హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 12: ‘మన మంత్రులు సీతక్క, సురేఖ, కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఓరుగల్లు పౌరుషం కనిపించడంలేదు.. రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రలో కాకతీయ తోరణాన్ని తొలగిస్తామంటే అడ్డుకోవడంలేదు.. రాజముద్రను మార్చితే ఉద్యమిస్తాం’ అని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ హెచ్చరించారు. హనుమకొండలోని పార్టీ కార్యాలయంలో వరంగల్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్తో కలిసి సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ చరిత్రను మార్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. కాకతీయుల కళావైభవానికి చిహ్నంగా నిలిచే కళాతోరణాన్ని కొనసాగించకుంటే ఓరుగల్లు నుంచే పోరాటాలు చేపడతామన్నారు. కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులను కేసీఆర్ మిషన్ కాకతీయ కార్యక్రమం ద్వారా పూడికతీయించి సాగునీరు అందించారని గుర్తుచేశారు. ప్లేగువ్యాధి అంతరించినందుకు గుర్తుగా నిర్మించిన చార్మినార్ చిహ్నాన్ని తొలగిస్తామనడం మైనార్టీల మనోభావాలు దెబ్బతినేలా చేయడమేనని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసెంబ్లీలో కాకతీయ తోరణం, చార్మినార్ తొలగిస్తామనడం సరికాదని, వెంటనే ఈ ఆలోచనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ తల్లి, తెలంగాణ చిహ్నంలో మార్పులు చేస్తామని చెప్పడం కూడా సరైంది కాదన్నారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే పనికిరాని పనులు చేస్తున్నాడని, ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని, ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చే వరకు ప్రజల పక్షాన పోరాడుతామని చెప్పారు.
నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడిన ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ రాజకీయ పార్టీగా ఎదిగిందని, కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కోటి ఎకరాలకు నీళ్లు అందించారని బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కృష్ణా ప్రాజెక్టును కేంద్రానికి అప్పగిస్తున్నారని, మన నీళ్ల కోసం మరో ఉద్యమం చేయాలని, ఇందుకు నల్లగొండ సభ నుంచే బీఆర్ఎస్ పోరాటాలకు సిద్ధమవుతున్నదని చెప్పారు. మార్పు అంటూ చిహ్నాలు మార్చుతున్నారని, సాగునీటి ద్వారా లక్షల ఎకరాల్లో ధాన్యం పండించిన రైతులకు రైతుబంధు ఇవ్వకుండా ఆపారని విమర్శించారు. సంపద పెంచి, పేదలకు పంచాలన్న ఉద్దేశంతో ఉద్యమనేత కేసీఆర్ రైతుబంధును అందిస్తే, సీఎం రేవంత్రెడ్డి దళితబంధు, బీసీ, మైనార్టీబంధు మొత్తానికే నిలిపివేస్తున్నారని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేసేందుకు ఉద్యమిస్తామని, ప్రజలంతా నల్లగొండ సభకు స్వచ్ఛందంగా తరలిరావాలని, అక్కడి నుంచే బీఆర్ఎస్ పోరాటం ప్రారంభిస్తుందని తెలిపారు. సమావేశంలో జడ్పీ చైర్మన్ సుధీర్కుమార్, కుడా మాజీ చైర్మన్లు మర్రి యాదవరెడ్డి, సుందర్రాజ్ యాదవ్, రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వర్రావు, పులి రజినీకాంత్, కోన శ్రీకర్, పానుగంటి శ్రీధర్ పాల్గొన్నారు.