దేశీ రకం మిర్చి రైతన్నకు సిరులు కురిపిస్తున్నది. ఈ ఏడాది ఆరంభం నుంచే రికార్డు స్థాయి ధరలు నమోదవుతున్నాయి. జనవరిలో వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్కు రూ.81వేలు పలికింది. సంవత్సరం ప్రారంభంలోనే మునుపెన్నడూ ఇంత ధర పలకలేదని, మార్కెట్ చరిత్రలోనే దేశీ రకం కొత్త మిర్చికి ఇదే టాప్ రేట్ అని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన మిర్చికి గరిష్ఠంగా క్వింటాల్కు రూ.90వేలు నమోదైందని వెల్లడించారు. మున్ముందు మరింత ధర పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మార్కెట్లో అమ్మకాలు షురువైన తొలిరోజుల్లోనే మిర్చికి ఎప్పుడు ఇంత ధర రాలేదని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చీడపీడల వల్ల కొంతమేర దిగుబడి తగ్గినా రికార్డు ధరలు పలుకుతుండడంతో మురిసిపోతున్నారు.
– వరంగల్, ఫిబ్రవరి 2(నమస్తేతెలంగాణ)
వరంగల్, ఫిబ్రవరి 2(నమస్తేతెలంగాణ) : మార్కెట్లో మిర్చికి రికార్డు స్థాయిలో ధర పలుకుతున్నది. గత సంవత్సరం అమ్మకాలు ఊపందుకున్న తర్వాత రికార్డు స్థాయిలో ధరలు పలుకగా ఈ ఏడాది ఆరంభం నుంచే ఆల్టైం రికార్డు రేట్లు నమోదవుతున్నాయి. ప్రధానంగా దేశీ (చపాట) రకం మిర్చికి మార్కెట్ చరిత్రలో మునుపెన్నడూ లేని రీతిలో ధర పలుకుతున్నది. గత ఏడాది సెప్టెంబర్లో క్వింటాల్ దేశీ రకం మిర్చికి వరంగల్ ఎనుమామూల వ్యవసాయ మార్కెట్లో రూ.90 వేల పలికింది. ఈ ధర మార్కెట్ చరిత్రలో ఆల్టైం రికార్డు. రైతులు కోల్ట్ స్టోరేజీల్లో నిల్వ చేసి మార్కెట్కు తెచ్చిన మిర్చి ఇది.
ఈ ఏడాది జనవరిలో దేశీ రకం కొత్త మిర్చికి క్వింటాల్ ధర రూ.81 వేలుగా నమోదైంది. ఇది కూడా మార్కెట్ చరిత్రలో ఆల్టైం రికార్డు. గతంలో ఎప్పుడూ మార్కెట్లో కొత్త మిర్చికి ఇంత ధర పలికిన దాఖలాల్లేవు. రాష్ట్రంలో అన్ని రకాల మిర్చి కొనుగోళ్లు ఎక్కువగా జరిగే, ఆసియాలో అతిపెద్ద రెండో మార్కెట్ అయిన ఎనుమాములకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి రైతులు మిర్చిని తెస్తారు. ఖమ్మం మార్కెట్కు కొన్ని రకాల మిర్చి మాత్రమే వస్తుండగా ఎనుమాములకు తేజ, వండర్హాట్తో పాటు యూఎస్341, దీపిక, దేశీ, డీడీ, 1048, 273, 334, బ్యాడ్జి, సింగిల్పట్టీ తదితర రకాల మిర్చి వస్తుంది. గత సంవత్సరం మొదట సింగిలిపట్టి రకం మిర్చికి రికార్డు ధర నమోదైంది. మార్చిలో క్వింటాల్ ధర రూ.45 వేలు పలికింది. ఆ తర్వాత సింగిల్పట్టీ రకం మిర్చి ధర క్వింటాల్కు రూ.40 వేలు దాటలేదు.
రికార్డు బ్రేక్..
ఎనుమాముల మార్కెట్లో సింగిల్పట్టీ రకం మిర్చి ధర రికార్డును దేశీ రకం బ్రేక్ చేసింది. గత మార్చిలో ఇక్కడ దేశీ రకం మిర్చి క్వింటాల్ ధర రూ.52 వేలుగా నమోదైంది. ఏప్రిల్లో రూ.55,551 ఎగబాకింది. తర్వాత కోల్డ్ స్టోరేజీల్లో రైతులు నిల్వ చేసిన దేశీ రకం మిర్చికి ఆల్టైం రికార్డు ధర నమోదైంది. ఆగస్టులో రూ.65 వేలు పలికింది. సెప్టెంబర్, అక్టోబర్లో రూ.90 వేలకు చేరింది. నవంబర్లో ఒకరోజు రూ.87 వేలు పలికింది. ఈ మిర్చి ఏరిన సమయంలో మార్కెట్లో ఆశించిన ధర లేకపోవడంతో రైతులు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిందే కావడం గమనార్హం. మార్కెట్లో మిర్చికి డిమాండ్ పెరిగిన తర్వాత రైతులు మార్కెట్లో అమ్మారు. ఊహించని ధర లభించడంతో మురిసిపోయారు. చీడపీడల వల్ల దిగుబడి కొంత తగ్గినా రికార్డు ధరలు పలకడంతో సంతోషం వ్యక్తం చేశారు.
ఈ ఏడాది ఆరంభం నుంచే..
ఎనుమాముల మార్కెట్లో ఈ ఏడాది ఆరంభం నుంచే దేశీ రకం కొత్త మిర్చికి రికార్డు స్థాయిలో ధర నమోదవుతున్నది. జనవరిలోనే క్వింటాల్కు రూ.81 వేలు నమోదు కావడం విశేషం. దేశీ రకం మిర్చికి క్వింటాల్ గరిష్ఠ ధర జనవరి 6న రూ.80,100 పలికింది. 20వ తేదీన రూ.70,011 నమోదైంది. 23న రూ.72,500 పలికినట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు వెల్లడించారు. 24న రూ.68 వేలు, 25న రూ.72,011 నమోదైనట్లు తెలిపారు. 27న రూ.71 వేలు పలికిన క్వింటాల్ ధర 30న రూ.81 వేలకు చేరింది. 31న రూ.70 వేలుగా నమోదైంది. గురువారం క్వింటాల్ దేశీ రకం మిర్చి ధర రూ.65 వేలు పలికింది.
జనవరి నెలలోనే ఈ మార్కెట్కు 744 క్వింటాళ్ల దేశీ రకం కొత్త మిర్చి వచ్చినట్లు మార్కెటింగ్ అధికారులు చెప్పారు. గత సంవత్సరం జనవరిలో దేశీ రకం కొత్త మిర్చి మార్కెట్కు రాలేదు. ఫిబ్రవరిలో దేశీ రకం కొత్త మిర్చి గరిష్ఠ ధర రూ.29 వేలు పలికింది. మార్చిలో రూ.52వేలు, ఏప్రిల్లో రూ.55,551 పలికింది. అయితే, ఈ ఏడాది జనవరిలోనే క్వింటాల్కు రూ.81 వేలు నమోదు కావడం మార్కెట్ చరిత్రలో టాప్ అని అధికారులు తెలిపారు. మున్ముందు ఈ ధర మరింత ఎగబాకే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. దేశీ రకం కొత్త మిర్చికి గతంలో ఎప్పుడూ ఈ ధర రాలేదని ఎనుమాముల మార్కెట్ గ్రేడ్-2 సెక్రటరీ మహ్మద్ బియాబాని చెప్పారు.