దేవరుప్పుల, మార్చి 24 : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకిచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేసిన పాపాన పోలేదు. యాసంగి దినం పంటలు ఎండుతుంటే మంత్రులు చోద్యం చూస్తున్నారు. నీళ్లుండీ ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. రైతు సమస్యలు పరిష్కరించని పక్షంలో చలో సెక్రటేరియట్ పిలుపునిస్తాం’ అని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. దేవరుప్పుల మండలం ధరావత్ తండా శివారు చింతబాయి తండాలో గిరిజన రైతులకు చెందిన వరి పంట పొలాలను ఆదివారం ఆయన పరిశీలించారు. మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆయన వెంట ఉన్నా రు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. కాంగ్రె స్ ప్రభుత్వంలో ఈ యాసంగిలో 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండగా, మరో లక్ష ఎకరాల్లో వడగండ్ల వాన తో రైతులు పంట నష్టపోయారన్నారు. అప్పుల పాలైన 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపా రు. ఇంత జరుగుతున్నా నిమ్మకునీరెత్తినట్లు మంత్రులు ప్రతిపక్షనాయకుల ఇంటికి వెళ్లి రాజకీయాలు చేస్తున్నా రు తప్ప, రైతుల ఇండ్లకు పోయి ఓదార్చాలన్న ధ్యాసే లేదన్నారు. ఇక్కడ రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని, ఒక్కో రైతు సాగునీటి కోసం రూ.4లక్షలు ఖర్చు పెట్టి 5 నుంచి 6 బోర్లు వేయించినా నీళ్లు పడక పంటలు ఎండి, కన్నీళ్లు పెడుతున్నట్లు తెలిపారు. నీళ్లుండీ ఇవ్వలేకపోవడం కాంగ్రెస్ సర్కారు వైఫల్యమేనన్నారు. కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరిచామని చెబుతున్న ముఖ్యమంత్రి, ప్రాజెక్ట్ల గేట్లు తెరిచి రైతులను ఆదుకుంటే మంచిదన్నారు. రైతులకిచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయని ఈ ప్రభుత్వానికి పార్లమెంటు ఎన్నిక ల్లో గుణపాఠం చెప్పాలన్నారు. యాసంగిలో దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ.25వేల నష్టపరిహారం చెల్లించా లని హరీశ్రావు డిమాండ్ చేశారు. వరి ధాన్యం క్వింటా లు కు రూ.500 బోనస్ చెల్లించాలన్నారు. ఎకరాకు రూ.15వేల రైతుబంధు చెల్లిస్తామని, గెలవగానే రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పిన రేవంత్రెడ్డి కనీసం పాత పద్ధతిన కూడా రైతుబంధు ఇవ్వలేదని రైతులే చెబుతున్నారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల లోపు ఈ సమస్యలన్నీ పరిష్కరించపోతే బీఆర్ఎస్ పార్టీ చలో సెక్రటేరియట్కు పిలుపునిస్తామన్నారు. పింఛన్ల పెంపు, ప్రతి మహిళకు రూ.2500 ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మహా మోసానికి పాల్పడిందన్నారు.
దేవరుప్పుల మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడిన హరీశ్రావు కార్యకర్తలు అధైర్యపడనవసరం లేదని, కేసీఆర్ అండగా ఉంటారని అన్నారు. ఉద్యమ పార్టీగా మనకు జైలు కెళ్లడం కొత్తేమీ కాదని, సమస్యలపై పోరాడి ప్రజల పక్షాన నిలబడాలని పిలుపునిచ్చారు. ఎర్రబెల్లిని ఓడించిన ప్రతి ఓటరు ఇప్పటికే తాము చేసిన తప్పును తెలుసుకున్నారని, దేవరుప్పుల పర్యటనలో ఈ విషయం ప్రజల నుంచి విన్నట్లు తెలిపారు. ఎర్రబెల్లి మంత్రిగా ఉన్నన్ని రోజులు ఒక్క ఎకరం ఎండలేదని, ఎండాకాలంలో కాల్వల్లో నీరు పారిందని, చెరువులు నిండాయని, వాగులు పారాయని హరీశ్రావు తెలిపారు.