హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 11: గ్రూప్-1 పరీక్షను రద్దు చేయాలని కాకతీయ యూనివర్సిటీ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కేయూ మొదటిగేటు వద్ద బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి, టీజీపీఎస్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం టీజీపీఎస్సీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా కాకతీయ యూనివర్సిటీ బీఆర్ఎస్వీ అధ్యక్షుడు బైరపాక ప్రశాంత్, ఇంచార్జి జెట్టి రాజేందర్, రాష్ర్ట ప్రధాన కార్యదర్శి శరత్చంద్ర మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ నిరుద్యోగ యువతకు శాతంగా మారిందని, హైకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా గ్రూప్-1 పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
గ్రూప్-1 పరీక్ష నిర్వహించిన అనేక సెంటర్లలో అక్రమాలు జరిగిన నేపథ్యంలో వాటిని రద్దు చేయాలని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ టీజీపీఎస్సీ చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అందరి అభ్యర్థులకు 28 కేంద్రాల్లో సెంటర్లు కేటాయించగా కోటి ఉమెన్స్ కాలేజీలో మహిళ అభ్యర్థులకి ప్రతేకంగా రెండు సెంటర్లలో 71 మంది ఎంపికయ్యారని, మిగిలిన 26 సెంటర్లో 139 మంది ఎంపిక కావడం ఎలా సాధ్యమని వారు ప్రశ్నించారు. 563 ఉద్యోగాలలో కేవలం 9 శాతం మంది మాత్రమే తెలుగు మీడియం విద్యార్థులు ఉన్నట్లు టీజీపీఎస్సీ సీల్డ్ కవర్లో పేర్కొందని తెలిపారు. ఇంగ్లీష్లో 12,381 మంది పరీక్ష రాస్తే 508 మంది ఎంపికయ్యాని, తెలుగులో 8,694 మంది పరీక్ష రాస్తే కేవలం 56 మంది మాత్రమే ఎంపికయ్యారని దీని వలన తెలుగుమీడియం చదివిన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం పట్టింపులకుపోకుండా హైకోర్టు డివిజన్ బెంచికి, సుప్రీంకోర్టుకి వెళ్లవద్దని అభ్యర్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ర్ట నాయకులు కలకోట్ల సుమన్, హనుమకొండ జిల్లా కోఆర్డినేటర్స్ గండ్రకోట రాకేష్యాదవ్, రాష్ర్ట నాయకులు గొల్లపల్లి వీరస్వామి, బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకులు కోరపెల్లి రాజేష్, రాసూరి రాజేష్, బుర్ర మహేష్ పాల్గొన్నారు.