నర్సంపేట రూరల్, మార్చి 5 : కేంద్ర ప్రభుత్వంపై ఉపాధి హామీ కూలీలు ‘ఉత్తరాల యుద్ధం’ కార్యక్రమాన్ని చేపట్టాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నదని, అందుకే బడ్జెట్లో గతం కంటే రూ. 33వేల కోట్లు తగ్గించిందన్నారు. లేబర్ యాక్టు ప్రకారం కూలి డబ్బులు ఇవ్వడం లేదని, గ్రామాలకు అవసరమైన పనులు కాకుండా కేంద్ర చూపించిన పనులు మాత్రమే చేయాలని సర్క్యులర్ను జారీ చేయడం దారుణమన్నారు. ఉపాధి నిధులు తగ్గించడం వల్ల చాలా మంది నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ కూలీకి రోజుకు రూ.257 ఇవ్వాలని చట్టం ఉన్నా, రూ.100 మించడం లేదన్నారు. బీజేపీ వైఖరితో దేశ ఆర్థిక పరిస్థితి దిగజారిందని చెప్పారు.
సీఎం కేసీఆర్ గ్రామాలను అభివృద్ధి చేయాలని చూస్తుంటే, కేంద్రం ఉపాధి నిధులను తగ్గించిందన్నారు. కనీస వేతన చట్టం ప్రకారం 8 గంటలు పని చేసిన కూలీకి రూ.480 ఇవ్వాలన్నారు. ఉదమం 10 నుంచి 4గంటలకు జరిగిన పని వివరాలు, ఫొటోలను కంప్యూటర్లో అప్లోడ్ చేయాలనే నిబంధన ఉండడం వల్ల కూలీలు పనులకు దూరమవుతున్నారని తెలిపారు. సన్న, చిన్నకారు రైతులు ఎక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరారు. పంట స్థాయిని బట్టి ఎకరానికి కూలి టోకెన్లు, మస్టర్లో 100 పని దినాలు ఉండేలా చూడాలన్నారు. ఉపాధి హామీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని సూచించారు. వ్యవసాయ రంగానికి ఉపాధి హామీ పథకం అనుసంధానం చేయాలని ఈనెల 9 నుంచి 15 వరకు వారం రోజుల పాటు కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రికి ఉత్తరాలు రాసి నిరసన తెలుపాలని ఎమ్మెల్యే పెద్ది కోరారు. యోజకవర్గంలోని 1,65,000 జాబ్ కార్డ్సు కలిగిన ఉపాధి హామీ కూలీతో వారం రోజుల పాటు ఈ కార్యక్రమం చేపట్టాలని రైతులు, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీ నాయక్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్, మాజీ ఎంపీపీ నల్ల మనోహర్రెడ్డి, నాయకులు డాక్టర్ లెక్కల విద్యాసాగర్రెడ్డి, రాయిడి రవీందర్రెడ్డి, గుంటి కిషన్ పాల్గొన్నారు.