మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలన్నీ ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్నాయి. మంగళతోరణాలు.. విద్యుత్ దీపాలతో ముస్తాబై కాంతులీనుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం, కోటగుళ్లు, హనుమకొండలోని వేయిస్తంభాల గుడి, మడికొండలోని మెట్టురామలింగేశ్వరాలయం, ములుగులోని రామప్ప, పాలకుర్తి కనకసోమేశ్వరాలయం, వరంగల్ కాశీబుగ్గలోని కాశీవిశ్వేశ్వరాలయం, ఖిలా వరంగల్ స్వయంభూ శంభులింగేశ్వరాలయం, కోటిలింగాల, భట్టుపల్లి శివాలయం, కురవి వీరభద్రస్వామి ఆలయం, కొడవటూరు సిద్ధేశ్వరాలయంలో పండుగ ఏర్పాట్లు పూర్తయ్యాయి.
శుక్రవారం వేలాది మంది భక్తులు మహాశివుని దర్శనం కోసం తరలిరానుండగా ఆలయాన్నీ శివనామస్మరణతో మార్మోగనున్నాయి. రాత్రివేళ జాగరణ సందర్భంగా భక్తుల కోసం ఆలయాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. పండ్లు, పూలు, దీపంతెల కొనుగోళ్లతో మార్కెట్లన్నీ గురువారం కిటకిటలాడాయి. కాగా కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలో పార్వతి అమ్మవారికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు దంపతులు అందజేసిన బంగారు కిరీటాన్ని అలంకరించారు. ఉత్సవాల్లో భాగంగా రాత్రి వేళ ముక్తీశ్వర, శుభానంద అమ్మవారి ఉత్సవ విగ్రహాలను మంగళవాయిద్యాలు, మంత్రోచ్ఛారణలతో ఎదుర్కొన్నారు.