సుబేదారి, ఏప్రిల్ 26 : ప్రియుడు, అక్కతో కలిసి ఓ పనిమనిషి యజమాని ఇంటికే కన్నం వేసి పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లింది. యజమాని ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. శుక్రవారం హనుమకొండలోని వరంగల్ పోలీస్ కమిషనరేట్లో సీపీ అంబర్ కిశోర్ ఝా వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్కు చెందిన కత్రి కల్యాణి రంగశాయిపేటలో నివాసముంటూ సంతోష్నగర్లోని డాక్టర్ కీసర విక్రమ్రెడ్డి ఇంట్లో పని మనిషిగా పని చేస్తున్నది. ఈ క్రమంలో విక్రమ్రెడ్డి ఇంట్లో పెద్దమొత్తంలో బంగారు ఆభరణాలు ఉన్నట్లు తెలుసుకొని, చోరీకి పక్కా ప్లాన్ వేసింది. నెక్కొండ మండలం చందుగొండ గొల్లపల్లికి చెందిన ప్రియుడు మూడు చంటి(ఆటో డ్రైవర్), హనుమకొండ దీన్దయాళ్నగర్కు చెందిన ఆమె అక్క మౌర్య సునీతతో కలిసి విక్రమ్రెడ్డి ఇంట్లో నాలుగు దఫాల్లో 650 గ్రాముల బంగా రు ఆభరణాలను చోరీ చేసింది. ఇందులో కొంత విక్రయించి కారు కొనుగోలు చేసింది.
బంగారు ఆభరణాలు మిస్సైనట్లు గుర్తించిన విక్రమ్రెడ్డి సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ సత్యనారాయణరెడ్డి, సిబ్బంది విచారణ చేపట్టి చోరీ చేసిన ముగ్గురిని గుర్తించారు. శుక్రవారం సుబేదారి ఫారెస్ట్ ఆఫీస్ వద్ద సీఐ వాహనాలను తనిఖీ చేస్తుండగా కారులో ఉన్న నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకోగా చోరీ చేసినట్లు అంగీకరించారు. వారి నుంచి 470 గ్రాముల బంగారు ఆభరణాలు, కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకున్న సెంట్రల్ జోన్ డీసీపీ అబ్దుల్ బారి, హనుమకొండ ఏసీపీ దేవేందర్రెడ్డి, సీఐ సత్యనారాయణరెడ్డి, ఏఎస్సై రాజయ్య, పర్వీన్, కానిస్టేబుళ్లు సత్యనారాయణ, అలీ, ప్రభాకర్, ఇతర సిబ్బందిని సీపీ అభినందించి రివార్డులు అందజేశారు.