నర్సంపేట/వర్ధన్నపేట, మార్చి 9: మున్సిపాలిటీల్లో పారిశుధ్యం లోపించింది. నర్సంపేట, వర్ధన్నపేట పట్టణాల్లో పారిశుధ్య నిర్వహణ సరిగా లేక అధ్వానంగా మారింది. రోడ్లు, వీధులు, డ్రెయినేజీల్లో చెత్తాచెదారం పేరుకుపోయింది. దీంతో దోమలు విపరీతంగా పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నర్సంపేట మున్సిపాలిటీ పరిధి 24 వార్డుల్లో చెత్త పేరుకుపోయింది. నుంచి తడి, పొడి చెత్త సేకరించి తీసుకెళ్లాల్సిన ట్రాక్టర్లు వారానికోసారి వస్తున్నాయి. డ్రెయినేజీల్లో మట్టి, చెత్త పేరుకుపోయింది. దీంతో మురుగు నీరు నిలిచి దుర్వాసన వస్తోంది. ఈక్రమంలో దోమలు పెరిగి ప్రజలకు నిద్రలేకుండా చేస్తున్నాయి. ప్రజలు పలుమార్లు ఫిర్యాదులు చేస్తున్నా, నివారణకు మందు పిచికారీ చేయడం లేదు. చెత్త తొలగించాలని పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి. మురుగునీరు కాల్వల నుంచి అంబేద్కర్ సెంటర్, నెక్కొండ రోడ్డు, పాకాల సెంటర్లో రోడ్ల మీద ప్రవహిస్తోంది. ఇళ్ల మధ్య రోడ్లపై చెత్త కుప్పలను రోజుల తరబడి తొలగించకపోవడంతో ఫిర్యాదు చేసినా అశ్రద్ధ వహిస్తున్నారు. దోమలు కుట్టి జ్వరాల బారిన పడి ఆస్పత్రులకు వెళ్తున్న వారి సంఖ్య పెరుతోంది. పన్నుల శ్రద్ధ చూపే అధికారులు సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యం వహిస్తుండడంపై ప్రజలు ఆగ్రహిస్తున్నారు.
వర్ధన్నపేటలో..
వర్ధన్నపేట పట్టణంలోని వార్డుల్లో నెలలుగా డ్రెయినేజీలను శుభ్రం చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న వర్ధన్నపేట కేసీఆర్ పాలనలో మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయ్యింది. రూ.35 కోట్ల నిధులను కూడా మంజూరు చేయగా పట్టణంలోని ప్రధాన రహదారులు, వార్డుల్లోని రోడ్ల ఇరువైపులా డ్రెయినేజీలను నిర్మించి పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించారు. కానీ ప్రస్తుతం అధికారులు, పాలక మండలి పారిశుద్ధ్య నిర్వహణపై పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. వారికి ఎన్నిసార్లు చెప్పినా ఫలితం ఉండడంలేదని స్థానికులు వాపోతున్నారు. 10వ వార్డుతోపాటు పలు వార్డుల్లో డ్రెయినేజీలను పారిశుధ్య కార్మికులు శుభ్రం చేయడంలేదు. దీంతో మురుగునీరు నెలల తరబడి నిలుస్తోంది. వ్యర్థాలు కూడా పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది. కౌన్సిలర్లు రాజకీయాలు చేస్తూ కాలం వెళ్లబుచ్చుతున్నారే తప్ప ప్రజా సమస్యలను పట్టించుకోవడంలేదని స్థానికులు ఆగ్రహిస్తున్నారు. కానీ పాలకులు, అధికారులు పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం తమకు శాపంగా మారిందని ప్రజలు అంటున్నారు. ఈ క్రమంలో ఎవరి ఇళ్ల ముందు కాల్వల్లో పేరుకుపోయిన చెత్తను వారే తొలగించుకుంటున్నారు. అధికారులు, పాలకులు సాకులు చెబుతున్నారని మండిపడుతున్నారు.