వెంకటాపూర్, జనవరి 23 : ఆస్తి కోసం తోడబుట్టిన చెల్లి అనే కనికరం లేకుండా ఓ వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటన మంగళవారం ఉదయం మండలంలోని లక్ష్మీదేవిపేటలో జరిగింది. గ్రామానికి చెందిన పొన్నం శ్రీహరికి ముగ్గురు ఆడపిల్లలతో పాటు సమ్మయ్య సంతానం. వీరిలో ఒక అమ్మాయికి వివాహం చేశాక శ్రీహరి మరణించడంతో తల్లి రాధమ్మతో దివ్యాంగులైన సమ్మక్క, సారక్క ఉంటున్నారు.
ఈ క్రమంలో అనారోగ్యం రీత్యా తండ్రి ఇచ్చిన భూమిని ఇటీవల సమ్మక్క, సారక్క విక్రయించారు. తనకు తెలియకుండా భూమి ఎలా విక్రయిస్తారని అన్న సమ్మయ్య పలుమార్లు పంచాయితీ చేయడంతో పాటు పోలీస్స్టేషన్కు వెళ్లాడు. ఈ విషయంలో మంగళవారం సారక్కతో గొడవ పడి గొడ్డలితో గాయపరిచాడు. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. విషయం తెలుసుకున్న ఎస్సై చల్లా రాజు ఘటనా స్థలానికి చేరుకొని సమ్మయ్యను అదుపులోకి తీసుకుని సారక్కను వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు.