సుబేదారి, ఏప్రిల్ 22 : ఏసీబీ అధికారులకు పట్టుబడి సస్పెండ్ అయిన మహబుబాబాద్ జిల్లా సబ్ రిజిస్ట్రార్ మహ్మద్ తస్లీమా నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రూ.2.94కోట్ల ఆస్తులు ఉన్నట్లు నిర్ధారించారు. సోమవారం వరంగల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలో హనుమకొండలోని కాకతీయకాలనీ, యాదవనగర్లోని తస్లీమా ఇళ్లతో పాటు సూర్యాపేటలోని కుటుంబ సభ్యులు, భూపాలపల్లిలో డాక్యుమెంటరీ రైటర్స్ ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. తనిఖీల తర్వాత ఆస్తుల వివరాలను ఏసీబీ డీఎస్పీ వెల్లడించారు. ఐదు ఇళ్ల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.27లక్షలు, ఆరు ఓపెన్ ప్లాట్ల విలువ రూ.12లక్షలు, మూడెకరాల వ్యవసాయ భూమి విలువ రూ.20.40లక్షల, వాహనాలు విలువ రూ.23.66లక్షలు, బ్యాంకు బ్యాలెన్స్ రూ.98,787, లభ్యమైన నగదు రూ.1,92,900.. మొత్తం ఆస్తుల విలువ రూ.2,94,00,547 ఉన్నట్లు ఏసీబీ అధికారులు నిర్ధారించారు. ఇంకా విచారణ కొనసాగుతున్నదని తెలిపారు.