పరకాల, జూన్ 5 : దేశానికే తెలంగాణ రాష్ట్రం దిక్సూచి అని, దేశ వ్యాప్తంగా వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం మనదని వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు. పట్టణంలోని లలిత కన్వెన్షన్ హాల్లో పరకాల విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి విద్యుత్ ప్రగతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వరంగల్ జోన్ చీఫ్ ఇంజినీర్ మోహన్రావుతో కలిసి జడ్పీ చైర్పర్సన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. సీఎం కృషి పట్టుదలతో రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, వినియోగం పెరిగిందన్నారు. కరెంటు కోసం పోరాటాలు చేసే దశ నుంచి నిరంతరం విద్యుత్ సరఫరా చేసుకునే స్థాయికి ఎదిగామన్నారు.
విపక్షాలు రాష్ర్టానికి చేసిందేమీలేదనే విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. అనంతరం చీఫ్ ఇంజినీర్ మోహన్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో సగటు విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందని, అయిన ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా కొనసాగుతుందన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా విద్యుత్ సరఫరా కోసం రూ. 60 కోట్ల నిధులు కేటాయించి పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. 65,957 మంది వినియోగదారులకు విద్యుత్ శాఖ నాణ్యమైన సేవలు అందిస్తుందన్నారు. కార్యక్రమంలో డీఈ సాంబరెడ్డి, ఏడీలు దేవేందర్, నర్సింగరావు, మున్సిపల్ చైర్పర్సన్ అనితా రామకృష్ణ, వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్రెడ్డి, పరకాల ఏఎంసీ చైర్మన్ బండి సారంగపాణి, డైరెక్టర్ నక్క చిరంజీవి, మున్సిపల్ కమిషనర్ శేషాంజన్స్వామి, పలు మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీడీవోలు, ఏఈలు, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.