హనుమకొండ, నవంబర్ 10 : ఉద్యమకారుడిగా, నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటూ సమస్యలు పరిష్కరించిన తనకే ఓటు అడిగే హక్కు ఉందని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ముందుకు వస్తున్నానని, కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ పశ్చిమ నియోజక వర్గ అభ్యర్థిగా శుక్రవారం హనుమకొండ ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం దాస్యం మాట్లాడారు. ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా సమయంలో సైతం ప్రజల మధ్య ఉంటూ వారి సంక్షేమం కోసం పాటుపడ్డానన్నారు. ఈ దఫా ఎన్నికల్లో అభివృద్ధికి, అక్రమాలకు మధ్యే పోటీ అని అన్నారు. అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ కావాలో, అక్రమాలకు పాల్పడుతున్న కాంగ్రెస్, బీజేపీ కావాలో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. ఉద్యమానికి ఊపిరి పోసింది హనుమకొండ నగరం అని దాస్యం పేర్కొన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు.
నగరాన్ని హైదరాబాద్ నగరానికి దీటుగా అభివృద్ధి చేశామన్నారు. నియోజకవర్గంలో ఏ మూల ఏ సమస్య ఉందో తెలుసని, వాటి పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు అపార్ట్మెంట్ దర్శన్, ప్రజలతో ముఖాముఖి లాంటి వినూత్న కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఆర్థిక భారంతో కార్మికుల పిల్లలు చదువులు మధ్యలో ఆపేస్తే వారికి ఆర్థిక భరోసా కల్పిస్తే ఇప్పుడు కొందరు ఎంబీబీఎస్, ఐఐటీలో సీట్లు సాధించి మంచి స్థాయిలో ఉన్నారన్నారు. ఇన్నాళ్లూ మీలో ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్నానని, వరంగల్ పశ్చిమ అభ్యర్థిగా ముందుకు వస్తున్నానని, గెలిపించాలని ప్రజలను కోరారు. తెలంగాణ ఉద్యమ కారులపై తుపాకీ ఎక్కుపెట్టిన వ్యక్తులు ఇప్పుడు ఓట్లు అడిగేందుకు వస్తున్నారని, వారిని దరిదాపుల్లోకి కూడా రానివ్వొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఖజానాను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే బీజేపీని బొందపెట్టాలన్నారు. అంతకుముందు వడ్డేపల్లిలోని గ్రామ దేవత పోచమ్మతల్లిని దర్శించుకున్నారు. ఆయన నివాసంలోని తన తల్లిదండ్రుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, మైనార్టీ ఖాదీ బోర్డు చైర్మన్ మౌలానాతో కలిసి దాస్యం రిటర్నింగ్ అధికారి ఎల్ రమేశ్కు నామినేషన్ పత్రాలు అందజేశారు.
వరంగల్, నవంబర్ 10 : నగరంలోని భద్రకాళీ అమ్మవారిని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి దాస్యం వినయ్భాస్కర్ దంపతులు దర్శించుకున్నారు. నామినేషన్ పత్రాలను అమ్మవారి చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. తొలుత వల్లభ గణపతిని దర్శించుకున్న అనంతరం వారు భద్రకాళీ అమ్మవారికి పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు మహా మండపంలో ఆశీర్వచనం ఇచ్చి అమ్మవారి శేషవస్త్రాలను బహూకరించి, ప్రసాదం అందజేశారు.