సుబేదారి, ఫిబ్రవరి 9: నకిలీ పత్రాలు సృష్టించి భూ కబ్జాకు పాల్పడిన ఏడుగురిని టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ఫోర్స్ ఏసీపీ జితేందర్రెడ్డి నిందితుల వివరాలను గురువారం వెల్లడించారు. కడిపికొండకు చెందిన కోతుల కుమారస్వామి రిటైర్డ్ ఉద్యోగి. 1993లో కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముచ్చర్ల రోడ్డు సమీపంలో ఉన్న సర్వేనంబర్ 207లో 10 గుంటల భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఆ భూమిలో గుర్తు తెలియని వ్యక్తులు మొరం పోస్తున్నారని తెలుసుకొని అక్కడికి వెళ్లి ఆయన ఆరా తీశాడు.
మేకల వెంకటేశ్, నన్నెబోయిన రమేశ్ ఈ భూమి తమదేనని బాధితుడు కుమారస్వామిని బెదిరించారు. తన వద్ద ఉన్న రిజిస్ట్రేషన్ పత్రాలతో పోలీసు కమిషనర్ రంగనాథ్కు ఆయన ఫిర్యాదు చేశాడు. సీపీ ఆదేశంతో టాస్క్ఫోర్స్ పోలీసులు విచారణ చేపట్టగా నకిలీ పత్రాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పలివేల్పులకు చెందిన నన్నెబోయిన రమేశ్, కరీమాబాద్కు చెందిన మేకల వెంకటేశ్ కబ్జాకు పథకం రూపొందించారు. ఇద్దరు రమేశ్ దగ్గరి బంధువు ఉదయ్తో కలిసి ఉదయ్ తండ్రి 1993లో ఆ భూమిని కొనుగోలు చేసినట్లు నకిలీ పత్రాలు సృష్టించారు. కోర్టులో తాత్కాలిక అటెండర్గా పనిచేస్తున్న విజయ్ని పరిచయం చేసుకొని, అతడి ద్వారా న్యాయవాది దగ్గర అటెండర్గా పనిచేస్తున్న సురేశ్ నుంచి రెండు పాత స్టాంపు పేపర్లు రూ.8 వేలకు కొనుగోలు చేశారు.
బాధితుడు కుమారస్వామికి చెందిన 10 గుంటల భూమిని ముమ్మడి వెంకటరత్నం నుంచి ఉదయ్ తండ్రి రూ.1.50 లక్షలకు కొనుగోలు చేసినట్లు నిందితులు నకిలీ పత్రాలు సృష్టించారు. ఈ నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో చలాన్ కట్టి నోటరీ రెగ్యులరైజేషన్ చేసుకున్నారు. ఈ భూమిని రూ.26లక్షల 5వేలకు అమ్ముతున్నామని సేల్ డీడ్ చేయించారు. పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా నకిలీ పత్రాలతో కుమారస్వామి భూమిని కబ్జా చేశామని రమేశ్, వెంకటేశ్ ఒప్పుకున్నారు. కబ్జాకు పాల్పడిన నిందితులు నన్నెబోయిన రమేశ్, మేకల వెంకటేశ్, హసన్పర్తి మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన నన్నెబోయిన ఉదయ్, న్యాయవాది దగ్గర అటెండర్గా పనిచేస్తున్న వరంగల్ కరీమాబాద్కు చెందిన పాము సురేశ్, దేశాయిపేటకు చెందిన బొక్క విజయ్, హనుమకొండకు చెందిన ఔట్సోర్సింగ్ ఉద్యోగి గాడిపల్లి రామకృష్ణ, కాజీపేట విష్ణుపురికి చెందిన సోమ రమేశ్ను అరెస్టు చేశారు
. వారి నుంచి నకిలీ నోటరీ పత్రాలు, రూ.1.95 లక్షల నగదు, సేల్ డీడ్, ఏపీ పేరుతో ఉన్న ఓల్డ్ స్టాంపు పేపర్, కంప్యూటర్ను టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేసిన టాస్క్ఫోర్స్ ఏసీపీ జితేందర్రెడ్డి, ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్సైలు నిసార్పాషా, లవన్కుమార్, హెడ్ కానిస్టేబుళ్లు స్వర్ణలత, కానిస్టేబుళ్లు రాజు, శ్రీనివాస్, రాజేశ్, శ్యామ్, నవీన్, శ్రీధర్ను పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్ అభినందించారు.