భీమదేవరపల్లి/వేలేరు, నవంబర్ 11: పార్లమెంటులో జరిగిన పెప్పర్ స్ప్రే కారణంగా పొన్నం ప్రభాకర్ మతిభ్రమించినట్లుందని, అందుకే హుస్నాబాద్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి అతడి కండ్లకు కనిపించడం లేదని బీఆర్ఎస్ హుస్నాబాద్ అభ్యర్థి, ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ విమర్శించారు. శనివారం వేలేరు మండలంలోని ఎర్రబెల్లి, భీమదేవరపల్లి మండలంలోని గొల్లపల్లి, ముస్తఫాపూర్, గట్లనర్సింగాపూర్, బొల్లోనిపల్లి, రాంనగర్, విశ్వనాథకాలనీ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్లో రెండుసార్లు పోటీచేసి ఓడిపోయిన పొన్నం ఇక్కడకు వలస వచ్చాడని ఎద్దేవా చేశారు. అక్కడ చెల్లని వ్యక్తి ఇక్కడేం చేస్తడో ప్రజలు ఆలోచించాలని కోరారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎప్పుడైనా, ఏ నాయకుడైనా కులం పేరుతో వచ్చాడా అని ప్రశ్నించారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు, వచ్చిన తర్వాత అభివృద్ధిలో నియోజకవర్గం రూపురేఖలు ఎలా మారిందో లేదో మీరే చెప్పాలన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు అప్పటి ప్రభుత్వం 1.14 టీఎంసీల సామర్థ్యంతో పదివేల ఎకరాలకు మాత్రమే సాగునీరందించాలని ప్రవేశపెట్టిందన్నారు. కానీ, సీఎం కేసీఆర్ రైతాంగ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని గౌరవెల్లి సామర్థ్యాన్ని 8.23 టీఎంసీలకు పెంచారని గుర్తుచేశారు. 3,982 మంది భూనిర్వాసితులకు ప్రభుత్వం పరిహారం అం దించిదన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం పాటుపడిన తాను.. మీ ఆశీర్వాదం కోసం వచ్చానని, తనను మూడోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
కొట్లాడి తెచ్చుకున్న రాష్ర్టాన్ని మళ్లీ ఢిల్లీ వాళ్ల చేతుల్లో పెడదామా అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ హుస్నాబాద్ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి ఇనుగాల పెద్దిరెడ్డి ప్రశ్నించారు. ఆనాడు రాత్రిళ్లు టార్చి లైటు పట్టుకుని ఎప్పుడు కరెంట్ వస్తదో.. ఎప్పుడు పంటకు నీళ్లు పారియల్నో అని బావులకాడ కాపలా కాసిన రోజులను బీఆర్ఎస్ పాలనలో మర్చిపోయామన్నారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాత రోజులు పునరావృతమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల నాయకులు ఎన్నికల ప్రచారానికి వచ్చి కల్లబొల్లి మాటలు చెబుతారని, వారి మాయలో పడొద్దని కోరారు. కారుగుర్తుకు ఓటు వేసి సతీశ్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ సుధీర్కుమార్, ఎంపీపీ అనిత, జడ్పీటీసీ వంగ రవి, వైఎస్ ఎంపీపీ మాడుగుల ఎజ్రా, మాజీ ఎంపీపీ సంగ సంపత్, సర్పంచులు, ఎంపీటీసీ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేందర్రెడ్డి, నాయకులు నవాబ్పాషా, శ్రీనివాస్, మాక లాజరస్, గూడ రాజ్కుమార్, సల్పాల తిరుపతి, ఏనుగు సత్యవతి, అప్పని భిక్షపతి, బాబు, సుకుమార్, వల్లెపు రమేశ్ పాల్గొన్నారు.