పోచమ్మమైదాన్, డిసెంబర్ 15 : ఐదువేల సంవత్సరాల క్రితం గోదాదేవి ఆచరించి, లోకానికి అందించిన తిరుప్పావై వ్రతం పరమ పవిత్రమని ప్రముఖ సంస్కృత, సంప్రదాయ పండితుడు సముద్రాల శఠగోపాచార్యులు అన్నారు. ధనుర్మాసోత్సవాలను పురస్కరించుకొని హనుమకొండలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర దివ్యాలయంలో తిరుప్పావై ప్రవచన కార్యక్రమ ప్రారంభోపన్యాసాన్ని గురువారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీతాదేవి, రుక్మిణీదేవి శ్రీరాముడు, కృష్ణులను వివాహం చేసుకున్నారని తెలిపారు.
అయితే, గోదాదేవి మాత్రం కదలక, మెదలక స్థిరంగా ఉండే రంగనాథుడిని వివాహం చేసుకున్న మహనీయురాలని తెలిపారు. ఆలయ కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ ఈ నెల 16 నుంచి జనవరి 14 వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు తిరుప్పావై ప్రబంధంలోని విశేషార్థాలంతో పాటు సంప్రదాయ విశేష గ్రంథాల్లోని ముఖ్య ఘట్టాలను వివరిస్తారని తెలిపారు. ఈ ఉత్సవాలకు నగరానికి చెందిన భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.