స్టేషన్ఘన్పూర్, జనవరి 6 : నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంలో, యువతకు ఉపాధి కల్పించడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి విమర్శించారు. ప్రధాని నరేంద్రమోదీ అనుసరిస్తున్న విధానాలతో ఉపాధి అవకాశాలు తగ్గి నిరుద్యోగం పెరుగుతున్నదని అన్నారు. శుక్రవారం మండలంలోని నమిలిగొండలో కడియం ఫౌండేషన్ సహకారంతో కడియం యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి సీజన్-3 మెగా క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, జడ్పీ చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్రెడ్డి, మాజీ ఎంపీ సీతారాంనాయక్ హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
అనంతరం బీఆర్ఎస్ జిల్లా నాయకుడు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బెలిదె వెంకన్న అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడారు. దేశంలో 40 ఏళ్లలోపున్న యువత 50 శాతం మంది ఉన్నారన్నారు. 2014, 2018, 2019లో జరిగిన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రజలకు హామీ ఇచ్చిన ప్రధాని మోదీ 16 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు. యువతకు ఉద్యోగాలు , ఉపాధి కల్పించక పోగా ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తున్నారని ఆయన విమర్శించారు. కొన్నింటిని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్న ఉద్యోగాలను కేంధ్ర ప్రభుత్వం ఊడగొడుతున్నదన్నారు.
బీఆర్ఎస్ను విమర్శించే హక్కు ఏ పార్టీకి లేదు
దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇవ్వడంతోపాటు రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, దళితబంధు, ఆసరా పెన్షన్ వంటి సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తూ తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా అభివృద్ధి చేస్తున్నారని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు.
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో వీటిని అమలు చేయని ఆ పార్టీ నేతలు బీఆర్ఎస్ పాలనను, సీఎం కేసీఆర్ను విమర్శించే అర్హత లేదన్నారు. తెలంగాణలో ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు అందించాలనే ధ్యేయంతో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెడితే విపక్ష పార్టీలకు వణుకు పుట్టిందన్నారు. వ్యవసాయం రంగంపై సుమారు 60 శాతం మంది ఆధారపడి ఉన్నందుకే రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ పథకాలు ప్రవేశపెట్టడంతో మంచి పలితాలు వచ్చాయన్నారు. 2014కు ముందు 68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తే ఇప్పుడు 2కోట్ల మెట్రిక్ టన్నుల దిగుబడితో మూడంతల దిగుబడి పెరిగిందన్నారు.
పెట్టుబడులకు నిలయంగా హైదరాబాద్
సీఎం కేసీఆర్ పాలనతో దేశంలోనే తెలంగాణ మోడల్గా నిలిచిందని ఎమ్మెల్సీ కడియం అన్నారు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుల, మతాల మధ్య చిచ్చుపెట్టి వివిధ రాష్ర్టాల్లోని ప్రభుత్వాలను కూలదోస్తున్నదన్నారు. తెలంగాణలో యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో వివిధ శాఖలలో ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు ఇస్తున్నారని శ్రీహరి వివరించారు.