సబ్బండ వర్గాల్లో సంతోషం వెల్లివిరిసింది. కనుమరుగైపోతున్న కులవృత్తులకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కేసీఆర్ సర్కారు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ‘సంక్షేమ సంబురాలు’ పండుగలా జరిగాయి. ఎక్కడికక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో లబ్ధిదారులకు చెక్కులు అందజేయడంతో వాటిని అందుకొని మురిసిపోయారు. పాలకుర్తి, రాయపర్తి, తొర్రూరులో జరిగిన ఉత్సవాల్లో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొని కులవృత్తిదారులకు రూ.లక్ష చెక్కులు, గొర్రెల యూనిట్లతో పాటు కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు, మైనార్టీ లోన్లు కూడా అందజేశారు.
నర్సంపేటలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొని ప్రోత్సాహకాలు అందించారు. హనుమకొండలోని అంబేద్కర్ భవన్లో కలెక్టర్ సిక్తా పట్నాయక్, మేయర్ సుధారాణితో కలిసి సంక్షేమ సంబురాల్లో పాల్గొన్న చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ లబ్ధిదారులకు చెక్కులు, నిరుపేదలకు పట్టాలు అందించారు. వరంగల్లోని రంగశాయిపేటలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యతో కలిసి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ చెక్కులు ఇచ్చారు. అలాగే మామునూరులో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, దామెరలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, నెల్లికుదురులో మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్నాయక్, మరిపెడలో డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, జనగామలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, స్టేషన్ ఘన్పూర్లో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, భూపాలపల్లిలో కలెక్టర్ భవేశ్మిశ్రాతో కలిసి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆర్థిక సాయం చెక్కులు అందించారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్