మహిళల రక్షణతో పాటు వారి ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. ఇందులో భాగంగా గత సంవత్సరం మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న రాష్ట్ర వ్యాప్తంగా మహిళా క్లినిక్లను ఏర్పాటు చేసింది. వరంగల్ జిల్లాలో తొలుత నాలుగు, హనుమకొండ జిల్లాలో ఐదు క్లినిక్లు ప్రారంభించగా, తాజాగా మరో ఐదు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి మంగళవారం ఇక్కడ ప్రత్యేకంగా మహిళలకు 8 రకాల వైద్య సేవలు అందిస్తున్నారు. చెకప్ వివరాలను ప్రత్యేక యాప్లో నమోదు చేస్తూ, ఎప్పటికప్పుడు టీ-డయాగ్నోస్టిక్ సెంటర్లకు శాంపిళ్లను పంపిస్తున్నారు. రెండు జిల్లాల్లో ఇప్పటికే 19,492 మందికి పరీక్షలు చేశారు. క్యాన్సర్, థైరాయిడ్ బాధితులను వరంగల్ ఎంజీఎం దవాఖానతో పాటు హైదరాబాద్కు రెఫర్ చేస్తున్నారు. కాగా, ఖరీదైన వైద్యం పూర్తి ఉచితంగా అందిస్తుండడంతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ సర్కారుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
– వరంగల్ (నమస్తేతెలంగాణ)/ వరంగల్, సెప్టెంబర్ 22
వరంగల్, సెప్టెంబర్ 22(నమస్తేతెలంగాణ) : ప్రతి మహిళ ఆరోగ్యంతో ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను అమల్లోకి తెచ్చింది. వీటిలో ఆరోగ్య మహిళ కార్యక్రమం ఒకటి. ఇది అతివలకు ప్రత్యేక వైద్య సేవలపై అభయం ఇస్తున్నది. ప్రతి మంగళవారం ప్రత్యేక క్లినిక్లలో వైద్య సేవలను పొందుతున్నారు. మహిళలకు ఎంతో ఉపయోగపడుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం దశల వారీగా విస్తరిస్తున్నది. వరంగల్ జిల్లాలో తొలి విడుత నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(పీహెచ్సీ), హనుమకొండ జిల్లాలో ఐదు సెంటర్లలో ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని ప్రారంభించింది. తాజాగా వరంగల్లో మరో పీహెచ్సీలో, హనుమకొండలో మరో నాలుగింటిని ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గత మార్చి 8న దీన్ని ప్రారంభించింది. తొలి విడుత రాష్ట్రంలో వంద పీహెచ్సీల్లో ప్రత్యేక మహిళా క్లినిక్లను ఏర్పాటు చేసింది. ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఎనిమిది రకాల ఆరోగ్య సమస్యలకు వైద్య సేవలను అందిస్తున్నది.
వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్వతగిరి, చెన్నారావుపేట పీహెచ్సీలు, రంగశాయిపేట, కీర్తినగర్ యూపీహెచ్సీల్లో, గోపాల్పూర్, ఆత్మకూర్, సిద్ధాపూర్(ఉప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం), పోచమ్మకుంట, న్యూ శాయంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అమల్లోకి తెచ్చింది. రెండో విడుతలో ఖానాపురంలోని పీహెచ్సీలో ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఈ మహిళ క్లినిక్ను ప్రారంభించారు. అలాగే సెప్టెంబర్ 12వ తేదీన ఉప్పల్, కమలాపూర్, శాయంపేట, వంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొత్తగా మహిళా ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించారు. వీటిలో ప్రతి మంగళవారం వైద్యులు, సిబ్బంది కేవలం మహిళలకు మాత్రమే వైద్య సేవలందిస్తున్నారు. సుమారు 70 నుంచి 90 మంది వైద్య సేవలను పొందుతున్నారు. ఈ క్లినిక్లలో సాధారణంగా వచ్చే వ్యాధులతో పాటు ప్రధానంగా 8 రకాల ఆరోగ్య సమస్యలకు వైద్య సేవలు అందిస్తున్నది. ప్రాథమిక డయాగ్నోస్టిక్, క్యాన్సర్ స్క్రీనింగ్, సూక్ష్మ పోషక లోపాలు, మూత్ర నాళ ఇన్ఫెక్షన్లు, పీఐడీ, పీసీఓఎస్, కుటుంబ నియంత్రణ, రుతుస్రావ సమస్యలు, మెనోపాజ్ మేనేజ్మెంట్, లైంగిక వ్యాధులు, శరీర బరువు అంశాలపై 57 రకాల వైద్య పరీక్షలు చేస్తున్నారు.
విశేష స్పందన..
ప్రత్యేక మహిళ క్లినిక్లకు విశేష స్పందన లబిస్తున్నది. ఇప్పటివరకు జిల్లాలో ఆరోగ్య మహిళ ద్వారా 7,970 మంది మహిళలు వైద్య సేవలను పొందినట్లు వైద్య, ఆరోగ్యశాఖ జిల్లా అధికారి వెంకటరమణ వెల్లడించారు. అలాగే హనుమకొండ జిల్లాలో ఇప్పటి వరకు 11,522 మంది మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. 715 మందిని పెద్ద దవాఖానలకు రెఫర్ చేశారు. ఇందులో 183 మంది క్యాన్సర్ వ్యాధి అనుమానితులగా గుర్తించారు. వీరిని ఎంజీఎం, హైదరాబాద్లోని క్యాన్సర్ ఆస్పత్రులకు పంపించి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. 46 మందికి థైరాయిడ్ ఉన్నట్లు గుర్తించి మందులు అందిస్తున్నారు. మరో 58 మంది రక్తహీనతతో బాధపడుతున్నట్లు గుర్తించిన వైద్యాధికారులు వైద్యం చేస్తున్నారు.
వరంగల్ రంగశాయిపేట యూపీహెచ్సీలో 2,018, పర్వతగిరి పీహెచ్సీలో 1,965, వరంగల్ కీర్తినగర్ యూపీహెచ్సీలో 2,086, చెన్నారావుపేట పీహెచ్సీలో 1,864, ఖానాపురం పీహెచ్సీలో 37 మందికి ప్రత్యేక వైద్య పరీక్షలు జరిగాయని తెలిపారు. వీరిలో 231 మందిని అవసరమైన వైద్య చికిత్సల కోసం రిఫర్ చేసినట్లు చెప్పారు. 207 మందికి థైరాయిడ్ పరీక్షలు చేయగా 21 మందికి ఉన్నట్లు తేలింది. 5,573 మందికి నోటి క్యాన్సర్ పరీక్షలు నిర్వహించగా ఒకరికి నిర్ధారణ అయింది. పదిహేను మంది అనుమానితుల్లో పదమూడు మందిని రిఫర్ చేశారు. 5,575 మందికి రొమ్ము క్యాన్సర్ పరీక్షలు జరపగా ఇద్దరికి ఉన్నట్లు వెల్లడైంది. 23 మంది అనుమానితుల్లో 17 మందిని రిఫర్ చేశారు. 1,327 మందికి గర్భాశయ క్యాన్సర్ పరీక్షలు చేయగా ముగ్గురికి నిర్ధారణ జరిగింది. 15 మంది అనుమానితుల్లో 11 మందిని రిఫర్ చేసినట్లు వైద్యులు చెప్పారు. 1,243 మందికి రుతువిరతి పరీక్షలు, 1,083 మందికి కౌన్సెలింగ్ నిర్వహించామని, 151 మందిని రెఫర్ చేసినట్లు తెలిపారు. 543 మందికి బరువు నిర్వహణ పరీక్షలు జరిపామని, 573 మందికి కౌన్సెలింగ్ నిర్వహించామని వెల్లడించారు. 2,642 మందికి రక్తహీనత పరీక్షలు చేసినట్లు ప్రకటించారు. మహిళలకు అయోడిన్ సమస్య, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లోపం, విటమిన్ బీ12, విటమిన్ డీ పరీక్షలు కూడా చేసి మందులను అందిస్తున్నారు.
ఎనిమిది రకాల వైద్య సేవలు
ఆరోగ్య మహిళా కేంద్రాల్లో ఉచితంగా చేసే ఎనిమిది రకాల పరీక్షలు ఇవే..
1. మధుమేహం, రక్తపోటు, రక్త హీనత, ఇతర సాధారణ పరీక్షలు
2. ఓరల్, సర్వైకల్, రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్
3. థైరాయిడ్ పరీక్ష, సూక్ష్మ పోషకాల లోపాలు గుర్తించడం, అయోడిన్ సమస్య, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లోపంతో పాటు విటమిన్ బీ12, విటమిన్ డీ పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇస్తున్నారు.
4. మూత్రకోశ సంబంధిత ఇన్ఫెక్షన్, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధుల పరీక్షలు
5. మెనోపాజ్ దశకు సంబంధించిన పరీక్షలు, అవసరమైన వారికి హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ చేయడంతోపాటు కౌన్సెలింగ్ చేస్తున్నారు.
6. నెలసరి, సంతాన సమస్యలపై అవగాహన, అవసరమైతే అల్ట్రాసౌండ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
7. సెక్స్ సంబంధిత వ్యాధులకు పరీక్షలు చేసి అవగాహన కల్పిస్తారు.
8. బరువు నియంత్రణ, యోగా, వ్యాయామంపై అవగాహన కల్పిస్తున్నారు.
టీ డయాగ్నోస్టిక్కు శాంపిళ్లు..
ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా ప్రతి మంగళవారం ప్రత్యేక మహిళా క్లినిక్ నిర్వహిస్తున్నాం. 70 నుంచి 80 మందికి వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా ఎనిమిది రకాల ఆరోగ్య సమస్యలకు 57 రకాల వైద్య పరీక్షలు జరుపుతున్నాం. వైద్య పరీక్షలు పొందిన మహిళల వివరాలను ఆరోగ్య సమస్యలతో సహా ప్రత్యేక యాప్లో నమోదు చేస్తున్నాం. ఎప్పటికప్పుడు శాంపిళ్లు నర్సంపేటలోని టీ డయాగ్నోస్టిక్ సెంటర్కు చేరుతున్నాయి. రిజల్ట్స్ సదరు మహిళలకు వాట్సాప్ ద్వారా అందుతున్నాయి. స్మార్ట్ ఫోను లేని మహిళలు క్లినిక్కు వచ్చి తీసుకుంటున్నారు. రెండు రోజుల్లో అందరికీ రిపోర్ట్సు అందుతున్నాయి. మెరుగైన వైద్యం అవసరమైన మహిళలను ఎంజీఎం దవాఖానకు రెఫర్ చేస్తున్నాం.
– డాక్టర్ భార్గవి, మెడికల్ ఆఫీసర్, రంగశాయిపేట యూపీహెచ్సీ