జనగామ, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : ఆయనది మారుమూల పల్లెటూరు.. పేద కుటుంబం.. చదివింది ఆరో తరగతే.. కానీ రామాయణం, భారతం, భాగవత గాథలను పద్యరూపంలో పాడడంలో దిట్ట.. వందలాది గీతాలు, పద్యాలు, కీర్తనలు, శ్లోకాలు, వచనాలను రాగబద్ధంగా తన గంభీర స్వరంతో పాడడమే గాక దుర్యోధనుడు, కృష్ణుడు, కంసుడు, రావణుడు, లోహితాన్యుడు, సిరియాళుడు, బాలవద్ధి, సత్య హరిశ్చంద్రుడు, కీచకుడు, కంసుడు వంటి పాత్రలు వేసి యక్షగాన ప్రదర్శనలతో మెప్పించారు. ఎన్నో వేదికలపై వేలాది ప్రదర్శనలిచ్చి తన అపార అనుభవంతో జానపద కళ చిందు యక్షగానానికి జీవం పోశాడు. ఇలా ఐదు దశాబ్దాలుగా తన జీవితాన్ని కళకే అంకితం చేసిన అప్పిరెడ్డిపల్లి ముద్దుబిడ్డ గడ్డం సమ్మయ్యను ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం వరించింది. దేశం కీర్తించే స్థాయిలో ఉమ్మడి వరంగల్ జిల్లా గర్వించేలా చేసింది. జనవరి 22న అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా యక్షగానంలో రామాయణాన్ని ప్రదర్శించే అరుదైన అవకాశం ఈయన బృందానికి దక్కగా.. ‘ప్రదర్శనకు మెచ్చి శ్రీరాముడే ఇచ్చిన కానుక ఈ పద్మశ్రీ’ అని చెబుతున్నారు సమ్మయ్య. అవార్డుకు ఎంపికైన సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’తో ఆయన ముచ్చటించారు.
మా ఊరు అప్పిరెడ్డిపల్లి. దేవరుప్పుల మండలం చిన్నమడూరు నుంచి కోలుకొండ మార్గంలో చిన్న పల్లెటూరు. మేం ముగ్గురు అన్నదమ్ములం. చిందు యక్షగానాన్ని నమ్ముకున్నం. మా తండ్రి రామస్వామి నా గురువు. ఆయన వారసత్వంగా వచ్చిన కులవృత్తి చిందుయక్ష గానాన్ని నేర్చుకున్న. నా కుమారుడు సోమరాజు కూడా ఈ వృత్తిలోనే రాణిస్తున్నాడు. చిన్నచిన్న ప్రదర్శనలు ఇస్తూనే ఉదయం, సాయంత్రం మా కుటుంబ సభ్యుల్లోని చిన్నారులు సహా మరికొందరిని ఇంటి అరుగు మీదు కూర్చోబెట్టుకొని మద్దెలదరువు, హార్మోనియం, వాయిద్యంతో రామాయణ, భారత, భాగవత ఇతిహాస గాథలను పద్యరూపంలో నేర్పిస్తా. నా బృందంలో అన్ని వయసుల వారు సుమారు 18మందికి శిక్షణ ఇచ్చాను. ఇప్పుడు వీరంతా వివిధ ప్రదర్శనల్లో అనేక పాత్రలను అలవోకగా పోషిస్తారు. నా బృందంలోని 12మంది సభ్యులకు 40కి పైగా ప్రదర్శనలకు సంబంధించిన పద్యాలు, గీతాలు, కీర్తనలు, వచనాలు కంఠతా వస్తాయి. ఈ బృందంలో నా పెద్ద కొడుకు సోమరాజు సుభద్ర, సుధేష్ట వంటి స్త్రీ పాత్రలు ధరించి కండ్లకు కట్టినట్లు ప్రదర్శన ఇవ్వడంలో మేటి.
సమ్మయ్య.. నువ్వు ‘పద్మశ్రీ’ అవార్డుకు ఎంపికైనవ్ అని ఎవరో చెబితే నమ్మలే. సామాన్యుడినైన నాకు అంత పెద్ద అవార్డు ఎలా ఇస్తారనుకున్నా. తర్వాత టీవీలో నా పేరు, ఫొటోతో సహా రావడం చూసి నోటమాట రాలేదు. ఆ ఆనంద క్షణాలు నా జీవితానికి సంతృప్తినిచ్చాయి. నా భార్య, పిల్లలు, కుటుంబం సంబురానికి హద్దులేదు. నేను పుట్టి పెరిగిన ఊరు అప్పిరెడ్డిపల్లి పేరు దేశం యావత్తు మార్మోగుతుంటే చూసి జీవితం ధన్యమైంది. భారత ప్రభుత్వం తమ పల్లె కళాకారుడిని ఎంపికచేసినందుకు ఊరంతా మురిసిపోయింది. జిల్లా ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్రెడ్డి, మామిడాల యశస్వినీరెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సహా రాష్ట్ర, జిల్లా అధికారులు, ఇంకా పెద్దపెద్ద సార్లు ఇంటికి వచ్చి సన్మానించి అభినందించడం మరిచిపోలేని ఘట్టం.
కొద్దిమంది మాత్రమే ఉన్న మా చిందు కుటుంబాలు ప్రదర్శనలు ఇస్తూ సంచార జీవితం గడిపేవి. మా తల్లిదండ్రులు రామస్వామి-ఛండికాంబ కొన్నేండ్ల కిందట జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని మూరుమూల అప్పిరెడ్డిపల్లిలో స్థిరపడ్డారు. నా భార్య పేరు శ్రీరంజని, మాకు ముగ్గురు కుమారులు సోమరాజు, హిమగిరి, మురళీకృష్ణ. ఊరిలో ఆరో తరగతి వరకు చదువుకున్నా. తల్లిదండ్రుల స్ఫూర్తితో చిన్నప్పటి నుంచి కులవృత్తే నాకు సర్వస్వం. 14 ఏళ్ల వయసులో నా తండ్రి ప్రోత్సాహంతో చిన్నికృష్ణుడి వేషధారణతో కళారంగంలోకి అడుగుపెట్టి, సమాజహితం, సామాజిక, కులవృత్తి పరిరక్షణలో సాంస్కృతిక రంగాన్ని వారసత్వంగా ఎంచుకొని చిందు యక్షగానాన్ని నమ్ముకొని ప్రదర్శనలు ఇచ్చి అందరి నోటా ‘శభాష్ సమ్మయ్య’ అనిపించుకున్న. 50 ఏండ్లుగా నా జీవితాన్ని కులవృత్తికి అంకితం చేసిన ఫలితంగానే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చిందుయక్ష గాన కళను గుర్తించి ప్రపంచానికి తెలిసే కళాకారుడిగా అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసింది.
వారసత్వంగా వచ్చిన చిందు యక్షగానాన్ని నమ్ముకొని సమాజహితం, సామాజిక, కులవృత్తి పరిరక్షణలో సాంస్కృతిక రంగంలో అడుగుపెట్టి దేశవ్యాప్తంగా దాదాపు 25వేల ప్రదర్శనలు ఇచ్చిన. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే చిందు యక్షగాన కళను గుర్తించి కళాకారులను ప్రభుత్వం ప్రోత్సహించింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చిందు యక్షగాన కళాకారుల ప్రదర్శనలు ప్రజలను చైతన్యం చేసేలా, ప్రభుత్వాలను మేల్కొలిపేలా, హెచ్చరికలు చేసే బాణీలో ఉండేవి. 2017లో జానపద కళల విభాగంలో తొలిసారి నేను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ‘తెలంగాణ ఆవిర్భావ పురసారం’ అందుకోవడం మరచిపోలేని ఘట్టం. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన 34మంది ప్రముఖులకు ప్రకటించిన ప్రతిష్టాత్మక అవార్డుల్లో చిందు యక్షగాన కళను చేర్చి నన్ను అరుదైన పురస్కారానికి ఎంపిక చేసిన ప్రధాని నరేంద్రమోదీకి కృతజ్ఞతలు. జనగామ జిల్లా అనేక మంది కళాకారులకు పుట్టినిల్లు.. ప్రాచీన చిందు యక్షగానం సహా ఒగ్గు కళకు ప్రసిద్ధి. అలాంటి ప్రాంతానికి వన్నెతెచ్చేలా కేంద్ర ప్రభుత్వం నన్ను పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేయడం గర్వంగా ఉంది.