హసన్పర్తి, మార్చి 8: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన భీమారంలో శుక్రవారం జరిగింది. ఎస్సై రాజ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గట్లకానిపర్తికి చెందిన వలుగుల సాహిత్య(17) భీమారంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతోంది. పరీక్షలు సరిగా రాయలేదని రెండు రోజులుగా మనస్తాపం చెందింది. ఈనేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున సూసైడ్ నోట్ రాసి కళాశాల భవనం నుంచి కింద దూకింది.
కళాశాల యాజమాన్యం ఎంజీఎం దవాఖానకు తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందింది. ఈ విషయాన్ని తెలుసుకున్న విద్యార్థి కుటుంబ సభ్యులు విద్యార్థి సంఘాల ప్రతినిధులతో వచ్చి కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. దీంతో పోలీసులు శాంతింపజేశారు. అనంతరం మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.