పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. గురువారం తొలి రోజు వరంగల్లో మూడు, మహబూబాబాద్లో ఒకటి దాఖలయ్యాయి. వరంగల్ నియోజకవర్గం నుంచి అలయెన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ నుంచి ఒకరు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి ఒకరు, స్వతంత్ర అభ్యర్థిగా ఒకరు, మహబూబాబాద్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఒకరు నామినేషన్ దాఖలు చేశారు. ఆయా ఆర్వో కార్యాలయాల్లో రిటర్నింగ్ అధికారులు పీ ప్రావీణ్య, అద్వైత్కుమార్ నామినేషన్లను స్వీకరించారు.
పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో గురువారం నుంచి నామినేషన్ల దాఖలు ఘట్టం మొదలైంది. ఎస్సీలకు రిజర్వ్ చేసిన వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అలయెన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ అభ్యర్థిగా అంబోజు బుద్దయ, స్వతంత్ర అభ్యర్థిగా బరిగెల శివ, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా తౌటపల్లి నర్మద తమ నామినేషన్లను దాఖలు చేశారు. ప్రతిపాదిత, బలపరిచిన వ్యక్తులతో కలిసి ఒక్కో సెట్ను నామినేషన్ పత్రాలను వరంగల్ జిల్లా కలెక్టరేట్లోని ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు అందజేశారు. ఎన్నికల వ్యయపరిశీలకులు ధీరజ్ సింగ్ ఆర్వో కార్యాలయాన్ని సందర్శించి నామినేషన్ల దాఖ లు, ఏర్పాట్లను పరిశీలించారు. ఆర్వో ప్రావీణ్య కలెక్టరేట్లో ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎన్నికల అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు.
హనుమకొండ ఏసీపీ కొత్త దేవేందర్రెడ్డి తమ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, ఇతర సిబ్బందితో కలిసి బందోబస్తును పర్యవేక్షించారు. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ను రిటర్నింగ్ అధికారి అద్వైత్కుమార్ సింగ్ గురువారం ఉదయం 10.30 గంటలకు విడుదల చేశారు. 11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించారు. మహబూబాబాద్ పార్లమెంట్ స్థానానికి మరిపెడ మండ లం ఎడ్జెర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని గుర్రపు తండాకు చెందిన బానోత్ లింగ్యా నాయక్ ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఈనెల 19న కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్, 22న బీజేపీ అభ్యర్థి సీతారాంనాయక్, 23న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాలోత్ కవిత నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ల స్వీకరణ ఈ నెల 25 వరకు కొనసాగనుంది.