వ్యవసాయంలో అధిక దిగుబడుల కోసం రైతులు సరికొత్త విధానాలను అవలంబిస్తున్నారు. ముఖ్యంగా కూరగాయల సాగులో అంటుకట్టే విధానాన్ని పాటిస్తూ మంచి లాభాలు పొందేందుకు ‘కృషి’ చేస్తున్నారు. బీర, సోర, కాకర వంటి తీగ జాతి పంటల సాగులో ఈ పద్ధతిని అమలు చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడులు సాధించడంలో పోటీ పడుతున్నారు. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామానికి చెందిన రైతు బొమ్మినేని రామకృష్ణారెడ్డి కాయగూరల సాగులో వినూత్న పద్ధతులు అవలంబిస్తూ అనూహ్య దిగుబడులు పొందుతూ ఇతర రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
వరంగల్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించడంపై రైతులు దృష్టి పెడుతున్నారు. పంటల సాగులో సరికొత్త విధానాలను అనుసరిస్తున్నారు. పక్కా ప్రణాళికతో ఆశించిన ఆదాయాన్ని పొందుతున్నారు. ముఖ్యంగా కాయగూరల సాగులో ఒక్క సీజన్లోనే ఎకరానికి సుమారు రూ.15 లక్షల ఆదాయం సైతం సాధిస్తున్నారు. వీరిలో వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామానికి చెందిన రైతు బొమ్మినేని రామకృష్ణారెడ్డి ఒకరు. అంటుకట్టే పద్ధతి ద్వారా అధిక దిగుబడులు సాధిస్తూ కాయగూరల సాగులో ఆదర్శంగా నిలుస్తున్నారు. బీర, సోర, కాకర వంటి తీగజాతి పంటల సాగులో ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వరంగల్ నగరానికి సమీపంలో ఉన్న గీసుగొండ మండలంలోని పలు గ్రామాల్లో రైతులు కాయగూర పంటలు సాగు చేస్తున్నారు. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడులు సాధించడంలో పోటీపడుతున్నారు. ఈ క్రమంలో అనేక వినూత్న పద్ధతులు అవలంబిస్తున్నారు. రామకృష్ణారెడ్డి సైతం అంటుకట్టే విధానం ద్వారా ఏడాది నుంచి కాయగూరల సాగులో అనూహ్య దిగుబడులు పొందుతున్నారు. ఒక్కో సీజన్లో బీర వంటి పంట నుంచి ఎకరానికి 25 టన్నులకుపైగా దిగుబడులు సాధిస్తూ ప్రత్యేకతను చాటుతున్నారు. రామకృష్ణారెడ్డి కుటుంబానికి గ్రామంలో 12 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఏటా వానాకాలం, యాసంగి సీజన్లలో పూర్తిగా కాయగూరలు సాగు చేస్తున్నారు.
అధిక దిగుబడుల కోసం ఎప్పటికప్పుడు ఆధునాతన పద్ధతులు తెలుసుకుంటూ ఆచరణలో పెడుతున్నారు. ఈ క్రమంలో గతేడాది యాసంగిలో అంటుకట్టు(గ్రాఫ్టింగ్) విధానాన్ని అనుసరించారు. తొలిసారి 12ఎకరాల్లో అంటుకట్టే పద్ధతిలో బీర, సోర, కాకర, బోడకాకర పంటలు సాగు చేశారు. ఏడెకరాల్లో బీర, ఐదెకరాల్లో ఇతర పంటలు పండించారు. బీర పంట ద్వారా ఒక్కో ఎకరంలో 25-30 టన్నుల దిగుబడులు పొందారు. ఈ లెక్కన ఏడు ఎకరాల్లో సుమారు 200 టన్నుల దిగుబడులు సాధించారు. వ్యాపారులు రామకృష్ణారెడ్డి పంట చేను వద్దకే వచ్చి బీరకాయలను హోల్సేల్గా కొనుగోలు చేశారు. ఆ సమయంలో బీరకాయలు కిలో ధర రూ.50 నుంచి రూ.60 చొప్పున పలికింది. దీంతో ఏడెకరాల్లో బీర పంట ద్వారా రూ.కోటి ఆదాయం వచ్చింది. బీర సాగుకు రామకృష్ణారెడ్డి లేబర్ సహా పెట్టుబడి మొత్తం ఎకరానికి రూ.2.50 లక్షల నుంచి రూ.3లక్షల చొప్పున ఏడెకరాలకు రూ.20లక్షల దాకా ఖర్చు చేశారు. పెట్టుబడి పోను రూ.80లక్షల ఆదాయం రావడం విశేషం. అధిక దిగుబడికి తోడు మార్కెట్లో బీరకు మంచి ధర ఉండడం వల్ల సదరు రైతుకు ఈ ఆదాయం సమకూరింది. గతేడాది యాసంగిలో సోర, కాకర, బోడకాకర పంటల సాగులోనూ అధిక దిగుబడులతో ఆశించిన ఆదాయాన్ని పొందారు. ఈ ఏడాది వానకాలంలో బీర 6, కాకర 4, సోర 2 ఎకరాల్లో సాగు చేశారు. గత యాసంగి మాదిరిగానే దిగుబడులు సాధించారు. ధర కలిసి రాకపోవడంతో కొంత ఆదాయం తగ్గింది. బీరకాయ కిలో ధర రూ.30 చొప్పున లభించింది. ప్రస్తుతం యాసంగి కోసం 12ఎకరాల్లో అంటుకట్టే పద్ధతి ద్వారా బీర సాగు చేశారు. ఇప్పటికే 25రోజులు గడవగా మరో పదిహేను రోజుల్లో దిగుబడులు రానున్నాయి. ఈసారి మార్కెట్లో బీరకాయ ధర కిలోకు రూ.70 నుంచి రూ.80 పలికే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఒక మొక్క భాగాన్ని మరో మొక్కతో అంటుకడతారు. తెగుళ్లను తట్టుకుని అధిక దిగుబడులు సాధించడం ఈ విధానం లక్ష్యం. ఇందులో భాగంగా తెగుళ్లను తట్టుకునే సాధారణ విత్తనం మొలక(జంగిల్ బ్రీడ్)కు అధిక దిగుబడులనిచ్చే హైబ్రీడ్ తీగను అంటుకట్టడం ద్వారా పంట తెగుళ్లను తట్టుకుని అధిక దిగుబడులు ఇస్తుందని పరిశోధనల్లో తేలింది. ఈ నేపథ్యంలో ఇతర రాష్ర్టాల్లో ప్రత్యేకంగా అంటుకట్టే పద్ధతిన సాగు చేసే కాయగూర మొక్కలను రైతులకు అందించేందుకు నర్సరీలు వెలిశాయి. కొందరు రైతులు నర్సరీలకు వెళ్లకుండా తామే హైబ్రీడ్, జంగిల్ బ్రీడ్ విత్తనాలను నాటి మొలకెత్తిన తర్వాత అంటుకట్టే పద్ధతి పాటిస్తున్నారు. ఈ క్రమంలో బీర రైతులు లైఫ్ ఎక్కువగా ఉండే నేతి బీర వంటి జంగిల్ బ్రీడ్ను రూట్ మొక్కగా వాడుతున్నారు. దీనికి హైబ్రీడ్ బీర మొక్క తీగను అంటుకట్టి సాగు చేస్తున్నారు. సోర, కాకర వంటి ఇతర కాయగూరల పంటలను కూడా ఇదే పద్ధతిలో పండిస్తున్నారు. సాధారణ పద్ధతిలో సాగు చేసే బీర పంట కాలం మూడు నెలలు. ఒక సీజన్లో ఎకరానికి దిగుబడి ఐదు టన్నుల వరకు వస్తున్నది. అంటుకట్టే పద్ధతిలో సాగు చేసే బీర పంట కాలం నాలుగు నెలలు. దిగుబడి 20టన్నులు దాటుతుంది. ఉద్యానశాఖ జిల్లా అధికారి శ్రీనివాసరావు, స్థానిక ఉద్యాన అధికారి తిరుపతి పలుమార్లు రామకృష్ణారెడ్డి సాగుచేస్తున్న కాయగూర పంటలను పరిశీలించారు. కాయగూరల సాగులో ఆయనను ఆదర్శ రైతుగా గుర్తించారు.
హైదరాబాద్లో మా స్నేహితుడున్నా డు. కొన్నేళ్ల నుంచి తాను అంటుకట్టు పద్ధతిలో కాయగూరలు సాగు చేస్తు న్నాడు. అది చూసి నేను గతేడాది నుంచి ఇక్కడ అంటుకట్టు పద్ధతిలో కూరగాయలు సాగు చేస్తున్న. సాధార ణ సాగుకంటే ఈ విధానం ద్వారా 400శాతం అధిక దిగుబడులు వస్తు న్నాయి. గత యాసంగిలో బీర ఎకరానికి 25 నుంచి 30 టన్నుల దిగుబడులు వచ్చింది. సాధారణంగా సాగుచేసే బీర పంటలో దిగుబడి ఎకరానికి ఐదు టన్నులకు మించదు. గత యాసంగిలో బీర కిలోకు రూ.50 నుంచి రూ.60 వరకు ఉండడం వల్ల ఏడు ఎకరాల్లో పెట్టుబడి రూ.80 లక్షలు మిగిలాయి. ఈ సీజన్లో 12ఎకరాల్లో అంటుకట్టు విధానంలోనే బీర సాగు చేసిన. మరో పదిహేను రోజుల్లో దిగుబడి మొదలవుతది. గత యాసంగి కంటే తగ్గదు. ప్రస్తుతం మార్కెట్లో బీర కిలోకు రూ.70 నుంచి రూ.80 ఉంది. ఈ లెక్కన మంచి ఆదాయం వస్తుంది.