వరంగల్, ఆగస్టు 17 : తల్లిదండ్రులను కోల్పోయి, నా అనే వారు ఎవరూ లేక అనాథలుగా ఉన్న వారికి ప్రభుత్వం ఆసరాగా నిలువనుంది. అనాథలకు అక్కున చేర్చుకునే ప్రభుత్వ పథకాన్ని తీసుకువచ్చేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఎవ్వరికీ పట్టని వారుగా మిగిలిపోతున్న అనాథల బాధ్యతలను ప్రభుత్వ తీసుకోనుంది. ఇప్పటికే ఒంటరి మహిళలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం అనాథలకు బాసటగా నిలువనుంది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, బీడీ, గీత కార్మికులకు ఆసరా పేరిట పింఛన్లు అందజేస్తున్న ప్రభుత్వం ప్రత్యేకంగా భర్త, పిల్లలు లేక ఒంటరిగా ఉన్న మహిళలకు కూడా పింఛన్ ఇస్తున్న విషయం తెలిసిందే. అలాగే, అనాథలను ఆదుకోవడానికి మరో కొత్త పథకం రానుంది. ఇందులో భాగంగా గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో 15 రోజులుగా అనాథలను గుర్తించే ప్రక్రియ కొనసాగింది. 197 మంది సిబ్బంది ప్రత్యేకంగా గ్రేటర్ పరిధిలో అనాథలను గుర్తించే సర్వేలో నిమగ్నమయ్యారు. రెండు రోజుల క్రితం గ్రేటర్లో అనాథలపై సర్వే పూర్తి చేసి, సమగ్ర నివేదికను అధికారులు ప్రభుత్వానికి అందజేశారు.
ఇంటింటా సర్వే
గ్రేటర్లో అనాథలను గుర్తించే సర్వేను ఇటీవల ఇంటింటా చేపట్టారు. తల్లిదండ్రులను కోల్పోయి ఎవరూ లేని వారిని సర్వేలో గుర్తించారు. గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలోని 2,45,294 గృహాల్లో 197 మంది ఎన్యూమరేటర్లు సర్వే నిర్వహించారు. ఎలాంటి ఆశ్రమంలో ఆశ్ర యం పొందకుండా ఒంటరిగా ఉంటున్న అనాథలను గుర్తించారు. గ్రేటర్లోని 66 డివిజన్లలో సమగ్రంగా సర్వే చేసిన సిబ్బంది 161 మంది అనాథలను గుర్తించారు.
ప్రభుత్వానికి నివేదిక
గ్రేటర్ పరిధిలో అనాథల గుర్తింపు సర్వే నివేదికను గ్రేటర్ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం గ్రేటర్లో సర్వే నిర్వహించారు. తల్లిదండ్రులను కోల్పోయి, అనాథ ఆశ్రమాల్లో ఆశ్రయం పొందని వారు, నా అనే వారు ఎవరూ లేక రోడ్లపై భిక్షాటన చేసుకునే వారిని గుర్తించి నివేదిక తయారు చేశారు. త్వరలో ప్రభుత్వం తీసుకురానున్న కొత్త పథకం వీరికి అండగా నిలువనుంది.