గిర్మాజీపేట, డిసెంబర్ 12: బాలలను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషిచేస్తుంది. తద్వారా విద్యార్థి దశలోనే వారి సృజనాత్మకతకు పదునుపెట్టేలా విజ్ఞానంపై అవగాహన కల్పిస్తూ కొత్త ఆవిష్కరణలు చేసేలా ప్రోత్సాహమందిస్తున్నది. ఈ నెలలో జిల్లాస్థాయి వైజ్ఞానిక, ఇన్స్పైర్ ప్రదర్శన నిర్వహించడానికి విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో విద్యార్థులు పాల్గొని వారి మెదడుకు పదును పెట్టనున్నారు. జిల్లా స్థాయి ప్రదర్శనలో ప్రతిభ కనబరిచిన ప్రయోగాలను (ఎగ్జిబిట్లు) రాష్ట్రస్థాయికి ఎంపిక చేయనున్నారు.
ఒక్కో ప్రదర్శనకు వంద మార్కులు కేటాయించారు. విద్యార్థి సొంతంగా తయారుచేసి ఊహించి రాస్తే 20 మార్కులు, సైన్స్, గణిత భావనలు స్పష్టంగా కనిపిస్తే 15 మార్కులు, సైంటిఫిక్(ప్రయోగ) సూత్రానికి 15 మార్కులు, ప్రయోగం తయారు చేసే విధానం కోసం 15 మార్కులు, సమాజానికి ఉపయోగపడేలా వినియోగించుకునేలా ఉంటే 15 మార్కులు, తక్కువ ఖర్చుతో లాభదాయకంగా ఉంటే 10 మార్కులు, ప్రయోగం వివరించే విధానానికి 10 మార్కులు కేటాయిస్తారు. గ్రామీణ, గిరిజన, వెనుకబడిన ప్రాంతాల విద్యార్థులకు 5 శాతం, పట్టణ పరిధిలోని విద్యార్థులకు 3 శాతం వెయిటేజీ కేటాయిస్తారు.
1. ఆరోగ్యం, లైఫ్ (లైఫ్ ైస్టెల్ ఫర్ ఎన్విరాన్మెంట్), అగ్రికల్చర్, కమ్యూనికేషన్ అండ్ ట్రాన్స్పోర్ట్, కంప్యూటేషనల్ థింకింగ్
ఐదు ఉప అంశాలతో పాటు నూతన ఆవిష్కరణకు సంబంధించిన ఏవైనా ప్రయోగాలను ప్రదర్శించవచ్చు. 6 నుంచి 7వ తరగతి వరకు జూనియర్ విభాగంగా, 8 నుంచి 10వ తరగతి వరకు సీనియర్ విభాగంగా పరిగణించనున్నారు. ఈ ప్రదర్శనలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు వారు చేసిన ఎగ్జిబిట్లను ప్రదర్శించవచ్చు. అలాగే, విద్యార్థులతో పాటు సైన్స్, గణితం, అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ఉపాధ్యాయులు, డీఈడీ, బీఈడీ శిక్షణ పొందుతున్న వారు, బోధన ఉపకరణాలు అనే అంశంపై ప్రయోగాలను ప్రదర్శించడానికి అవకాశం కల్పించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు వేర్వేరుగా ప్రయోగాలు ప్రదర్శించడానికి అధికారులు ఏర్పాట్లు చేయడంలో సన్నద్ధమవుతున్నారు. స్వయంగా తయారు చేసిన వాటినే అనుమతిస్తారు. రెడిమేడ్ నమూనాలు అనుమతించబడవు. తక్కువ ఖర్చుతో తయారు చేసిన ప్రయోగానికి ప్రాధాన్యం ఉంటుంది. ఇక విద్యార్థితో పాటు ఒక గైడ్ టీచర్ మాత్రమే ఒక ప్రాజెక్టు ప్రదర్శనలో పాల్గొనాలి. అలాగే, జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనతో పాటు ఇన్స్పైర్ ప్రదర్శనను కూడా నిర్వహించడానికి జిల్లా విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో 121 మంది విద్యార్థులు పాల్గొననున్నారు.
విద్యార్థుల్లో మేథాసంపత్తిని వెలికితీసేందుకే సైన్స్ ఫేర్ దోహదపడుతుంది. ఈ ప్రదర్శనలో జిల్లాలోని అన్ని పాఠశాలల యాజమాన్యాలు వి ద్యార్థులను ప్రయోగాలు చేసే లా ప్రోత్సహించాలి. అందు కు పాఠశాలల హెచ్ఎంలు కృషిచేయాలి. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిస్తే రాష్ట్రస్థాయి ప్రదర్శనలో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. ప్రతి పాఠశాలలోని విద్యార్థులు వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొని జిల్లా, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకురావాలి.