వరంగల్ చౌరస్తా, మే 17 : త్వరలోనే వరంగల్లో మోడల్ బస్స్టేషన్ నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. బుధవారం కలెక్టర్ ఆర్టీసీ, కుడా, మున్సిపల్ అధికారులతో కలిసి బస్టాండ్ని సందర్శించారు. తాత్కాలిక బస్టాండ్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. మే 25వ తేదీలోగా తాత్కాలిక బస్టాండ్ ఏర్పాటు చేయాలని, జూన్ 1న పాత బస్టాండ్ ఆవరణలోని నిర్మాణాల కూల్చివేత పనులు ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వరంగల్ రైల్వే గూడ్స్ షెడ్ రోడ్డు నుంచి రైల్వే స్టేషన్ మధ్య ఉన్న స్థలంలో తాత్కాలిక బస్టాండ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఎస్ఎన్ఎం క్లబ్ ముందు ఉన్న రోడ్డుపై జిల్లా బస్టాండ్, వెనుక భాగంలో ఉన్న రోడ్డు ద్వారా లోకల్ బస్సు సర్వీసులను నడిపించాలని పేర్కొన్నారు. మున్సిపల్ కాంప్లెక్స్కు ఎదురుగా ఉన్న మరుగుదొడ్లతో పాటు తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టనున్నామని తెలిపారు.
ప్రయాణికుల సౌకర్యార్థం తాత్కాలిక షెడ్లు, తాగునీరు, కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నూతన మోడల్ బస్స్టేషన్ నిర్మాణ పనులను 18 నెలల్లో పనులు పూర్తి చేస్తామని, అప్పటి వరకు ప్రజలు, ప్రయాణికులు సహకరించాలని కోరారు. అనంతరం కలెక్టరేట్ నిర్మించనున్న ఆజంజాహీ మిల్స్ స్థలాన్ని సందర్శించారు. 16.34 ఎకరాల స్థలంలో చేపట్టనున్న సమీకృత కలెక్టరేట్ భవనం, 8 క్వార్టర్స్ నిర్మాణ స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి వచ్చిన ట్లు అధికారులు తెలిపారు. జిల్లా పరిపాలన భవ నాన్ని సర్వహంగులు కలిగి ఉండేలా ప్లానింగ్ సిద్ధం చేయాలని, స్థలాన్ని చదును చేసి, లే అవుట్ చేయాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించా రు. కార్యక్రమంలో వరంగల్ ఆర్డీవో మహేందర్జీ, ఆర్టీసీ ఆర్ఎం శ్రీలత, ఈఈ భాస్కర్, డిపో-2 డీఎం సురేశ్, కుడా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ అజిత్రెడ్డి, ఈఈ భీంరావ్, మున్సిపల్ డీఈ నరేందర్, సతీశ్ పాల్గొన్నారు.
మామునూరు ఎయిర్పోర్టు స్థల పరిశీలన..
కరీమాబాద్ : కలెక్టర్ ప్రావీణ్య అధికారులతో కలిసి మామునూరులోని ఎయిర్ పోర్టు స్థలాన్ని సందర్శించారు. ఎయిర్పోర్టుకు సంబంధించిన మ్యాప్లను పరిశీలించారు. ఎయిర్పోర్టు కోసం అవసరమైన భూమి గుర్తింపు, భూసేకరణ విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.