దళితబంధు పథకంపై ఆశలు పెట్టుకున్న లబ్ధిదారులకు నిరాశే ఎదురవుతున్నది. దళితుల సంక్షేమం కోసం గత బీఆర్ఎస్ సర్కారు రూ.10లక్షల సాయంతో వారికి ఉపాధి మార్గం చూపగా మొదటి విడుత ఉమ్మడి వరంగల్లోని పలు జిల్లాల్లో 546 మందికి లబ్ధి చేకూరింది. అలాగే రెండో విడుత కోసం భూపాలపల్లిలో 1405, ములుగులో 1100, జనగామలో 3300, పరకాల నియోజకవర్గంలో 1100 చొప్పున మొత్తం 6905 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి స్థానిక ఎమ్మెల్యేలతో తుది జాబితాను రూపొందించి ఎస్సీ కార్పొరేషన్కు పంపింది. కానీ ఇంతలో ప్రభుత్వం మారడంతో రెండో విడుతకు బ్రేక్ పడింది. పథకాన్ని హోల్డ్ చేసి దరఖాస్తులను పెండింగ్లో పెట్టి గ్రౌండింగ్ చేయకపోవడంతో లబ్ధిదారుల్లో అయోమయం నెలకొంది. కాంగ్రెస్ సర్కారు కొలువుదీరి నెల కావస్తున్నా పథకం అమలుపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం, అధికారులు సైతం సరైన సమాచారం ఇవ్వకపోవడంతో దళిత సంఘాల నాయకులు ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
కేసీఆర్ ప్రభుత్వం దళితుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన దళితబంధు పథకంతో ములుగు జిల్లాలో మొదటి విడుత 110 మందికి లబ్ధి చేకూరింది. రూ.10లక్షల చొప్పున వారందరికీ జీవనోపాధి లభించింది. అలాగే రెండో విడుతలో 1100 మందిని ఎంపిక చేయడంతో పాటు కలెక్టర్ తుది జాబితాను ఎస్సీ కార్పొరేషన్కు పంపారు. ఈ ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలో ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికలు పూర్తయ్యాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పథకం అమలుకు బ్రేక్ పడిం ది. దీంతో ఎంపికైన వారిలో అయోమయం నెలకొం ది. నిత్యం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అధికారులకు ఫోన్లు చేస్తూ ఆరా తీస్తున్నారు. గతేడాది డిసెంబర్ 30న లబ్ధిదారులంతా కలెక్టరేట్ను ముట్టడించేందుకు యత్నించారు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లారు. అదే రోజున మేడారం పర్యటనకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు గట్టమ్మ దేవాలయం వద్ద దళిత సంఘాల నాయకులు దళితబంధు పథకాన్ని అమలుచేసేలా చూడాలని కోరుతూ వినతిపత్రం అందించారు.
రెండవ విడుత దళితబంధు పథకానికి ఎన్నికలకు ముందే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1405 మంది దరఖాస్తు చేసుకున్నారు. లబ్ధిదారులను ఎంపిక చేసిన కేసీఆర్ ప్రభుత్వం మంజూరు ఇచ్చేందుకు సిద్ధం కాగా ఎన్నికల కోడ్తో ఆగిపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో దరఖాస్తులను పెండింగ్లో పెట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొదటి విడుత 151మందికి కేసీఆర్ ప్రభుత్వం పథకాన్ని వర్తింపచేసి ఆసరాగా నిలిచింది. ఇందులో ఇద్దరికి కొంత డబ్బు రావాల్సి ఉండగా ఇప్పుడు ఫ్రీజ్ చేశారు. అలాగే రెండో విడుతలో భూపాలపల్లి నియోజకవర్గం నుంచి 948 దరఖాస్తులు రాగా మంథని నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి 440, ములుగు నియోజకవర్గంలోని ఐదు గ్రామాల నుంచి 17 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 1405 అప్లికేషన్లు రాగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్సీ కార్పొరేషన్ అధికారులు దరఖాస్తులను పెండింగ్లో పెట్టారు.
పరకాల: పరకాల నియోజకవర్గంలో మొదటి విడుతలో 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి దళితబంధు అందించారు. బీఆర్ఎస్ సర్కారు అందించిన ఆర్థికసాయంతో పలు యూనిట్లను నెలకొల్పగా మరికొందరు వాహనాలను కొనుగోలు చేసి ఉపాధి పొందుతున్నారు. అలాగే 2వ విడుతలో 1100 మందిని ఎంపిక చేశారు. వీరంతా అధికారుల సూచనల మేరకు దళితబంధు ఆర్థికసాయం కోసం బ్యాంకుల్లో ఖాతాలు తెరిచారు. కానీ కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కావొస్తున్నా ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం, అధికారుల చుట్టూ తిరిగినా ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు అయోమయంలో పడ్డారు. వెంటనే ఆర్థికసాయం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
జనగామ జిల్లాలో మొదటి విడుతలో 185 మందికి రూ.10లక్షల చొప్పున రూ.18.50 కోట్లు విడుదలై వారందరూ ప్రస్తుతం దళితబంధు పథకం ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. సెప్టెంబర్లో 2వ విడుతలో నియోజకవర్గానికి 1,100 మంది చొప్పున 3,300 మందిని ఎంపిక చేశారు. ఆయా ఎమ్మెల్యేలు, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆమోదం తీసుకొని కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఆమోదం తెలిపి తుది జాబితాను ఎస్సీ కార్పొరేషన్ అధికారులకు పంపారు. ఎంపికైన లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ప్రక్రియ కొనసాగుతుండగానే ఎన్నికల షెడ్యూల్ వెలువడంతో 2వ విడుత నిధుల విడుదలకు బ్రేక్ పడింది. ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారడం, ఎమ్మెల్యేలు మారడంతో అప్పటి ఎమ్మెల్యేలు ఫైనల్ చేసి ఆమోదం పొందిన జాబితాపై జిల్లా అధికారులు నోరు మెదపడంలేదు. అసలు గ్రౌండింగ్ పూర్తికాలేదని, నిధులే రాలేదని, తమ వద్ద ఎలాంటి పెండింగ్ జాబితా లేదని చెబుతున్నారు.
ఆరు నెలల కింద మా ఆయన సమ్మయ్య పేరు మీద మాకు దళితబంధు వచ్చింది. కిరాణా షాపు పెట్టుకున్నం. మా ఆయన అనారోగ్యానికి గురై మంచం పట్టాడు. ఇద్దరు పిల్లలను సర్కారు బడిల చదివిస్తున్న. నాకు కాలు ఆపరేషన్ జరిగింది. ఇంట్లో పరిస్థితి బాగా లేదు. ఈ కారణం చేత అధికారుల దగ్గరికి వెళ్లడం లేటైంది. నాకు పెండింగ్లో ఉన్న రూ.5లక్షలు ఇస్తే షాపును మంచిగా చేసుకుందామనుకున్న. అధికారులను అడిగిన. దసరా ముంగట బిల్లు పెట్టినం అన్నరు. త్వరలో వస్తయన్నరు. అంతలో ఎన్నికలచ్చినయ్. అయిపోయినంక ఇస్తమన్నరు. ఇప్పుడు గవర్నమెంటు మారింది. గవర్నమెంటు చెప్పినప్పుడే డబ్బులు ఇస్తమని అంటున్నరు. దయచేసి నాకు దళితబంధు డబ్బులు పూర్తిగా ఇచ్చి ఆదుకోవాలె. నాకు ఎలాంటి ఆస్తిపాస్తులు, భూములు లేవు. ఈ షాపు ఒక్కటే మాకు దిక్కు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళితులకు పథకాలను అమలు చేస్తాం. గత ప్రభుత్వ హయాంలో సెప్టెంబర్లో 2వ విడుత లబ్ధిదారుల జాబితాను రూపొందించాం. ఇప్పటివరకు అమలులో ఎలాంటి పురోగతి లేదు.
గత ప్రభుత్వం అమలుచేసిన విధంగా దళితుల కోసం ఈ ప్రభుత్వం కూడా దళితబంధు పథకాన్ని అర్హులైన ప్రతి దళితుడికి అందించాలి. 2వ విడుతలో ఎంపికైన లబ్ధిదారుల కోసం అప్పటి ప్రభుత్వం నిధులు కూడా కేటాయించింది. జిల్లాలో 1100 మంది లబ్ధిదారులను గ్రౌండింగ్ చేసి వారు ఎన్నుకున్న యూనిట్లను అందజేయాలి. ఇప్పటికే అధికారులను, ప్రజాప్రతినిధులను కలిసి వినతిపత్రాలు ఇచ్చాం. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని అర్హులకు న్యాయం చేయాలి.