అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం జరుగనుండగా, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బుధవారం సాయంత్రమే ఆయా పోలింగ్ కేంద్రాలకు సామగ్రిని తరలించారు. ఈ దఫా అభ్యర్థుల జయాపజయాలకు మహిళల ఓట్లే కీలకం కానున్నాయి. వరంగల్ జిల్లాలో 7,56,608 మంది, హనుమకొండ జిల్లాలో 5,08,347 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 6,42,239 మంది మహిళలే ఉన్నారు. మొత్తం ఐదు నియోజకవర్గాల్లో 1,275 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. అన్ని సెంటర్లలో వెబ్కాస్టింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఓటర్ల కోసం వసతులు.. సేవలందించేందుకు విద్యార్థులను నియమించారు. ప్రత్యేకంగా 48 మహిళ, మోడల్, యువత, దివ్యాంగుల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. బరిలో 102 మంది అభ్యర్థులు నిలువగా, మూడు నియోజకవర్గాల్లో రెండో ఈవీఎంను వినియోగిస్తున్నారు. 6,161 మంది పీవోలు, ఏపీవోలు, ఓపీవోలు ఎన్నికల విధులు నిర్వర్తించనున్నారు. కాగా, ప్రశాంత పోలింగ్ నిర్వహించేందుకు పటిష్ట భద్రత కల్పించినట్లు రెండు జిల్లాల ఎన్నికల అధికారులు ప్రావీణ్య, సిక్తా పట్నాయక్ వెల్లడించారు.
వరంగల్, నవంబర్ 29(నమస్తేతెలంగాణ) : శాసనసభ ఎన్నికల్లో కీలకఘట్టమైన పోలింగ్ గురువారం జరుగనుంది. ఈ నేపథ్యంలో పోలింగ్ అధికారులు, సిబ్బంది ఎన్నికల సామగ్రితో బుధవారం సాయంత్రం పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ నిర్వహణ కోసం ప్రతి కేంద్రంలో ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. జిల్లాలో నర్సంపేట, వరంగల్తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గాలు ఉన్నాయి. వీటి పరిధిలో 7,56,608 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు 3,72,173, మహిళలు 3,84,076, ఇతరులు 359 మంది ఉన్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మొత్తం ఓటర్లలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నారు. మూడు నియోజకవర్గాల్లో 791 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో నర్సంపేటలో 283, వరంగల్తూర్పులో 230, వర్ధన్నపేటలో 278 ఉన్నట్లు అధికారులు తెలిపారు. నర్సంపేటలో 167, తూర్పులో 89, వర్ధన్నపేటలో 145 లొకేషన్లలో కేంద్రాలు పనిచేస్తాయని చెప్పారు. 161 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా అధికారులు గుర్తించారు. అన్ని లొకేషన్లలో లైవ్ వెబ్ కాస్టింగ్తో పాటు భారీ పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. పోలింగ్ నిర్వహణ, పర్యవేక్షణ కోసం ఆయా నియోజకవర్గంలో సెక్టార్లు, రూట్లు గుర్తించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకు అవసరమైన తాగునీరు, టాయిలెట్, ఇతర వసతులు కల్పించారు. దివ్యాంగుల కోసం ర్యాంప్, ట్రై సైకిళ్లు ఏర్పాటు చేశారు. వీరికి సహాయార్థం 800 మంది విద్యార్థుల సేవలను వినియోగించుకుంటున్నట్లు ప్రకటించారు.
జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 59 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. అత్యధికంగా తూర్పు నుంచి 29 మంది, నర్సంపేట నుంచి 16, వర్ధన్నపేట నుంచి 14 మంది రంగంలో ఉన్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అభ్యర్థులు ఎక్కువ మంది పోటీలో ఉండడం వల్ల తూర్పు, నర్సంపేట నియోజకవర్గంలో ప్రతి పోలింగ్ కేంద్రంలో రెండో ఈవీఎంను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూడు నియోజకవర్గాల్లో 3,851 మంది అధికారులు, సిబ్బందిని నియమించారు. వీరిలో ప్రిసైడింగ్ అధికారులు 963, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు 959, ఇతర ప్రిసైడింగ్ అధికారులు 1,929 మంది ఉన్నారు. వీరికి 1629 బ్యాలెట్ యూనిట్లు, 987 కంట్రోల్ యూనిట్లు, 1107 వీవీప్యాట్లను కేటాయించారు. వీటితో పోలింగ్ అధికారులు, సిబ్బంది బస్సులు, కార్ల ద్వారా తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకున్నారు. జిల్లాలో మహిళల ద్వారా నిర్వహించే మహిళా పోలింగ్ కేంద్రాలు నియోజకవర్గానికి ఐదేసి చొప్పున 15, నియోజకవర్గానికి ఒకటి లెక్కన 3 దివ్యాంగుల పోలింగ్ కేంద్రాలు, నియోజకవర్గానికి ఐదేసి చొప్పున 15 మోడల్ పోలింగ్ కేంద్రాలు, నియోజకవర్గానికి ఒకటి లెక్కన 3 యువ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ 36 పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఈ మేరకు ఆమె బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బుధవారం పోలీసు భద్రత నడుమ వాహనాల్లో ఈవీఎంలను సెక్టోరల్, పోలింగ్ అధికారులు, సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తరలించినట్లు తెలిపారు. ఓటర్లందరూ తప్పనిసరిగా పోలింగ్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించామని తెలిపారు. ఓటు ప్రాముఖ్యతపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, జిల్లాలో అత్యధిక పోలింగ్ శాతం నమోదవుతుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో మనం వేసే ఓటు మన భవిష్యత్తును నిర్దేశిస్తుందని, ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా ప్రజలు ఆలోచించి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.
హనుమకొండ : జిల్లాలోని పోలింగ్ స్టేషన్ల ఆధారంగా ఈవీఎంలను సమకూర్చారు. మొత్తం ఎన్నికల ప్రక్రియకు అవసరమయ్యే సామగ్రిని సిద్ధం చేశారు. సామగ్రిని పంపిణీ చేసేందుకు నియోజకవర్గానికి ఒకటి చొప్పున డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో 48 మంది సెక్టోరల్ అధికారులను నియమించారు. ఓటింగ్ శాతం పెంచడంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. పోలింగ్ కేంద్రాల వద్ద వికలాంగులు, వృద్ధులకు రవాణా సౌకర్యం కల్పించడంతో పాటు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి కేంద్రం వద్ద వీల్చైర్ను అందుబాటులో ఉంచారు. ఒక్కొక్క నియోజకవర్గానికి మహిళల కోసం ఐదు, పీడబ్ల్యూడీ వారికి ఒకటి, మాడల్ పోలింగ్ స్టేషన్లు ఐదు, యువత కోసం ఒకటి చొప్పున ఏర్పాటు చేశారు. వరంగల్ ఎనుమాముల మార్కెట్ యార్డులో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. పరకాల, పశ్చిమ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 5,08,347 మంది ఓటర్లు ఉన్నారు.
హనుమకొండ జిల్లాలో 484 పోలింగ్ కేంద్రాలున్నాయి. పరకాల నియోజకవర్గంలో 155 పోలింగ్ లొకేషన్లలో 239 పోలింగ్ స్టేషన్లు, వరంగల్ పశ్చిమలో 244 పోలింగ్ కేంద్రాలతో పాటు ఒక అగ్జిలరీ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. పరకాల పట్టణ పరిధిలో 56, గ్రామీణ ప్రాంతంలో 183, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 245 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. పరకాల నియోజకవర్గంలో 44, పశ్చిమ నియోజకవర్గంలో 61 పోలింగ్ స్టేషన్లు సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి వెబ్కాస్టింగ్ చేస్తున్నారు. పరకాల నియోజకవర్గం నుంచి 28 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, ఇక్కడ రెండు బ్యాలెట్ యూనిట్లు, పశ్చిమలో 15 మంది బరిలో ఉండగా ఒక బ్యాలెట్ యూనిట్ను వినియోగిస్తున్నారు.
రెండు నియోజక వర్గాలలో 2300 మంది ఉద్యోగులు విధుల్లో పాల్గొంటున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఒక ప్రిసైడింగ్ అధికారితో పాటు సహాయ ప్రిసైడింగ్ అధికారి, ఇద్దరు పోలింగ్ సహాయకులను నియమించారు. మరో 20 శాతం మందిని రిజర్వుగా నియమించారు. జిల్లాలో 10 పోలింగ్ కేంద్రాలను ప్రత్యేకించి మహిళలకు కేటాయించారు. పరకాల నియోజకవర్గంలో దామెర జడ్పీహెచ్ఎస్ 118 పోలింగ్ స్టేషన్, జడ్పీహెచ్ఎస్ ధర్మారంలోని 166 పీఎస్, సంగెంలోని మండల పరిషత్ స్కూల్లో 214 పీఎస్, ఆత్మకూరు జూనియర్ కళాశాలోని 104 పీఎస్, పరకాలలోని ఎంపీయూఎస్ 50 పీఎస్లు ఉన్నాయి. దివ్యాంగులకు రాయపర్తి ఎంపీపీఎస్లోని 240 పీఎస్ను కేటాయించారు. మాడల్ పోలింగ్ స్టేషన్లుగా జడ్పీహెచ్ఎస్ గీసుకొండ 160 పీఎస్, సంగెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని 27 పీఎస్, ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని 105 పీఎస్, మాదారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భవన్లోని 36 పీఎస్లను ఏర్పాటు చేశారు. యువతకు ప్రత్యేకంగా ఊరుగొండ జడ్పీహెచ్ఎస్ 110 పోలింగ్ స్టేషన్ కేటాయించారు. పశ్చిమ నియోజకవర్గంలో మహిళల కోసం ప్రత్యేకంగా వడ్డేపల్లిలో పింగిళి ప్రభుత్వ మహిళా కళాశాలలో 180 పోలింగ్ స్టేషన్, హనుమకొండ గోపాల్పుర్ రోడ్డులోని బేబీ సైనిక్ హైస్కూల్లో ఒకటో పోలింగ్ స్టేషన్, సెయింట్ జోసఫ్ హైస్కూల్లోని 28 పీఎస్, పట్టణ ప్రకృతి వనంలోని 189 పీఎస్, సెయింట్ పీటర్స్ సెంట్రల్ పబ్లిక్ స్కూల్లోని 228 పీఎస్లను ఏర్పాటు చేశారు. దివ్యాంగుల కోసం ఫాతిమానగర్లోని బిషప్ బెరెట్టా హైస్కూల్లో 175వ పోలింగ్ స్టేషన్ను కేటాయించారు. మాడల్ పోలింగ్ కేంద్రాలుగా ఫాతిమానగర్లోని సెయింట్ గ్యాబ్రియల్స్లోని 138 పీఎస్ను, సోమిడి ప్రభుత్వ హైస్కూల్లోని 167 పీఎస్ను, జులైవాడలోని ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లోని 116 పీఎస్ను, కేయూ యూనివర్సిటీ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలోని 6పీఎస్ను, హనుమకొండ యాదవ నగర్లోని ప్రోగ్రెస్ హైస్కూల్లోని 68 పీఎస్లను ఏర్పాటు చేశారు. యువత కోసం కాజీపేటలోని సెయింట్ ఆన్స్ హైస్కూల్లోని 156 పోలింగ్ సెంటర్ను కేటాయించారు.