సిద్దిపేట, ఆగస్టు 6(నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట ప్రభుత్వ 300 పడకల దవాఖానలో రోగులకు సరైన వైద్యసేవలు అందడం లేదని స్థానిక ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం కలెక్టర్ కె.హైమావతి అధ్యక్షతన జరిగిన దవాఖాన అభివృద్ధి కమిటీ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే హరీశ్రావు హాజరయ్యారు. దవాఖాన పూర్తి వివరాలు సమర్పించడంలో విఫలమైన సూపరింటెండెంట్, సంబంధిత అధికారులపై మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే హరీశ్రావు, కలెక్టర్ హైమావతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వైద్యసేవల్లో నిర్లక్ష్యాన్ని సహించమని వారు హెచ్చరించారు.
ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. గతంలో సిద్దిపేట దవాఖానపై రోగులకు అపారమైన నమ్మకం ఉండేదని, నాలుగు జిల్లాల ప్రజలు ఇకడే వైద్యం కోసం వచ్చేవారని గుర్తుచేశారు. అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేవన్నారు. తల్లీబిడ్డల సంక్షేమానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని గుర్తుచేశారు. రెండేండ్లుగా సేవలు దిగజారి రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారని హరీశ్రావు ఆవేదన వ్యక్తం చేశారు. శానిటేషన్ నిర్వహణ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని మండిపడ్డారు. బయోమెడికల్ వ్యర్థాలు సక్రమంగా నిర్వహించకపోవడంతో దోమలు, ఈగలు, కుకలు దవాఖాన ఆవరణలో సంచరిస్తున్నాయని, రోగులు, వారి సహాయకులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని తెలిపారు. స్నానాల గదులు, మరుగుదొడ్లు సరిగ్గా లేవని, వెంటనే శుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని హరీశ్రావు సూచించారు. ఇన్ పేషెంట్లకు ఆహారం సరిగ్గా అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కనీసం మందులు ఇవ్వడం లేదు…
సిద్దిపేట దవాఖానలో కనీసం మందులు అందుబాటులో లేకపోవడం దురదృష్టకరమని హరీశ్రావు అన్నారు. కుట్ల దారం బయట కొనాల్సిన పరిస్థితి ఏర్పడిందని, బీపీ మందులు, థైరాయిడ్ మాత్రలు, నొప్పి నివారణ ఆయింట్మెంట్లు వంటి అత్యవసర ఔషధాలు అందుబాటులో లేకపోవడంతో రోగులు ప్రైవేట్ మెడికల్ షాపులను ఆశ్రయిస్తున్నారని హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేండ్లుగా ఆరోగ్యశ్రీ నిధులు విడుదల కావడం లేదని, నిధుల కొరతతో దవాఖాన సేవలు దెబ్బతినకూడదని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో క్యాన్సర్ రోగుల కోసం కీమోథెరపీ సేవలు ప్రారంభించామని, ప్రస్తుతం ఆ సేవలు పూర్తిస్థాయిలో అందడం లేదన్నారు. వైద్యులు, సిబ్బంది ఖాళీలు భర్తీ చేసి నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. సిటీ సాన్, ఎక్స్రేలు తీస్తున్నప్పటికీ, ఫిల్మ్లు ఇవ్వడం లేదని, దీంతో రోగులు ప్రైవేట్ దవాఖానలు, డయాగ్నోస్టిక్ కేంద్రాలకు వెళ్లాల్సి వస్తోందని హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో రూ.18 కోట్లతో ఎంఆర్ఐ సాన్ మంజూరు చేసినప్పటికీ, ఇప్పటికీ టెండర్లు పూర్తికాకపోవడం దురదృష్టకరమని హరీశ్ రావు అన్నారు.

సర్కారు వైద్యంపై నమ్మకాన్ని పెంచాలి
మెరుగైన వైద్యసేవలు అందించి సర్కారు వైద్యంపై ప్రజలకు నమ్మకం పెంచాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఖాళీ పోస్టులపై వెంటనే సమగ్ర నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అవసరమైన నిధుల కోసం ప్రభుత్వం, జిల్లా ఇన్చార్జి మం త్రికి నివేదిక అందజేయాలని సూచించారు. రూ. 5.49 కోట్లతో అత్యాధునిక వైద్య పరికరాల కొనుగోలుకు దవాఖాన డెవలప్మెంట్ కమిటీ (హెచ్డీసీ) ఆమోదం తెలిపింది. సమావేశానికి ముందు తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ చిత్రపటానికి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే హరీశ్రావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీకిరణ్, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంగీతషా, డీఎంహెచ్వో డాక్టర్ ధనరాజ్తో పాటు వైద్యశాఖ అధికారులు పాల్గొన్నారు.