నయీంనగర్, అక్టోబర్ 12 : అత్తను అల్లుడు గన్తో కాల్పి హత్య చేసిన ఘటన కేయూసీ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ గుండ్ల సింగారంకు చెందిన అనిగాల కమల(50)కు ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నాడు. పెద్ద కుమార్తె రమాదేవి భర్త ఆడ ప్రసాద్ రామగుండం పోలీసు కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లా కోటపల్లి పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రసాద్, రమాదేవి మధ్య కొన్ని సంవత్సరాలుగా గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల ప్రసాద్పై మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా, నెలకు రూ.15వేల చొప్పున డబ్బులు పంపిస్తా అని ప్రసాద్ చెప్పాడు.
ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ప్రసాద్కు, అతడి బావమరిది దేవేందర్తో మధ్య గొడవ జరిగింది. దీంతో అత్త, బామమరిదిపై కక్ష పెంచుకొన్న ప్రసాద్ వారిని అంతం చేయాలనే ఆలోచనతో తాను పనిచేస్తున్న పోలీసు స్టేషన్ ఎస్సై తుపాకీని తీసుకొచ్చాడు. గురువారం ఉదయం తన అత్త కమలతో మాట్లాడుతూ గతంలో ఇచ్చిన రూ.4లక్షల గురించి అడిగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరుగడంతో గన్తో అత్తను కాల్చ చంపాడు. తుపాకీ పేలిన శబ్ధంతో బయటకు వచ్చిన కుటుంబసభ్యులు ప్రసాద్ను నెట్టివేయగా, గాయలయ్యాయి. అనంతరం పోలీసులకు సమాచారం అందిచారు. ఘటనా స్థలాన్ని డీసీపీ బారి, ఏసీపీ డేవిడ్ రాజ్, సీఐలు అబ్బయ్య, గోపి, కరుణాకర్ పరిశీలించారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. కుమారుడు దేవేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ తెలిపారు.
వరంగల్ చౌరస్తా : కుటుంబ కలహాలతో అత్తను కాల్చి చంపగా, కోపంతో కుటుంబసభ్యులు నెట్టివేయ డంతో తీవ్ర గాయాలపాలైన కానిస్టేబుల్ ఆడె ప్రసాద్కు ఎంజీఎం దవాఖానలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వైద్యులు అతడి తలపై గాయానికి సుమారు 10 కుట్లు వేశారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.