దంతాలపల్లి, ఏప్రిల్ 12: స్లైన్ బాటిల్లో నాచు వచ్చిన ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో శుక్రవారం వెలుగు చూసింది. మండలంలోని దాట్ల గ్రామానికి చెందిన నర్కుటి సునీత గర్భిణి. కడుపునొప్పి రావడంతో ఈనెల 5న దంతాలపల్లి ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లింది. ఆ సమయంలో డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో దవాఖాన సిబ్బంది సునీతకు రెండు స్లైన్ బాటిళ్లు, మందులు ఇచ్చి ఇంటికి పంపించారు.
అయినా నొప్పి తగ్గకపోవడంతో వైద్యశాల నుంచి తీసుకొచ్చిన స్లైన్ బాటిళ్లను పెట్టించేందుకు శుక్రవారం స్థానిక ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. వాటిలో ఒక స్లైన్ బాటిల్ బాగానే ఉండగా, మరో బాటిల్ (ఆర్ఎల్)లో నాచు ఉండడంతో అవాక్కయ్యారు. నిర్లక్ష్యంగా వ్యహరించిన ప్రభుత్వ దవాఖాన వైద్యులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.