Peddi Sudarshan Reddy | వరంగల్, జూలై 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి వరంగల్ జిల్లా తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా ఇక్కడి నుంచే మొదలయ్యేది. ఉద్యమాల పరంగా చైతన్యవంతమైన ప్రాంతంగా స్థిరపడిపోవడం, ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్రావు, ప్రొఫెసర్ బుర్రా రాములు సహా అనేక మంది భిన్నపార్శాలు, విభిన్న అభిప్రాయాలు గల వారెంతో మంది ఉన్నా తెలంగాణ అంశం వచ్చేసరికి అందరి దారీ ఇక్కడ ఒక్కటిగానే ఉండేది. న్యాయవాదులు, వైద్యులు సహా కాకతీయ విశ్వవిద్యాలయం అందించిన మేధోసమాజం, తక్షణం స్పందించే విద్యార్థులు ఉండటం వంటి సానుకూల అంశాలు బీఆర్ఎస్కు కలిసివచ్చాయి. మొదట్లో సంస్థాగత నిర్మాణం లేకపోయినా బోయినపల్లి వినోద్కుమార్, సహోదర్రెడ్డి, కోల జనార్దన్, జన్ను జకార్య, కరిమిళ్ల బాబురావు, మందాడి సత్యనారాయణరెడ్డి వంటివారితో పోలిస్తే వయస్సులో యువకుడిగా పెద్ది సుదర్శన్రెడ్డి అందరిలో క్రియాశీలకంగా వ్యవహరించేవాడు. ఏదైనా టాస్క్ అప్పగిస్తే పూర్తి చేసేదాకా విడిచిపెట్టనితనం పెద్దికి ఉండటంతో కేసీఆర్ ఆంతరంగికుల్లో పెద్ది ఒకడిగా నిలిచారు. బీఆర్ఎస్లో చేరినప్పటి నుంచి చివరి దాకా ఉమ్మడి వరంగల్ రాజకీయంగా, ఉద్యమ పరంగా ఏ నిర్ణయం తీసుకున్నా పెద్ది ముందుండేవారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆంతరంగికుల్లో పెద్ది సుదర్శన్రెడ్డి ఒకడిగా చేరిపోయాడు. 2001లో నల్లబెల్లి జడ్పీటీసీగా ఉన్న సమయంలో అప్పటి జడ్పీ ఫ్లోర్ లీడర్గా ఉన్న కొమ్మూరి ప్రతాప్రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు వెళ్లారు. ఆ సమయంలో జడ్పీ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్గా నియమితులైన తర్వాత టీడీపీ అవినీతిపై అలుపెరుగకుండా పోరాటం చేశారు. జడ్పీ చైర్మన్ బస్వారెడ్డి అవినీతిని బయటపెట్టడంలో పెద్ది వాక్పటిమ, ఆయా అంశాలపై పరిశోధన, నాయకత్వ లక్షణాలు అధినేత కేసీఆర్ను ఆయనకు మరింత దగ్గర చేశాయి. 2004 ఎన్నికల్లో నర్సంపేట ఎమ్మెల్యేగా కంభంపాటి లక్ష్మారెడ్డిని గెలిపించడంలో పెద్ది సుదర్శన్రెడ్డి కీలకపాత్ర పోషించారు. బీఆర్ఎస్ టికెట్ సాధించి, తెలంగాణ వాదాన్ని నెత్తికెత్తుకొని ఊరూరా ప్రచారం చేసి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. తెలంగాణ వ్యాప్తంగా 10 మంది ఉంటే నలుగురు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన (దుగ్యాల శ్రీనివాసరావు, మందాడి సత్యనారాయణరెడ్డి, కంభంపాటి లక్ష్మారెడ్డి, బండారి శారారాణి)వారే ఉండటం వరంగల్ ఉద్యమ చైతన్యానికి మాయని మచ్చను తెచ్చిపెట్టింది. 10 మంది ఎమ్మెల్యేలు ఎవరికివారుగా షిరిడీకి వెళ్లి అక్కడ సమావేశమై తిరిగి వచ్చాక నాటి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో, పీసీసీ అధ్యక్షుడు కే కేశవరావు సమక్షంలో కాంగ్రెస్లో చేరుతున్నారనే విశ్వసనీయ సమాచారాన్ని పార్టీ అధినేత కేసీఆర్కు చేరవేసిన వారిలో పెద్ది ముఖ్యుడు.
పెద్దికి ఎంతటివారినైనా ఎదుర్కొంటాడనే ముద్ర మొదటి నుంచీ ఉన్నది. వైఎస్ రాజశేఖర్రెడ్డి, చంద్రబాబు వంటి హేమాహేమీల జిల్లా పర్యటనలు వరంగల్ ఉమ్మడి జిల్లాను అతలాకుతలం చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. వరంగల్ నుంచి వైఎస్, చంద్రబాబు ప్రభలు కొనసాగుతున్న.. అటు కాంగ్రెస్కు, ఇటు టీడీపీకి బలమైన నాయకత్వం ఉన్న సమయంలో వారిని ఎదుర్కొనేందుకు వాటి కన్నా బలమైన తెలంగాణ వాదం, దీనికితోడు కేసీఆర్ ఇచ్చిన గుండెధైర్యంతో పెద్ది సుదర్శన్రెడ్డి తనను తాను సాయుధుడిగా మలచుకునేలా చేసింది. పెద్ది నాయకత్వ పటిమను చూసి కేసీఆర్ 2006లో పెద్దిని వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిని చేశారు. అప్పటి నుంచి పెద్ది ఇక వెనుదిరిగి చూడలేదు.
వరుస ఉపఎన్నికలు..ఉద్యమకేంద్రాలు
ఉపఎన్నికలు ఉద్యమవ్యాప్తికి దోహద కేంద్రాలుగా కేసీఆర్ మార్చిన ప్రతి సందర్భంలోనూ వరంగల్ తన ప్రత్యేకత చాటుకున్నది. అధినేత కేసీఆర్ ఆలోచనలను అమలు చేసే కరడుగట్టిన సైనికుడిగా పెద్దికి ప్రత్యేక ముద్ర ఉన్నది. 2006లో కేసీఆర్ కరీంనగర్ ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల బరిలో నిలిచినపుడు జిల్లా నుంచి నాయకులు, కార్యకర్తలను కరీంనగర్ ప్రచారంలో మమేకం చేశారు. 2008లో ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు రాజీనామా చేసిన సమయంలోనూ, 2010 ఉపఎన్నికల సమయంలోనూ, 2012 పరకాల ఉపఎన్నికల సందర్భంలోనూ పెద్ది సమన్వయ సారథ్యం వహించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం 2014 ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గం నుంచి పెద్ది సుదర్శన్రెడ్డి పోటీచేసి ఓడిపోయారు. పెద్ది సుదర్శన్రెడ్డి పార్టీకి చేసిన సేవలు, తెలంగాణ ఉద్యమంలో మమేకమైన తీరుకు ముచ్చటపడిన కేసీఆర్ ఆయనకు రాష్ట్రస్థాయిలో సముచితస్థానం కల్పించారు. రాష్ట్ర సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్గా పెద్ది సుదర్శన్రెడ్డికి అవకాశం కల్పించారు. ఆ తర్వాత 2018లో నర్సంపేట నుంచి పెద్ది ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్న క్రమంలో కేసీఆర్ పెద్ది కోరికతో ఆ అవకాశాన్ని నర్సంపేటకు కల్పించారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కరడుగట్టిన సైనికుడిగా సుదర్శన్రెడ్డి తనను తాను మలుచుకున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పే అనేక ఘటనలకు వరంగల్ను వేదిక చేయడంలో కీలకపాత్ర పోషించారు. పార్టీ ఇచ్చిన ఏ ఉద్యమ కార్యాచరణ అయినా విజయవంతం కావాల్సిందే. మొత్తం తెలంగాణ ఉద్యమాన్నే మలుపుతిప్పిన మానుకోట ఘటన, రాయినిగూడెం తిరుగుబాటు పెద్ది జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే జరుగటం గమనార్హం. తెలంగాణ విశ్వరూప సభ, 2010 డిసెంబర్ 16న 25 లక్షల మందితో నిర్వహించిన భారీ బహిరంగ సభ తెలంగాణ మహాగర్జన ప్రపంచ ప్రజా, రాజకీయ ఉద్యమాల చరిత్రలో కీలకంగా నిలిచిపోయాయి. ఈ సభలు పెద్ది జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జరిగినవే. సినీనటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని నెలకొల్పి తెలంగాణ అంశంపై ఎటూ తేల్చని వైనాన్ని ప్రశ్నించేందుకు బీఆర్ఎస్ పోరాటాలు చేపట్టింది. ఆ సమయంలో వరంగల్ పర్యటనకు వచ్చినప్పుడు తెలంగాణ వాదంపై తేల్చని చిరంజీవిపై కోడిగుడ్డు విసిరి నిరసన తెలిపిన ఘటనను ప్రత్యేకంగా చెప్పుకొంటారు. ఈ ఘటనకు నర్సంపేట సాక్షీభూతంగా నిలిచింది. నాడు చంద్రబాబు పాలకుర్తి పర్యటన ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఉద్రిక్తతల నడుమ వేలాది మంది గూండాలతో చంద్రబాబు పర్యటిస్తే ‘చంద్రదండు’ను అడ్డుకుంటామని పార్టీ నిర్ణయం తీసుకోగా జిల్లా పార్టీ సమన్వయంతో ఎక్కడికక్కడ నిరసనలు చేపట్టి, వాటిని విజయవంతం చేసినవారిలో పెద్ది కీలకపాత్ర పోషించారు.

తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాతే పెండ్లి చేసుకుంటానని పెద్ది ప్రతినబూనారు. ఆ కల సాకారమైన తర్వాతే ఉద్యమకారిణి స్వప్నతో పెద్దికి వివాహమైంది. తిరుపతిలో జరిగిన వారి పెండ్లికి కేసీఆర్, శోభమ్మ దంపతులు, పార్టీ రాష్ట్ర, జిల్లా ముఖ్యనాయకులు అనేకమంది హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమకారులకు ఎంత దగ్గరివాడో, కేసీఆర్ కుటుంబానికి అంతే దగ్గరివాడుగా పెద్ది సుదర్శన్రెడ్డి మెదిలి అందరితలలో నాలుకలా మారిన నేపథ్యాన్ని ప్రతి ఒక్కరూ నెమరువేసుకుంటున్నారు.

నర్సంపేటలో పెద్ది సుదర్శన్రెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్న బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత హరీశ్రావు, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్రెడ్డి, కొత్త ప్రభాకర్రెడ్డి

నర్సంపేటలో పెద్ది అంతిమయాత్రను దుకాణ భవనాల పైనుంచి వీక్షిస్తున్న అభిమానులు, పట్టణవాసులు

పెద్ది సుదర్శన్రెడ్డి సేవలను తలుచుకొని దుఃఖిస్తున్న మహిళ

పెద్ది మరణాన్ని తట్టుకోలేక బస్సు నుంచి చూసి తల్లడిల్లుతున్న మహిళ

అంతిమయాత్రలో పెద్ది పార్థివదేహాన్ని చూసి భోరున విలపిస్తున్న మహిళ

అంతిమయాత్రలో పిల్లలతో సహా పాల్గొని చేతులెత్తి మొక్కుతున్న మహిళ

నర్సంపేట మండలం లక్నేపల్లిలో పెద్ది అంతిమయాత్ర కోసం వేచి చూస్తున్న మహిళలు, అభిమానులు