ములుగు రూరల్, మార్చి12: భోజనానికి ఆలస్యంగా వచ్చాడని అసిస్టెంట్ కేర్ టేకర్ ఓ విద్యార్థిని కొట్టగా దవడ పన్ను ఊడిన ఘటన ములుగు మండలం మల్లంపల్లిలోని ఏటూరు నాగారం సోషల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. ఈ విషయం మంగళ వారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. గురుకులంలో 6వ తరగతి చదువుతున్న చరణ్ సోమవారం భోజనం సమయానికి లేట్గా ప్లేట్ పట్టుకొని వెళ్లిన క్రమంలో అక్కడే ఉన్న అసిస్టెంట్ కేర్ టేకర్ రాజు చేయిచేసుకున్నాడు.
దెబ్బ గట్టిగా తలగడంతో విద్యార్థి దవడ పన్ను ఊడి రక్తస్రావమైంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు గురుకులానికి చేరుకొని రాజు తీరుపై మండిపడ్డారు. ఈ విషయంపై ఆరా తీసిన ప్రిన్సిపాల్ అంకయ్య అసిస్టెంట్ కేర్ టేకర్ను మందలించి మెమో జారీ చేశామని తెలిపారు. ఆర్సీఓ, డీసీఓల ఆదేశాల మేరకు అసిస్టెంట్ కేర్ టేకర్పై తదుపరి చర్యలు ఉంటాయన్నారు.