‘ముందొచ్చిన చెవులను వెనుకొచ్చిన కొమ్ములు వెక్కిరించిన చందం’గా తయారైంది ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ దుస్థితి. దశాబ్దాలుగా ‘హస్తా’న్ని పట్టుకొని ఉన్నవారిని కాదని, నిన్నమొన్న వచ్చిన టీడీపీ మాజీ నేతలకు పెద్దపీట వేయడం కాంగ్రెస్లో కాకపుట్టిస్తున్నది. టీడీపీ నుంచి వచ్చిన టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి నాయకత్వంలో ఉమ్మడి జిల్లాలోని అన్ని సెగ్మెంట్లలో టీడీపీ నుంచి హస్తం పార్టీలో చేరినవారికే టికెట్లు ఇచ్చే కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతల నుంచి విమర్శలు వెల్లువెత్తున్నాయి. ‘పాత దోస్తులు’ లేనిచోట కొత్తవారికి అవకాశం ఇస్తున్నారని, సీనియర్లను పక్కనబెట్టి మొత్తంగా కాంగ్రెస్ పార్టీలోనే టీడీపీ దుకాణం పెడుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
వరంగల్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో అయోమయం ఇంకా పెరుగుతున్నది. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లోనూ ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి వరుసగా టిక్కెట్లు ఖరారవుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. దీంతో ఇన్నేండ్లు పార్టీ కోసం పనిచేసిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నుంచి వచ్చి పీసీసీ అధ్యక్షుడైన నాయకత్వంలో కాంగ్రెస్లో మొదటి నుంచి ఉంటున్న నేతలకు అవకాశాల పరంగా అన్యాయం జరుగుతున్నది. రాష్ట్ర స్థాయిలోనే కాకుండా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని అన్ని సెగ్మెంట్లలో టీడీపీ నుంచి వచ్చిన వారికే టిక్కెట్ దక్కేలా రేవంత్రెడ్డి కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్లోని సీనియర్ నేతలు చెబుతున్నారు. టీడీపీ పాత దోస్తులు లేని చోట్ల ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి రేవంత్రెడ్డి అండదండలు ఉంటున్నాయని అంటున్నారు.
ఏ రకంగా అయినా కాంగ్రెస్లో మొదటి నుంచి ఉంటున్న వారికి టిక్కెట్ రాకుండా చేయడమే లక్ష్యంగా రేవంత్రెడ్డి చక్రం తిప్పుతున్నారని పేర్కొంటున్నారు. తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి కాంగ్రెస్లో చేరుతున్నారు. పరకాల నుంచి పోటీ చేస్తానని ప్రకాశ్రెడ్డి ప్రకటించారు. నర్సంపేట నుంచి మూడుసార్లు గెలిచిన ప్రకాశ్రెడ్డి టీడీపీ నుంచి బీజేపీలో చేరారు. ఇప్పుడు కాంగ్రెస్లో చేరుతున్నారు. కొత్తగా చేరుతున్న ప్రకాశ్రెడ్డికి పరకాల నుంచి పోటీ చేసే అవకాశం ఇస్తుండడంపై కాంగ్రెస్లో ఆందోళన మొదలైంది. గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన నాయకులు ఈ పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2014లో పరకాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇనుగాల వెంకట్రామిరెడ్డి పోటీచేశారు. 2018 ఎన్నికల్లో కొండా సురేఖ పోటీలో ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో వెంకట్రామిరెడ్డి, కొండా మురళీధర్రావు పరకాల కాంగ్రెస్ టిక్కెట్ ఆశిస్తున్నారు. వీరిద్దరిని కాదని ఇప్పుడు కొత్తగా చేరుతున్న రేవూరికి టిక్కెట్ ఇవ్వడం ఏమిటని కాంగ్రెస్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రకాశ్రెడ్డికి చాన్స్ ఇస్తే పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని నియోజకవర్గంలోని ద్వితీయశ్రేణి నేతలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ అధిష్టానాన్ని హెచ్చరించారు.
ఉమ్మడి జిల్లాలోని ఎక్కువ సెగ్మెంట్లలో టీడీపీ నుంచి వచ్చిన వారికే కాంగ్రెస్ టిక్కెట్లు దక్కుతున్నాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధనసరి అనసూయ కాంగ్రెస్లో చేరగానే అక్కడి స్థానిక నేత పోదెం వీరయ్యను భద్రాచలం నియోజకవర్గానికి పంపారు. గత ఎన్నికల్లో, ఇప్పుడు అనసూయకు ములుగు టిక్కెట్ ఇచ్చారు. మరో టీడీపీ మాజీ నేత గండ్ర సత్యనారాయణరెడ్డిని భూపాలపల్లి అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది. డోర్నకల్లోనూ గత ఎన్నికల్లో జాటోత్ రాంచంద్రునాయక్కు టిక్కెట్ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ ఆయన టిక్కెట్ ఆశిస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సీనియర్ నేతలను కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే టిక్కెట్లు ఇచ్చేలా పీసీసీ నాయకత్వం నిర్ణయాలు తీసుకుంటున్నదని హస్తం పార్టీ శ్రేణులు చెబుతున్నారు. జనగామ సెగ్మెంట్లో పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను కాదని, బీజేపీ నుంచి వచ్చిన కొమ్మూరి ప్రతాప్రెడ్డికి టిక్కెట్ ఇచ్చేలా పీసీసీ నాయకత్వం నిర్ణయం తీసుకుంటున్నదని తెలిసింది. నాలుగున్నర దశాబ్దాలపాటు కాంగ్రెస్లో కొనసాగిన పొన్నాల ప్రస్తుత నాయకులు చేస్తున్న అవమానాలను తట్టుకోలేక ఆ పార్టీని వీడారు. పాలకుర్తి, వర్ధన్నపేట సెగ్మెంట్లోనూ కాంగ్రెస్ సీనియర్ నేతలను కాదని కొత్తగా చేరుతున్న వారికి పోటీ చేసే అవకాశం ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. దీంతో ఈ సెగ్మెంట్లలో టిక్కెట్ ఆశిస్తున్న పాత నేతలు, కాంగ్రెస్ కేడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పరకాల టికెట్ ఇవ్వకుంటే
హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 17: కాంగ్రెస్ పార్టీ పరకాల నియోజకవర్గ టికెట్ ఇనుగాల వెంకట్రామిరెడ్డికి ఇవ్వకుంటే పార్టీకి మూకుమ్మడిగా చేస్తామని ఆ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. హనుమకొండ బాలసముద్రంలోని ప్రెస్క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, డివిజన్ల అధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచులు, బ్లాక్ కాంగ్రెస్ హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు, అన్యాయం చేయొద్దని, పరకాల టికెట్ కోసం ఇప్పుడు కొత్త పేర్లు పరిశీలించడం సరికాదని, కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని కాపాడి, కార్యకర్తలకు అండగా ఉన్న నాయకుడికి టికెట్ ఇవ్వాలని పీసీసీ అధ్యక్షుడిని కోరారు. పరకాల బ్లాక్కాంగ్రెస్ అధ్యక్షుడు బీరం రజినీకర్రెడ్డి (ఎంపీటీసీ గూడెప్పహాడ్), ఆత్మకూరు ప్యాక్స్ చైర్మన్ రవీందర్గౌడ్, కాంగ్రెస్ పార్టీ ఆత్మకూరు, దామెర, సంగెం, గీసుగొండ, నడికూడ మండలాల అధ్యక్షులు, సర్పంచ్లు, నాయకులు పాల్గొన్నారు.