ములుగు, ఫిబ్రవరి11(నమస్తేతెలంగాణ): మేడారం ముందస్తు మొక్కులు చెల్లించే భక్తులకు ఆదివారం ట్రాఫిక్ జామ్ కష్టాలు తలెత్తాయి. సెలవు దినం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి వన దేవతలను దర్శించుకునేందుకు భక్తులు ప్రైవేటు వాహనాలు, ఆర్టీసీ బస్సుల్లో అధిక సంఖ్యలో తరలివచ్చారు. తిరుగు ప్రయాణంలో జాతీయ రహదారి వాహనాలతో రద్దీగా మారింది. ములుగు గట్టమ్మ నుంచి మల్లంపల్లి వరకు సుమారు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్తో వాహనాలు జాతీయ రహదారిపై నిలిచిపోయాయి. ఎన్హెచ్ కల్వర్టు నిర్మాణ పనులు జరుగుతుండడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది.
అక్కడ లారీ దిగబడి ఉండడం ఇందుకు కారణమైంది. దీంతో సుమారు గంట పాటు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మేడారం గ్రామంలో సైతం ట్రాఫిక్ సమస్య తలెత్తగా పోలీసులు డ్రోన్ కెమెరాను ఉపయోగించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. వాహనాలను పార్కింగ్ స్థలాలకు తరలించారు. భక్తులు కాలినడకన గద్దెలను చేరుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. దీంతో పోలీసులు మేడారం నుంచి వస్తున్న వాహనాలను ములుగు మండలం జంగాలపల్లి క్రాస్, పాలంపేట-గణపురం క్రాస్ రోడ్డు నుంచి పరకాల-గుడెప్పాడ్ మీదుగా హనుమకొండ వైపునకు వాహనాలను మళ్లించారు. ఇప్పుడే ఇంత పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తితే జాతర జరిగే నాలుగు రోజుల్లో ఎలా ఉంటుందోనని వాహనదారులు చర్చించుకుంటున్నారు.