వరంగల్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): లోక్సభ ఎన్నికలకు ఓటర్ల తుది జాబితా సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలను ప్రకటించింది. మొత్తం ఓటర్లు, మహిళలు, పురుషుల, థర్డ్జెండర్, సర్వీసు ఓటర్ల వివరాలతో తుది జాబితాను రూపొందించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే లోక్సభ ఎన్నికల ఓటర్ల సంఖ్య పెరిగింది. వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోనూ మహిళా ఓటర్లే ఎక్కువ ఉన్నారు. తుది జాబితా సిద్ధం కావడంతో ఎన్నికలకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మండలాలు, అసెంబ్లీ సెగ్మెంట్లకు అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఈసీ బాధ్యులుగా నియమించింది. ప్రస్తుతం లోక్సభ నియోజకవర్గాల వారీగా రిటర్నింగ్ అధికారులను నియమించనున్నది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా… ఆయా పరిధిలోని మండలాలు, గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల గుర్తింపు, రేషనలైజేషన్, పోలింగ్ కేంద్రాల్లో వసతుల ఏర్పాట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ లోక్సభ ఎన్నికల నిర్వహణ కోసం త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ను ప్రకటిస్తుందనే అంచనాలతో జిల్లాల్లోని అధికారులు సన్నద్ధమవుతున్నారు.
జనగామ 2,41,279, స్టేషన్ ఘన్పూర్ 2,52,784, పాలకుర్తి 2,54,949, డోర్నకల్ 2,22,552, మహబూబాబాద్ 2,58,027, నర్సంపేట 2,35,338, పరకాల 2,22,419, వరంగల్ పశ్చిమ 2,81,997, వరంగల్ తూర్పు 2,56,592, వర్ధన్నపేట 2,72,250, భూపాలపల్లి 2,76,705, ములుగు 2,32,091, హుజూరాబాద్ 2,49,432, హుస్నాబాద్ 2,46,377, మంథని 2,39,263, ఇల్లెందు 2,24,672, భద్రాచలం 151940.