సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ సర్కారు పాలన అందిస్తున్నది.. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అందరి బంధువైంది. చెరువులను బాగు చేసి, గోదావరి జలాలను పొలాలకు మళ్లించి.. పెట్టుబడి సాయం అందించి, బీమా చేయించి రైతులకు, వారి కుటుంబాలకు పెన్నిధిలా నిలిచింది. కల్యాణలక్ష్మితో పేదింటి ఆడబిడ్డ పెండ్లి రంది తీర్చింది. సకల సౌకర్యాల కల్పించిన దవాఖానల్లో పురుడు పోయించి.. ఆర్థిక సాయం కూడా అందిస్తూ తల్లిదండ్రులకు బిడ్డ కానుపు భారం దించింది. వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, దివ్యాంగుల జీవనానికి ‘ఆసరా’ అయింది. వనరులు, వసతులు సమకూర్చి కులవృత్తులకు జీవం పోసింది. ప్రభుత్వ బడులను బలోపేతం చేసి.. గురుకులాలు నెలకొల్పి కార్పొరేట్ స్థాయి విద్యనందిస్తూ విద్యార్థుల భవిష్యత్కు బంగారు బాటలు వేసింది. ‘దళితబంధు’తో దళితుల దశ మార్చుతున్నది. సబ్బండ వర్గాల సంక్షేమం కోసం దేశంలోనే ఎక్కడా లేని విధంగా లెక్కకందని సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ ప్రపంచమే తెలంగాణవైపు చూసేలా చేసింది.
– వరంగల్, జూన్ 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
వరంగల్, జూన్ 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలి అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నది. దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి పనులతో సంపదను పెంచి దాన్ని పేద వర్గాలకు పంచే లా సీఎం కేసీఆర్ పాలన సాగుతున్నది. ప్రతి వర్గానికి ఆర్థికంగా అండగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేనన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. అందుకే తెలంగాణ ఇప్పుడు సంక్షేమంలో దేశానికి దిక్చూచిగా నిలిచింది.
రైతులకు దన్నుగా..
తెలంగాణ ఏర్పడిన నాటి నుంచే వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నది. రైతు బంధు కింద ప్రతి ఎకరాకు ఏడాదికి రూ.10 వేలు ఇస్తున్నది. రైతుబీమాతో అన్నదాతల కుటుంబాలకు రాష్ట్ర సర్కారు అండగా నిలుస్తున్నది. ఏదైనా కారణంతో రైతు చనిపోతే బాధిత కుటుంబానికి రూ.5లక్షల చొప్పున అందిస్తున్నది. వడ్లకు కనీస మద్దతు ధర కల్పించే లక్ష్యంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఊరికో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసింది. ప్రతి ఎకరా సాగుకు యోగ్యంగా ఉండేందుకు వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ ఇస్తున్నది. వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ కోసం గోదాములను నిర్మించింది. గొర్రెల పంపిణీతో గొల్లకుర్మలకు, చేప పిల్లల పంపిణీతో మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపింది.
కొండంత ‘ఆసరా’..
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం సామాజిక పెన్షన్లను ఇస్తున్నది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత, బీడీ కార్మికులు, బోధకాలు, ఎయిడ్స్ బాధితులకు ప్రతి నెల రూ.2016 చొప్పున, దివ్యాంగులకు రూ.3016 చొప్పున ప్రభుత్వం ఇస్తున్నది. పింఛను పొందుతున్నవారు ఎవరిపైనా ఆధారపడకుండా ధీమాతో బతుకుతున్నారు.
విద్యార్థులకు ఊతం..
ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు నాణ్యమైన సన్న బియ్యంతో పౌష్టికాహారాన్ని అందిస్తున్నది. గిరిజన విద్యార్థులకు పోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్, బెస్ట్ అవెలబుల్ స్కీం ద్వారా ఆర్థికసాయం చేస్తున్నది. విద్యార్థుల ఉన్నత చదువులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లేందుకు అంబేద్కర్ ఓవర్సీస్ పథకం ద్వారా ఊతమిస్తున్నది.
దళితబంధుతో దర్జా..
ఒక్కో దళిత కుటుంబానికి రూ.10లక్షల చొప్పున దళితబంధు ద్వారా ప్రభు త్వం అందిస్తున్నది. దళితులు సొంతంగా వ్యాపారాలు, ఇతర ఉపాధి మార్గాలను ఎంచుకొని ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తున్నది. యూనిట్లను ప్రారంభించుకున్న దళితులు తమ సొంతకాళ్లపై తాము నిలబడడమే కాకుండా, మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నారు. దళితబంధు తెచ్చిన మార్పుతో దర్జాగా బతుకుతున్నారు.
మహిళలు, పిల్లలకు..
రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ఆడపిల్లల పెండ్లి కోసం తల్లిదండ్రులు అప్పులపాలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తున్నది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో ఆడపిల్లల పెండ్లి కోసం ఒక్కొక్కరికి రూ.1,00116 చొప్పున ఇస్తున్నది. దివ్యాంగులైన ఆడపిల్లలకు రూ.1,25,145 చొప్పున ఇస్తున్నది. ఐసీడీఎస్ ప్రాజెక్టులు, అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ఒక పూట సంపూర్ణ భోజనాన్ని సమకూర్చుతున్నది. గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు, మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు అందిస్తున్నది.
వైద్యం, ఆరోగ్యం..
ప్రభుత్వ ప్రసూతి దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పించింది. పలు దవాఖానల్లో బ్లడ్ బ్యాంకులను ప్రారంభించింది. టీ డయాగ్నస్టిక్ హబ్, రేడియాలజీ ల్యాబ్లు అందుబాటులోకి తెచ్చింది. డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసి బాధితులకు కొండంత భరోసాగా నిలిచింది. పీహెచ్సీ, సీహెచ్సీల్లో పడకలను పెంచింది. ఓరుగల్లులో రూ.వెయ్యి కోట్లకు పైగా నిధులతో అత్యాధునిక, అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను నిర్మిస్తున్నది.
కార్మికులను కంటికిరెప్పలా..
భవన, ఇతర నిర్మాణ కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నది. వీరికోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వివిధ పథకాలను అమలు చేస్తున్నది. నాయీ బ్రాహ్మణులు, రజకులకు 257 యూనిట్ల చొప్పున ఉచిత కరెంట్ ఇస్తున్నది.
డబుల్ బెడ్రూం ఇండ్లు..
నిరుపేదల సొంతిటికలను సాకారం చేసేందుకు ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్లను సౌకర్యవంతంగా నిర్మించి ఇస్తున్నది. ఇప్పటికే ఉమ్మడిజిల్లాలో చాలాచోట్ల ఇండ్లల్లో లబ్ధిదారులు నివాసముంటున్నారు. కొన్నిచోట్ల ఇండ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ ఏడాది చివరి వరకు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నది.
నేడు ‘సంక్షేమ సంబురాలు’..
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 9 శుక్రవారం రోజున ‘తెలంగాణ సంక్షేమ సంబురాలు’ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వం అందించిన ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి తదితర సంక్షేమ పథకాల లబ్ధిదారులతో సభలు నిర్వహించనుంది. సంక్షేమ పథకాలతో లబ్ధిదారులకు జరిగిన మేలును వివరించనుంది.