ఆకుపచ్చని తెలంగాణే లక్ష్యంగా స్వరాష్ట్రంలో ఏర్పాటైన ‘హరితహారం’తో పల్లె, పట్నం పచ్చదనంతో మెరిసిపోతున్నది. ఉద్యమంలా సాగిన కోట్లాది మొక్కల పెంపకంతో ఇటు అడవుల విస్తీర్ణం గణనీయంగా పెరుగడమే గాక ఊరూవాడన హరితశోభ సంతరించుకున్నది. అలాగే పల్లె ప్రగతి ద్వారా ఏర్పాటైన పల్లె ప్రకృతి వనాలు ప్రజలకు ఆహ్లాదం పంచుతూ ఊరికే కొత్తందం తీసుకొచ్చాయి. మొక్కల సంరక్షణ కోసం ‘హరితనిధి’ని సైతం ఏర్పాటుచేసిన సర్కారు.. తాజాగా గ్రామ పంచాయతీయలకు ఆదాయం తెచ్చిపెట్టే ‘సంపద వనాల’ను ప్రారంభించనున్నది. ‘హరితహారం’ సాధించిన విజయాలపై ‘తెలంగాణ హరితోత్సవం’ పేరుతో పండుగలా జరిపేందుకు ఉమ్మడి జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లుచేసింది.
– హనుమకొండ, జూన్ 18
హనుమకొండ, జూన్ 18 : ఆకుపచ్చని తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తలపెట్టిన ‘తెలంగాణకు హరితహారం’తో పల్లెల్లో పచ్చదనం పరుచుకున్నది. గత ఎనిమిది సంవత్సరాల నుంచి విజయవంతంగా సాగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా పల్లెలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా ప్రతి సంవత్సరం కోట్లాది మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. ఈ మొక్కలు చెట్లుగా మారి నేడు కాలుష్యరహిత సమాజానికి దోహదం చేస్తున్నాయి.
ఈ హరితహారం కార్యక్రమాన్ని కొనసాగించడంతో పాటు చేయూతను అందించి పకడ్బందీగా అమలు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర సర్కారు ‘హరిత నిధి’ని ఏర్పాటు చేసింది. పచ్చదనంతో పాటు ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు అన్ని గ్రామాల్లో ప్రకృతి వనాలను ఏర్పాటుచేసింది. వీటిలో రెండేళ్ల క్రితం నాటిన మొక్కలు ఏపుగా పెరుగడంతో పచ్చందాలు సంతరించుకున్నాయి. ఫలితంగా పల్లెలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. కాగా ఇప్పటివరకు అటవీ, గ్రామీణాభివృద్ధి శాఖ, మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కోట్లాది మొక్కలు నాటి పెంచిన అటవీ అధికారులు త్వరలోనే తొమ్మిదో విడుత హరితహారం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. వర్షాలు ప్రారంభం కాగానే ప్లాంటేషన్ చేయనున్నారు. కాగా, తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు హరితోత్సవం నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఈసారి కొత్తగా సంపద వనాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు.
కొత్తగా ‘సంపద’ వనాల ఏర్పాటు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈసారి కొత్తగా ‘సంపద’ వనాలను ఏర్పాటు చేస్తున్నారు. గ్రామ పంచాయతీలకు ఆదాయం సమకూర్చడమే లక్ష్యంగా ఈ సంపద వనాల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ వనంలో ముఖ్యంగా వెదురు, నార వేప, వేప, శిసు లాంటి కర్రకు సంబంధించిన మొక్కలతో పాటు సీతాఫలం, నేరేడు, ఉసిరి లాంటి పండ్ల మొక్కలను నాటనున్నారు. హనుమకొండ జిల్లాలో మొట్టమొదట నేడు ధర్మసాగర్లో మూడెకరాల స్థలంలో సంపద వనాన్ని ప్రారంభించనున్నారు.
నేడు తెలంగాణ హరితోత్సవం
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హనుమకొండ జిల్లాలో తెలంగాణ హరితోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వివిధ శాఖల ద్వారా అన్ని గ్రామాలు, మండలాలు, జిల్లా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ స్థలాలు, అటవీ భూములు, మున్సిపాలిటీల్లో మొక్కలు నాటనున్నారు. జిల్లాలోని పరకాల నియోజకవర్గంలో పరకాల, హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో ఎల్కతుర్తి అర్బన్ పార్కులో, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో హంటర్రోడ్డులోని కాకతీయ జూపార్కులో ఇనిస్టిట్యూషనల్ ప్లాంటేషన్, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ పరిధిలోని ధర్మసాగర్ కెనాల్ బండ్ వద్ద ‘సంపద’ వనాలను ఏర్పాటు చేయనున్నారు.
వనాలతో ఆహ్లాదకర వాతావరణం
గ్రామాలను స్వచ్ఛంగా మార్చే ప్రక్రియలో భాగంగా పారిశుధ్య నిర్వహణతో పాటు ఆహ్లాదకర వాతావారణం పెంచేలా ప్రభుత్వం ప్రతి పల్లెలో పల్లె ప్రకృతి వనాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హనుమకొండ జిల్లాలోని 12 గ్రామీణ మండలాల గ్రామ పంచాయతీల పరిధిలో 234 పల్లె ప్రకృతి వనాల నిర్మాణం పూర్తయ్యింది. అన్నింట్లోనూ పూర్తిస్థాయిలో మొక్కలు పెరిగాయి. మండుటెండల్లో మొక్కలు వాడిపోకుండా నిరంతరం నీటి సరఫరాతో, పర్యవేక్షణతో పల్లె ప్రకృతి వనాలు ఊర్లకు కొత్త అందాలను తెచ్చాయి. పల్లె ప్రకృతి వనాలతో గ్రామాల్లోని ప్రజలకు స్వచ్ఛమైన గాలితో పాటు ఆహ్లాదకర వాతావరణాన్ని పంచుతున్నాయి.
మొక్కల సంరక్షణే లక్ష్యంగా..
హారిత హారం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించడంతో పాటు మొక్కల సంరక్షణే లక్ష్యంగా ధీర్ఘకాలిక ప్రయోజనాల కోసం రా్రష్ట్ర ప్రభుత్వం హరిత నిధిని ఏర్పా టు చేసింది. ప్రతి సంవత్సరం సర్కారు హరితహారం కార్యక్రమంలో భాగంగా అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో మొక్కలు నాటడంలో నిర్దేశిత లక్ష్యానికి మించి నాటుతున్నప్పటికీ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో పాటు మొక్కల సంరక్షణపై దృష్టిపెట్టడం లేదు. దీంతో మొక్కలు చనిపోవడం.. మళ్లీ అక్కడే మొక్కలు నాటడం లాంటివి సర్వసాధారణమైంది. ఇలా కాకూడదనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం సర్కారు నిధుల సేకరణ కార్యక్రమం ప్రారంభించింది. ఇందుకు అన్ని వర్గాల ప్రజల నుంచి నిధులను ప్రతి సంవత్సరం సేకరిస్తున్నారు.