జయశంకర్ భూపాలపల్లి, జూలై 3 (నమస్తే తెలంగాణ) : సమైక్య రాష్ట్రంలో అడవులు నిరాదరణకు గురయ్యాయి. అభివృద్ధి గురించి పట్టించుకున్న దాఖలాలే ఉండకపోయేది. ఏటా ఏదో మొక్కుబడిగా మొక్కలు నాటి మమ అనిపించేవారు. అదే స్వరాష్ట్రంలో అడవుల అభివృద్ధి, పచ్చదనం పెంపు కోసం సీఎం కేసీఆర్ బృహత్తర హరితహారం పథకాన్ని చేపట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా అటవీశాఖ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్లాంటేషన్లలో విరివిగా మొక్కలు పెంచడం, ఏఎన్ఆర్ కింద అడవి పునరుద్ధరణ, కాంటూర్ కందకాల మట్టిదిబ్బలపై మొక్కలను విరివిగా నాటడంతో దట్టమైన అడవులుగా వృద్ధి చెంది పచ్చదనం పెంపొందింది. అడవుల్లో నీటి వనరులను నెలకొల్పింది. మరోవైపు అడవులు, వన్యప్రాణుల రక్షణ, సంరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో జిల్లాలో విస్తృతంగా పచ్చదనం పెంపొందింది. అడవులు అభివృద్ధి చెందాయి. తద్వారా పచ్చదనంతో జిల్లా కళకళలాడుతున్నది. జిల్లాలో అటవీ ప్రాంతం 73.81శాతం కలిగి ఉంది. అడవులు అభివృద్ధి చెంది పచ్చదనం పరిఢవిల్లడంతో వన్యప్రాణుల సంఖ్య గణనీయంగా పెరిగింది. తద్వారా అడవులకు పూర్వవైభవం సంతరించుకొని మూడు దశాబ్దాల తర్వాత భూపాలపల్లి అడవుల్లోకి పెద్ద పులులు పునరాగమనం చేశాయి. ఇలా తొమ్మిదేళ్లలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అడవుల అభివృద్ధి, పచ్చదనం పెంపు గణనీయంగా పెరిగింది.
ఏఎన్ఆర్ కింద అడవుల పునరుద్ధరణ
జిల్లాలో అసిస్టెంట్ నేచురల్ రీజనరేషన్(ఏఎన్ఆర్) పథకం కింద జిల్లాలో గడిచిన తొమ్మిదేళ్లలో 23,729 ఎకరాల్లో అడవుల పునరుద్ధరణ జరిగింది. ఈ పథకం కింద సహాయక సహజ అడవుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అటవీశాఖ చేపట్టింది. కాఫీ కటింగ్ చేపట్టి అడవిలో ముళ్ల కంపలు, తుప్పలను తొలగించి, చనిపోయిన, కుళ్లిన, ఎండిపోయిన వాటిని తొలగించి మిగతా మొక్కలు, చెట్లు ఏపుగా పెరిగేలా చేశారు. ైక్లెంబర్ కటింగ్లో భాగంగా ఎదుగుదలకు అడ్డుగా ఉన్న వృక్షాలకు అల్లుకున్న తీగలను తొలగించారు. అలాగే స్మగ్లర్లు నరికిన చెట్ల మొదలుకు ప్రాణం ఉంటుంది. నరికి వదిలేసిన చెట్టు మొదలు పైభాగాన్ని అర ఫీట్ వరకు కట్ చేసి వర్షపు నీరు నిల్వ ఉండకుండా రోకలి బండ రూపంలో తీర్చిదిద్ది ఆరోగ్యంగా ఎదగడానికి కృషిచేశారు. ఖాళీ ప్రదేశాలున్న చోట తిరిగి మొక్కలు నాటారు. ఇలా జిల్లాలో ఏఎన్ఆర్ కింద అడవిని పునరుద్ధరించడంతో దట్టమైన అడవులుగా రూపాంతరం చెందాయి.
మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ పెద్ద పులుల జాడ
సమైక్యరాష్ట్రంలో అడవులు అంతరించిపోయి వన్యప్రాణుల సంఖ్య గణనీయంగా తగ్గింది. మూడు దశాబ్దాలకు పూర్వం భూపాలపల్లి అడవుల్లో పెద్ద పులులు పెద్దసంఖ్యలో తిరుగాడేవి. క్రమంగా వాటి మనుగడ కానరాలేదు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ దూరదృష్టితో హరితహారం ప్రారంభించి అడవుల రక్షణ, సంరక్షణకు పెద్దపీట వేశారు. ఫలితంగా వనాలు వృద్ధి, నీటి వనరులు ఏర్పాటుతో పచ్చదనం పెంపొంది వన్యప్రాణులు గణనీయంగా పెరిగాయి. తద్వారా అనుకూల వాతావరణం ఏర్పడడంతో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల నుంచి 30 ఏళ్ల తర్వాత స్వరాష్ట్రంలో భూపాలపల్లి అడవుల్లోకి మళ్లీ పెద్ద పులులు అడుగుపెట్టాయి. ఇలా తరచూ పెద్ద పులులు గత నాలుగేళ్లుగా రోజుల తరబడి ఉండి వెళ్లిపోతున్నాయి. పెద్ద పులులు రావడమే భూపాలపల్లి జిల్లాలో అడవుల అభివృద్ధికి నిదర్శనమని అటవీ శాఖ అధికారులతో పాటు పర్యావరణ ప్రేమికులు, ఈ ప్రాంత ప్రజలు చర్చించుకొని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో మూడు అటవీ ఉద్యానవనాలు
జిల్లావ్యాప్తంగా మూడు అటవీ ఉద్యానవనాలు, హరితవనాలను నిర్మించారు. కాళేశ్వరంలో ముక్తివనం పార్కు, జిల్లాకేంద్రంలో ఎకో పార్కు, రేగొండ మండలం పాండవుల గుట్టలో, 100 ఎకరాల్లో ఈ పార్కు ల్లో పచ్చదనం కోసం 22,500 మొక్కలను నాటారు. జిల్లా కేంద్రంలోని ఎకో పార్కులో సహజసిద్ధమైన అటవీ మొక్కలు అంతకుముందే అధికసంఖ్యలో ఉన్నాయి. ఉద్యానవనాలతో ఆహ్లాద వాతావరణం ఏర్పడి ప్రజలకు చల్లని వాతావరణం అందుతున్నది. పార్కుల్లో వాకింగ్ ట్రాక్లు నెలకొల్పడం వల్ల వాకింగ్, వ్యాయామం చేస్తున్నారు. సహజసిద్ధమైన అటవీ జాతి చెట్లుతో చల్లని వాతావరణాన్ని నెలకొల్పడంతో పిక్నిక్లకు అనువుగా మారింది.
జిల్లాలో తొమ్మిది నర్సరీలు
జిల్లాలో భూపాలపల్లి, ఆజంనగర్, దూదేకులపల్లి, చెల్పూర్, కొయ్యూరు, మహదేవపూర్, పెగడపల్లి, కాటారం, పలిమెల అటవీ రేంజ్లు ఉన్నాయి. ఇందులో దూదేకులపల్లి మినహా మహదేవపూర్లో రెండు నర్సరీలు ఉన్నాయి. ఇందులో హరితనిధి కింద ఒక నర్సరీని ఏర్పాటు చేశారు. మిగతా 7 అటవీ రేంజ్లలో ఒక్కో నర్సరీ ఉంది. మొత్తం జిల్లాలో 9 అటవీ నర్సరీలు ఉండగా ప్రస్తుతం 9 లక్షల మొక్కలు పెంచుతున్నారు. అటవీ జాతులు, పండ్లనిచ్చే, ఔషధ మొక్కలను పెంచుతున్నారు. జిల్లావ్యాప్తంగా 88.70 కిలోమీటర్ల మేర రహదారి వనాలు, ఇందులో 21.50 కిలోమీటర్లు బహుళ రహదారి వనాలు ఉన్నాయి. పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు పాఠశాల విద్యార్థులకు వనదర్శిని కార్యక్రమాలను విస్తృతంగా అటవీ శాఖ నిర్వహిస్తున్నది.
హరితహారం రూ.12 కోట్లు, అదేవిధంగా ఏఎన్ఆర్ స్కీం కింద ఖర్చు చేసిన నిధులు పోను అదనంగా మరో రూ.34.39 కోట్లతో తొమ్మిదేళ్లలో పైన పేర్కొన్న మిగతా అభివృద్ధి పనులు అటవీ శాఖ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగాయి.
261 కి.మీ మేర కందకాల తవ్వకం
జిల్లాలో 261.128 కిలోమీటర్ల మేర సరిహద్దు కందకాల తవ్వకాన్ని అటవీ శాఖ చేపట్టింది. తద్వారా సరిహద్దు నిర్దేశిస్తారు. భూసారం కొట్టుకుపోకుండా నిలువరిస్తాయి. వర్షాకాలపు నీరు భూమిలోకి ఇంకిపోయి భూగర్భ జలాల పెంపునకు దోహదపడుతుంది. అడవుల్లోకి కలప బండ్లు, స్మగ్లర్లు, బయటి వ్యక్తులు వెళ్లకుండా నిలువరిస్తాయి. అలాగే అగ్ని ప్రమాదాల నివారణ కోసం 479.86 కి.మీ మేర ఫైర్లైన్లను ఏర్పాటుచేసింది.
చెక్డ్యాంలు, చెరువులు, కుంటలు, ఇంకుడు గుంతల నిర్మాణం
జిల్లాలోని అడవుల్లో 204 చెక్డ్యాంలు, 354 చెరువులు, కుంటలు (పీటీలు/ఎంపీటీలు), 3,08,345 ఇంకుడు గుంతలు(ఎస్సీటీలు), 82 చెరువులు(ఫామ్పాండ్స్), 836 చిన్న రాతి కట్టడాలను(రాక్ ఫిల్ డ్యామ్స్) అటవీ శాఖ నిర్మించింది. వీటి వల్ల వర్షపు నీరు నిలిచి భూగర్భ జలాలు పెంపొందాయి.
నీరు నిల్వ ఉండడం వల్ల రకరకాల పక్షులు, జంతువులకు తాగునీరు లభిస్తున్నది. నీటి వనరుల చుట్టూ మొలిచిన పచ్చని గడ్డితో గడ్డి జాతిని తినే జంతువులకు ఆహారం సమకూరి ఫలితంగా చుట్టూ చల్లని వాతావరణం ఏర్పడింది. ఇవే కాకుండా గడ్డి క్షేత్రాలను కూడా పెంచడం వల్ల వన్యప్రాణులకు సమృద్ధిగా ఆహారం అందుబాటులోకి వచ్చి వృద్ధి చెందాయి. అలాగే ఉభయజలచరాలైన కప్పలు, తాబేళ్లు, పాములు తదితర జీవజాతులు కూడా వృద్ధి చెందాయి.
ప్రభుత్వ సహకారం, అటవీ శాఖ కృషి వల్లే..
తెలంగాణ ప్రభుత్వ సహకారం, అటవీ బేస్ సిబ్బంది మొదలు ఉన్నత స్థాయి అధికారుల వరకు అడవుల రక్షణ, సంరక్షణ చేపట్టడం వల్లనే భూపాలపల్లి జిల్లాలో అడవులు గణనీయంగా వృద్ధి చెందాయి. తద్వారా వన్యప్రాణుల సంఖ్య కూడా అధికసంఖ్యలో పెరిగింది. గతంలో కంటే అధికంగా పచ్చదనం వృద్ధి చెందింది. ఏఎన్ఆర్ కింద అడవుల పునరుద్ధరణ చేశాం. హరితహారం ద్వారా విరివిగా మొక్కలను నాటి సంరక్షించాం. తద్వారా జిల్లాలో గణనీయంగా అడవులు అభివృద్ధి చెందాయి.
– బి.లావణ్య, డీఎఫ్వో, జయశంకర్ భూపాలపల్లి జిల్లా