ప్రత్యామ్నాయంపై దృష్టిపెట్టిన రైతులు ప్రయోగాత్మకంగా సాగుచేసిన ఆయిల్పాం పంట కాతకు వచ్చింది. మూడేళ్ల క్రితం ఎన్నో ఆశలతో నాటిన మొక్కలు పెద్దవై దిగుబడి మొదలవడంతో రైతుల్లో సంతోషం వెల్లివిరిసింది. గత కేసీఆర్ సర్కారు ప్రోత్సాహం, సబ్సిడీ అందించడంతో జిల్లాలో మొదటి విడుత 352.55 ఎకరాల్లో పంట సాగుచేయగా, ఇప్పటివరకు 3044 ఎకరాల్లో పంట సాగవుతోంది. అంతేగాక ఆయిల్పాం తోటల మధ్యలో అంతర పంటలతోనూ అదనపు ఆదాయం పొందుతూ లాభాల పంటలు పండిస్తున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మూడేళ్ల క్రితం నాటిన ఆయిల్పాం మొక్కల నుంచి దిగుబడి ప్రారంభమైంది. కేసీఆర్ ప్రభుత్వం ఆయిల్పాం సాగుపై ప్రత్యేక దృష్టిసారించి రైతులకు సబ్సిడీలు అందించి ప్రోత్సహించింది. ఈక్రమంలో రైతులు ఆయిల్పాం సాగువైపు అధిక సంఖ్యలో మొగ్గు చూపారు. జిల్లాకు చెందిన 995 మంది రైతులు 3044 ఎకరాల్లో ఆయిల్పాం సాగు ప్రారంభించారు. సంబంధిత అధికారుల సూచనలు, సలహాలు తీసుకుంటూ ఆయిల్పాం సాగులో ముందుకుసాగారు. మొత్తం 3044 ఎకరాల్లో సాగు చేస్తుండగా మొదటి విడుత సాగుచేసిన 352.55 ఎకరాల్లో ఆయిల్పాం మొక్కల నుంచి దిగుబడి ప్రారంభమైంది. మొక్కల నుంచి తొలిసారి వచ్చిన క్రాప్ను చూసి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 40ఏళ్ల పాటు ఆయిల్పాం నుంచి ఇక వరుసగా దిగుబడి రానుంది. ఆయిల్పాం తోటల్లో మధ్య మధ్యలో అంతర పంటలు వేస్తూ రైతులు లాభాలు పొందుతున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 11 మండలాల్లో 10 మండలాలకు చెందిన 112మంది రైతులు 2021-22లో మొదటి విడుత 352.55 ఎకరాల్లో ఆయిల్ పాం మొక్కలు నాటగా ప్రస్తుతం దిగుబడి ప్రారంభమైంది. భూపాలపల్లి మం డలంలో 42.10 ఎకరాలు, చిట్యాల మండలంలో 75.35 ఎకరాలు, గణపురం మండలంలో 16.60 ఎకరాలు, మొగుళ్లపల్లి మండలంలో 77.43 ఎకరాలు, రేగొండ మండలంలో 73.05 ఎకరాలు, టేకుమట్ల మండలంలో 14.58 ఎకరాలు, కాటారం మండలంలో 5.38 ఎకరాలు, మహాముత్తారం మండలంలో 37.63 ఎకరాలు, మల్హర్ మండలంలో 10.43 ఎకరాల్లో మొదటి విడుత వేయగా పంట దిగుబడి మొదలైంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొత్తం 2021-22 నుంచి 2023-24 వరకు 3044 ఎకరాల్లో 995మంది రైతులు ఆయిల్ పాం సాగు చేశారు. ఇందులో మొదటి విడుత 2021-22 లో 112మంది రైతులు 352.55 ఎకరాల్లో సాగు చేయగా ప్రస్తుతం పంట చేతికి వచ్చింది. అలాగే 2022-23లో 609మంది రైతులు 1877.53 ఎకరాల్లో, 2023-24లో 274 మంది రైతులు 841 ఎకరాల్లో సాగుచేశారు. మొత్తం 3044 ఎకరాల్లో ఆయిల్పాం సాగు జోరుగా సాగుతుండగా ఇంకా ఆయిల్పాం సాగు చేసేందుకు రైతులు ఉత్సాహం చూపుతున్నారు. పంట ప్రారంభంలో మొక్కలతో పాటు డ్రిప్కు కేసీఆర్ ప్రభుత్వం సబ్సిడీ అందించింది. పంట వేసిన మొదటి సంవత్సరం నుంచి నాలుగు సంవత్సరాల వరకు ఎకరానికి రూ.4200 సబ్సిడీ అందిస్తారు. ఒక్కో మొక్కకు రూ.223 ఉండగా రూ.193 సబ్సిడీ అందించారు. ఎకరానికి ప్రారంభంలో 3 నుంచి 4 టన్నుల దిగుబడి రానున్నది. అలాగే 5 నుంచి 7 ఏళ్లు దాటితే 10 టన్నుల దిగుబడి రానున్నది. ఒక టన్నుకు మార్కెట్లో రూ.12వేలు ధర పలుకుతుంది. ఈక్రమంలో పంట ఒక్కసారి వేస్తే 40 ఏళ్ల పాటు నికర ఆదాయం పొందనున్నారు.
వరి, మిర్చికి ఇది ప్రత్యామ్నాయ పంట. వరి, మిర్చి ఇతర పంటల్లాగా దీనికి భారీగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక్కసారి నాటి సస్యరక్షణ చర్యలు చేసుకుంటూ పోతే 40 ఏళ్లకు పైగా దిగుబడి పొందవచ్చు. నేను మూడెకరాల్లో ఆయిల్పాం మొక్కలు నాటాను. అంతకుముందు భూమిని పెట్టుబడి పెట్టలేక పడావు పెట్టాను. అధికారుల సూచన మేరకు ఆయిల్ పాం సాగు మొదలు పెట్టాను. మొన్ననే మొదటి క్రాప్ వచ్చింది. అయితే తొలిసారి క్రాప్ కావడంతో విక్రయించలేదు. రెండవ క్రాప్కు చెట్లను సిద్ధం చేశాను. రైతులు వరికి, మిర్చికి ప్రత్యామ్నాయ పంటగా ఆయిల్పాంను ఎంచుకోవాలి. మార్కెట్లో ధర ఎంత తగ్గినా నష్టమైతే ఉండదు. 40 ఏళ్లపాటు ప్రశాంతంగా జీవించవచ్చు.