కాకతీయ యూనివర్సిటీలోని పరీక్షల విభాగంలో ఉద్యోగులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. రూ.2500 ఇస్తేనే డిగ్రీ సర్టిఫికెట్ ఇస్తామని డిమాండ్ చేస్తున్నారని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కేయూలో కాంట్రాక్టర్ నుంచి రూ.50వేలు లంచం తీసుకుంటూ అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఆడిట్ ఆఫీసర్ కిష్టయ్య ఏసీబీకి పట్టుబడినా ఉద్యోగుల్లో మాత్రం మార్పు రావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డిగ్రీ, పీజీ పూర్తయి నెలలు గడుస్తున్నా సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో ఎగ్జామినేషన్ బ్రాంచ్లో ప్రతి రోజూ పడిగాపులు కాస్తున్నామని.. వారి నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేకపోతున్నామని వాపోతున్నారు.
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని వేలాది మంది విద్యార్థులు కేయూ పరిధిలో డిగ్రీ, పీజీ చదువుతున్నారు. చదువు పూర్తయి సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నా నెలల తరబడి తిప్పుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఆన్లైన్లో షార్ట్మెమో కోసం వెయ్యి అదనంగా చెల్లించినా నిర్ణీత గడువులోగా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. చదువుకున్న కాలేజీకి వెళ్తే ఇంకా సర్టిఫికెట్లు రాలేదు యూనివర్సిటీకి వెళ్లి తెచ్చుకోవాలని చెబుతున్నారు. తీరా ఇక్కడికి వస్తే డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆదిలాబాద్, కొత్తగూడెం నుంచి వచ్చిన విద్యార్థులు తెలిపారు. డిగ్రీ లాంగ్ మెమో కోసం శనివారం వస్తే ఎగ్జామినేషన్ బ్రాంచ్లో సర్టిఫికెట్లు ఇచ్చే ఉద్యోగి కిషన్ ఏకంగా రూ.2500 ఇవ్వాలని డిమాం డ్ చేశాడని రూ.500 ఇస్తే తీసుకోలేదని వారు చెప్పారు.
డబ్బులు అడిగినంత ఇవ్వకపోవడంతో సర్టిఫికెట్లు కాలేజీకి పంపామని కసురుకున్నాడని ఆవేదన వ్యక్తంచేశారు, ఇంతకు మీరు సర్టిఫికెట్ ఇస్తారా? ఇవ్వరా చెప్పండి అంటూ అడిగితే కాలేజీకి పంపాం.. అక్కడికి వెళ్లి తీసుకోపోండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని వివరించారు. తీరా కాలేజీకి ఫోన్ చేస్తే మేం తీసుకురాలేదు యూనివర్సిటీలోనే ఉన్నాయని బదులిచ్చినట్లు చెప్పారు. అదేమిటి ఇక్కడే ఉన్నాయా అని నిలదీస్తే అవును ఉన్నాయి వెతకాలి కదా మీరు మళ్లీ సోమవారం రండి అం టూ హుకుం వేసినట్లు చెప్పారు. మళ్లీ బుధవారం వస్తే తిప్పించుకుంటున్నారని ఎగ్జామినేషన్ బ్రాంచ్లో సుమన్ అనే ఉద్యోగి డబ్బులిస్తే తొందరగా అయిపోతుందని, ఎంతోకొంత ఇచ్చి తీసుకుపోండి అంటున్నారని బాధిత విద్యార్థులు ఆరోపిస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే క్యాండిడేట్ రావాలని లేకపోతే సర్టిఫికెట్ ఇవ్వమంటున్నారని, మదర్ బేబీ ఉన్నా కూడా సర్టిఫికెట్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తున్నారని, లేకుంటే తిప్పుకుంటున్నారని, ఈ విషయమై అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
ఎగ్జామినేషన్ బ్రాంచ్లోని ఉద్యోగులకు డబ్బులు తీసుకోవడం అలవాటైపోయింది. డబ్బులు తీసుకుంటున్నారా అని నేను అడిగేతే మేం అడగలేదు, తీసుకోలేదంటున్నారు. సర్టిఫికెట్ల కోసం రెండు, మూడుసార్లు తిరిగితే ఖర్చులవుతాయి కదా అందుకే అవే డబ్బులు మా ఉద్యోగులకు ఇచ్చి సర్టిఫికెట్లు తీసుకెళ్తున్నారు. గతంలో కూడా నా దృష్టికి వస్తే వారిని మార్చేశాను. సర్టిఫికెట్లు తీసుకోవడానికి యూనివర్సిటీ సంబంధించిన చలాన్ ద్వారానే చెల్లించాలి. డబ్బులు ఇవ్వకూడదు. తీసుకుంటే ఒకసారి రెడ్హ్యాండెడ్గా పట్టుకుందాం. సిబ్బందికి ఫోన్ పే చేసినట్లు ప్రూఫ్ ఉంటే చర్యలు తీసుకోవచ్చు.