ఖిలావరంగల్/హనుమకొండ, మే 27: జూన్ 2 నుంచి 22 వరకు నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలకు విస్తృత ఏర్పాటు చేసినట్లు వరంగల్, హనుమకొండ కలెక్టర్లు పీ ప్రావీణ్య సిక్తా పట్నాయక్ తెలిపారు. ఉత్సవాల్లో వివిధ శాఖలు చేయాల్సిన పనులపై శనివారం వరంగల్, హనుమకొండ కలెక్టరేట్లలో వారు అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా వరంగల్ కలెక్టర్ పీ ప్రావీణ్య మాట్లాడుతూ జూన్ 2 నుంచి 21వ తేదీ వరకు జరుగనున్న ప్రతి కార్యక్రమంలో బ్యాగ్రౌండ్లో లోగోను ఏర్పాటు చేయాలన్నారు. జూన్ 2న జెండా వందనం కోసం ఆజంజాహీ మిల్ స్థలంలో ఏర్పాటు చేయాలని వరంగల్ ఆర్డీవోకు సూచించారు. అలాగే, ఎన్పీడీసీఎల్, మైన్స్, పోలీస్ శాఖల సహకారంతో పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. జూన్ 2న ఖిలావరంగల్లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించే కార్యక్రమం ఉంటుందన్నారు. అనంతరం చీఫ్ గెస్ట్ శాసన మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాశ్తో జెండా వందన కార్యక్రమ నిర్వహణ ఉంటుందన్నారు. తర్వాత తెలంగాణ రాష్ట్ర అవతరణకు ముందు.. తర్వాత జిల్లాలో సాధించిన ప్రగతి నివేదికల ఉపన్యాస కాపీని తయారు చేయాలని డీపీఆర్వోకు సూచించారు. 3న తెలంగాణ రైతు దినోత్సవం సందర్భంగా జిల్లాలోని అన్ని రైతు వేదికల్లో క్లస్టర్ పరిధిలోని గ్రామాల రైతులతో సమావేశం నిర్వహించాలన్నారు.
వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలు, పథకాల విశిష్టతను తెలియచేసేలా ఫ్లెక్సీలు, పోస్టర్లు ఉండాలన్నారు. ఇందుకోసం రైతుబంధు సమితి నాయకులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ, హార్టికల్చర్ అధికారులను భాగస్వామ్యం చేయాలన్నారు. రైతులందరితో సహపంక్తి భోజనం ఉంటుందన్నారు. 4న సురక్షా దినోత్సవం, 5న విద్యుత్ విజయోత్సవం, 6న పారిశ్రామిక ప్రగతి ఉత్సవం, 7న సాగునీటి దినోత్సవం, 8న ఊరూరా చెరువుల పండుగ, 9న తెలంగాణ సంక్షేమ సంబురాలు, 10న సుపరిపాలన దినోత్సవం, 11న సాహిత్య దినోత్సవం, 12న తెలంగాణ రన్, 13న మహిళా సంక్షేమ దినోత్సవం, 14న వైద్య ఆరోగ్య దినోత్సవం, 15న పల్లెప్రగతి దినోత్సవం, 16న పట్టణప్రగతి దినోత్సవం, 17న తెలంగాణ గిరిజనోత్సవం, 18న నీళ్ల పండుగ, 19న తెలంగాణ హరితోత్సవం, 20న విద్యా దినోత్సవం, 21న తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం, 22 అమరుల సంసరణ సభ ఉంటుందని వెల్లడించారు. సమీక్షలో అదనపు కలెక్టర్లు శ్రీవత్సవ కోట, అశ్విని తానాజీ వాకాడే, వరంగల్, నర్సంపేట ఆర్డీవోలు మహేందర్జీ, శ్రీనివాస్, డీఆర్డీవో పీడీ సంపత్రావు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
పండుగ వాతావరణంలో ఉత్సవాలు
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జిల్లావ్యాప్తంగా పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. జూన్ 2న అమరవీరులకు నివాళితో ప్రారంభమై జూన్ 22న అమరవీరుల సంస్మరణ సభ, అమరవీరుల స్తూపం ఆవిషరణతో ముగుస్తాయన్నారు. రాష్ట్రం రాక ముందు పరిస్థితులు.. వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని మరోసారి గుర్తుచేస్తూ ప్రజలకు వివరించాల్సిన అవసరం అధికారులపై ఉందన్నారు. హనుమకొండ నూతన జిల్లా, మండలాలు, జీపీల ఏర్పాటుతో ప్రజలకు పాలన మరింత చేరువైందన్నారు. కొత్త జిల్లాగా ఏర్పాటైన హనుమకొండలో సంబురాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. విద్య, వైద్యం, కంటివెలుగు, కేసీఆర్ కిట్, ఆరోగ్యశ్రీ సేవలపై వివరించాలన్నారు. పల్లె, పట్టణ ప్రగతితో జాతీయస్థాయి అవార్డులు సాధించి తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని గుర్తుచేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రచారం చేయాలని, ఒకో గ్రామానికి అందుతున్న రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, షాదీముబారక్, కల్యాణలక్ష్మి, చెరువుల్లో వదిలిన చేప పిల్లలు, గొర్రెల పంపిణీ.. ఇలా అన్ని రకాల వివరాలతో గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా పల్లెప్రగతి, పట్టణప్రగతి కింద మంజూరైన వివరాలతోపాటు అభివృద్ధి నిధుల వివరాలు తెలిసేలా ప్రచారం చేయాలన్నారు. ప్రతి కార్యక్రమానికి ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ తప్పకుండా ఉండాలన్నారు. వేడుకలకు ప్రభుత్వ కార్యాలయాలను ముస్తాబు చేయాలని ఆదేశించారు. సమీక్షలో జిల్లా అదనపు కలెక్టర్ జీ సంధ్యారాణి, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ట్రైనీ ఐపీఎస్ అధికారి అంకిత్ శంకువార్, డీసీపీ ఎంఏ బారి, డీఆర్డీవో ఎం వాసుచంద్ర, పరకాల ఆర్డీవో రాము, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి ఎం శ్రీను, ఇండస్ట్రీస్ జీఎం హరిప్రసాద్, డీఈవో అబ్దుల్ హై, డీపీవో వీ జగదీశ్వర్, డీఎంహెచ్వో డాక్టర్ సాంబశివరావు, జడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు, టూరిజం అధికారి శివాజీ, ఏసీపీ కిరణ్కుమార్, హనుమకొండ తహసీల్దార్ జీ రాజ్కుమార్ పాల్గొన్నారు.