాంధీనగర్ సీఎస్ఐ పాఠశాలకు తరలించారు. ఆహార ప్యాకెట్లు, నీటి బాటిళ్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందించారు. కాగా గ్రామానికి చెందిన గొర్రె ఓదిరెడ్డి, గొర్రె వజ్రమ్మ, గంగిడి సరోజన, గడ్డం మహాలక్ష్మి రాత్రికి రాత్రే వరదల్లో కొట్టుకుపోయారు. ఎంత గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. సుమారు 200 పశువులు వరదలో మునిగి చనిపోయాయి. పిల్లోనిపల్లి సమీపంలో చెల్పూరుకు చెందిన జోగుల సంజీవ్ వరదలో చిక్కుకుని మృతిచెందాడు.
బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఓరుగల్లు నగరం అతలాకుతలమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా హనుమకొండ, వరంగల్ నగరాలను భారీగా వరద ముంచెత్తింది. పలు కాలనీలు నీట మునిగాయి. నీరు చేరిన ఇండ్ల నుంచి ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పునరావస కేంద్రాల్లో వసతులు కల్పించి నీడనిచ్చారు.