సుబేదారి, మే 13 : రోజురోజుకూ దొంగలు చోరీ చేసే విధానం మారుతున్నది. వేగంగా దూసుకొచ్చి.. క్షణాల్లో పని పూర్తి చేసుకొని, మెరుపు వేగంతో తప్పించుకుపోవడం ట్రెండ్గా మారింది. బాధితులు లబోదిబోమని మొత్తుకునే సరికే కంటికి కనబడనంత దూరంగా వెళ్లిపోతున్నారు. ఈ తరహా దొంగతనాలకు పాల్పడుతున్న వారు దాదాపు 30 ఏళ్ల లోపు వయసున్న వారే కావడం గమనార్హం. వీరిలో లోకల్తోపాటు ఇతర రాష్ర్టాలకు చెందిన వారు కూడా ఉన్నారు. వరుస చోరీలు.. చైన్ స్నాచింగ్లు వరంగల్ నగర ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నిత్యం జన సంచారంతో రద్దీ ఉండే వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రై సిటీల్లో జరుగుతున్న వరుస ఘటనలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
ముఖ్యంగా మహిళలు ఇంటి నుంచి కాలు బయటపెట్టాలంటేనే జంకుతున్నారు. ఎటు నుంచి ఎవడు వచ్చి మెడలో ఉన్న బంగారు గొలుసు కొట్టేస్తారోనన్న భయంతో వణికిపోతున్నారు. షాపింగ్కు, ఫంక్షన్లతో పాటు పని మీద బయటకు వెళ్లాలన్నా, ఇంటి ముందు నిలబడాలన్నా భయపడిపోతున్నారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని వరంగల్ నగరం చైన్ స్నాచింగ్లకు అడ్డాగా మారింది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా బైక్లపై వచ్చి, మెడలో ఉన్న విలువైన బంగారు గొలుసులు తెంచుకెళ్తున్నారు. ఇంతకు ముందు ఒంటరి మహిళలనే టార్గెట్ చేసేవారు. ఇప్పుడు మగవాళ్లను కూడా వదిలిపెట్టడం లేదు.
ఇంత జరుగుతున్నా లా అండ్ ఆర్డర్ పోలీసులు తగిన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. చోరీ జరిగిన తర్వాత హడావుడిగా సీసీ కెమెరాలు చెక్ చేసి తదుపరి యాక్షన్ తీసుకుంటున్నారే తప్ప నేరం జరగక ముందే తగిన జాగ్రత్తలు మాత్రం తీసుకోవడం లేదు. ప్రజలను అలర్ట్ చేయడం లేదు. వరంగల్ నగరంలో పనిచేస్తున్న కొందరు పోలీసు అధికారులు వీఐపీలు, తమకు పోస్టింగ్ ఇప్పించిన ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ వారి బందోబస్తుకే ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప సామాన్య జనాన్ని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చైన్ స్నాచింగ్ బాధితులు న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేస్తే ‘చోరీ జరగక ముందే జాగ్రత్తలు తీసుకోవాలి.. ఇంత తొందరగా దొంగలు దొరుకుతారా? తిరుగుతున్నాం, సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నాం.. మాకూ ఎన్నో పనులుంటాయి’ అంటూ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు దాటవేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే కొత్తవారు వరంగల్ నగరంలో షెల్టర్ తీసుకునే హోటళ్లు, లాడ్జీలపై స్థానిక పోలీసులు దృష్టిపెట్టడం లేదు. రాత్రి సమయంలో నామ్కే వాస్తేగా పెట్రోలింగ్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
చోరీ ఘటన జరిగినప్పుడే హడావుడి చేసి ఒకరిద్దరు దొంగలను పట్టుకుంటున్నారు.. తర్వాత వాటి నియంత్రణ విషయంలో నిఘా పెట్టడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. కొద్ది రోజుల క్రితం కరీంనగర్ పట్టణంలో దొంగలు పట్టపగలే నగల షాప్ల నుంచి భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. గతంలో వరంగల్ నగరంలో కూడా అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు పెద్ద మొత్తంలో చోరీలకు పాల్పడిన ఘటనలున్నాయి. ఈ నేపథ్యంలో వీటి నుంచి గుణపాఠాలు నేర్చుకొని చైన్ స్నాచింగ్లు, ఇతర చోరీలు జరగకుండా పోలీసు ఉన్నతాధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
చైన్ స్నాచింగ్ ఘటనలు మచ్చుకు కొన్ని..
ఒకే రోజు మూడు చోట్ల..
వరంగల్ నగరంలో గత సోమవారం దొంగలు మూడుచోట్ల చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారు. ఇంతేజార్గంజ్ పోలీసు స్టేషన్ పరిధిలోని కాశీబుగ్గ సొసైటీ కాలనీ రోడ్డు నంబర్-3లో ఇంటి ముందు పిల్లలకు అన్నం తినిపిస్తున్న మహిళ మెడలోంచి ముగ్గరు దొంగలు బైక్పై వచ్చి గోల్డ్ చైన్ లాక్కెళ్లారు. మిల్స్కాలనీ పోలీసు స్టేషన్ పరిధిలోని క్రిస్టియన్ కాలనీలో ముగ్గురు దొంగలు బైక్పై వచ్చి ఇంటి ఎదుట కూర్చున్న అడ్వకేట్ మెడలో నుంచి గోల్డ్ చైన్ లాక్కెళ్లారు. హనుమకొండ పోలీసు స్టేషన్ పరిధిలోని జాగృతి కాలనీలో రిటైర్డ్ ఎస్సై భార్య ఇంటి ముందు ఉండగా ఇద్దరు దొంగలు బైక్పై వచ్చి ఆమె మెడలోని గోల్డ్ చైన్ లాక్కెళ్లారు.