వరంగల్, మార్చి 4 : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) పరిధిలో ల్యాండ్ రైగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్)కు తిప్పలు తప్పడం లేదు. ఈ ప్రక్రియ అంతా గందరగోళంగా మారడంతో దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రొసీడింగ్ల కోసం ప్రోసిడింగ్ల కోసం 15 వేల మందికి పైగా దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు. రుసుము చెల్లించి రోజులు గడుస్తున్నా కాపీలు అందజేయడం లేదంటూ బల్దియా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. సాంకేతిక లోపంతో వందల అప్లికేషన్లు ఎల్ఆర్ఎస్ సైట్లో కనిపించడం లేదని పలువురు ఆందోళన చెందుతున్నారు. ఎల్ఆర్ఎస్ పేరిట రూ. వందల కోట్లు సమకూర్చుకున్న ప్రభుత్వం ఫీజులు చెల్లించిన వారికి ప్రోసిడింగ్లు ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని దరఖాస్తుదారులు మండిపడుతున్నారు.
పరిశీలన పేరిట పెండింగ్
ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించి ఏడాదికి పైగా అవుతున్నా ఇప్పటి వరకు ప్రొసీడింగ్లు రావడం లేదని దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. బల్ది యా కార్యాలయానికి వెళ్లిన వారికి కనీసం సమాధానం చెప్పేవారు కూడా కరువయ్యారు. అసలు దరఖాస్తులు ఏ స్టేజీలో ఉన్నాయో తెలుసుకోవడం కూడా కష్టంగా మారింది. ఎల్ఆర్ఎస్ కోసం 1,00,992 దరఖాస్తులు రాగా, అందులో 8,169 ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ కావడం, మరో 1000 అప్లికేషన్లను వివిధ కారణాలతో తిరస్కరించారు.
మిగిలిన వాటిలో సుమారు 40 వేల మంది వరకు ఫీజులు చెల్లించగా క్షేత్రస్థాయిలో పరిశీలన పేరిట నెలల తరబడి బల్దియా అధికారులు పెండింగ్లో పెడుతున్నారు. ఎల్1, ఎల్ 2 స్టేజీలోనే వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటి వరకు సుమారు 25 వేల మందికి ప్రోసీడింగ్లు అందజేశామని అధికారులు చెబుతున్నారు. అయితే మరో 20 వేల వరకు ఫీజు చెల్లించి ఉండగా, ఆ దరఖాస్తులను పరిశీలించి ప్రోసీడింగ్లు ఇవ్వడమో లేదా తిరస్కరించడమో చేయాల్సి ఉండగా అలా జరగడం లేదు. ఈ క్రమంలో బల్దియా ప్రధాన కార్యాలయంతో పాటు సర్కిల్ ఆఫీసుల్లో ఎల్ఆర్ఎస్ ప్రత్యేక డెస్క్లు ఏర్పాటు చేయాలని దరఖాస్తుదారులు డిమాండ్ చేస్తున్నారు.