గోవిందరావుపేట, ఫిబ్రవరి 27 : మేడారం జాతర సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.105 కోట్లను దుర్వినియోగం చేసిందని, జరిగిన అన్ని అభివృద్ధి పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ములుగు జిల్లా అధ్యక్షుడు దుగ్గి చిరంజీవి డిమాండ్ చేశారు. మంగళవారం పస్రాలో జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతరలో సరైన సౌకర్యాలు లేక భక్తులు అనేక ఇబ్బందులకు గురయ్యారన్నారు. రూ.105 కోట్లను ఖర్చు చేయగా సౌకర్యాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయని, అభివృద్ధి ఎక్కడ జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
జాతర అనంతరం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పారిశుధ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నిత్యం దర్శనానికి వచ్చే భక్తుల కోసం మేడారంలో 100 పడకల దవాఖాన నిర్మించి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు వంక రాములు, బెజ్జరి దామోదర్, ఊకె ప్రభాకర్, ఆలెం అశోక్, కుర్సం ప్రవీణ్, తోలెం కృష్ణయ్య, ఇర్ప శ్రీనివాస్, కోటే కృష్ణారావు, చందా లక్ష్మీనారాయణ, పూనెం నగేశ్ పాల్గొన్నారు.