ఏ వర్గానికి ఏం కావాలో ఒక ఉద్యమనేతగా, పాలకుడిగా కేసీఆర్కు తెలుసు. తెలంగాణ రాక ముందు గోసపడ్డ సబ్బండ వర్గాల కోసం స్వరాష్ట్రంలో మునుపెన్నడూలేని అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెచ్చారు. ‘ప్రపంచ తెలుగు మహాసభల’తో మన సాహితీవేత్తలవైపు ప్రపంచమే తిరిగి చూసేలా చేశారు.ఇలాంటి నాయకుడు దేశానికి నాయకత్వం వహిస్తే అన్ని వర్గాలకు గుర్తింపు, గౌరవం దక్కుతుంది’ అని కవులు, కళాకారులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రంలో బీజేపీ పాలనా వైఫల్యం, మరోవైపు రాజకీయ శూన్యత ఏర్పడిన తరుణంలో దేశానికి సీఎం కేసీఆర్ నాయకత్వం వహించాలని.. ఆ సమర్థత ఆయనొక్కడికే ఉందని చెబుతున్నారు.
నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 21 : ‘కవులు, కళాకారులకు గుర్తింపు ఉన్న చోట ప్రజారంజక పాలన అమలవుతున్నదనడానికి తెలంగాణే నిదర్శనం. అన్ని వర్గాల శ్రేయస్సు కోసం ముందుచూపుతో ఎన్నో పథకాలను బ్రహ్మాండంగా అమలుచేస్తూనే సాహితీవేత్తలకూ సముచిత గౌరవం, గుర్తింపు ఇస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇలాంటి నాయకుడు ఒక తెలంగాణకే కాదు.. యావత్ దేశానికి నాయకత్వం వహించాలి’ అని కవులు, రచయితలు కాంక్షిస్తున్నారు. విభిన్న భాషలు, కళలు, సంస్కృతులు మేళవించిన మన దేశంలో కేసీఆర్ లాంటి భాషాభిమాని జాతీయ రాజకీయాల్లో ఉంటే.. దేశీయ భాషలు వికసిస్తాయని చెబుతున్నారు. కేవలం రాష్ట్ర ప్రగతి, పరిపాలనకే పరిమితం కాకుండా కవులు, రచయితలు, కళాకారులకు పెద్దపీట వేస్తూ తెలంగాణ ఏర్పాటు మొదలు అది రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైనా, స్వాతంత్య్ర దినోత్సవమైనా.. ఇలా ఏ ఉత్సవమైనా సాహితీవేత్తలు, కళాకారులకు సత్కారాలు చేయడం గొప్ప విషయమని.. ఇలాంటి గౌరవం దేశంలోని అందరు కవులకు దక్కాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాల్సిందేనని స్పష్టంచేస్తున్నారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి.. నిరంకుశ పాలన సాగిస్తున్న బీజేపీ సర్కారుకు గట్టి బుద్ధి చెప్పి దేశానికి కొత్త వెలుగు తీసుకురాగల సమర్థుడు కేసీఆరేనని కుండబద్దలు కొట్టారు.
అనుకున్నది సాధిస్తారు..
పోచమ్మమైదాన్, సెప్టెంబర్ 21: సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ప్రవేశించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి, భారతదేశంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలి. తెలంగాణలో చేపడుతున్న ప్రజాసంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలు దేశమంతా విస్తరింపజేయాలి. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీని ఓడించే సత్తా సీఎం కేసీఆర్కు ఉంది. అందుకే కేసీఆర్ వంటి బలమైన నాయకుడు జాతీయ రాజకీయాల్లో ఉండాలి. దేశ ప్రజలందరూ ఆయన పాలనను కోరుకుంటున్నారు.
– అంపశయ్య నవీన్, ప్రముఖ కవి, రచయిత
కేసీఆర్కు తిరుగుండదు..
ములుగు టౌన్, సెప్టెంబర్ 21 : అపారమైన రాజకీయ అనుభవం కలిగిన చురుకైన నాయకుడు. ముందుచూపున్న నేత ముఖ్యమంత్రి కేసీఆర్. దేశ రాజకీయ మేధావులను సైతం ఆకర్షించిన బంగారు తెలంగాణ స్వాప్నికుడు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు. తన ఆలోచనలతో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని మొదటివరుసలో నిలబెట్టిన సంగతి దేశమంతా తెలుసు. ఇలాంటి లీడర్ జాతీయ రాజకీయాల్లో ఉంటే దేశం ప్రగతి పథంలో దూసుకెళ్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టాలనే నిర్ణయాన్ని మేమంతా స్వాగతిస్తున్నాం. ఆయన జాతీయ స్థాయిలో క్రియాశీలకంగా ఉంటూ తిరుగులేని నేతగా రాణించగలరనే విశ్వాసం అందరికీ ఉంది. తెలంగాణ వలె అన్ని రాష్ర్టాలను ముందుకు తీసుకుపోగలడు. జై తెలంగాణ.
– తాడిచెర్ల రవి(తార), రచయిత, జన చైతన్య సాహితీ సమితి అధ్యక్షుడు, ములుగు
కేసీఆర్ నాయకత్వం తక్షణం అవసరం..
పోచమ్మమైదాన్, సెప్టెంబర్ 21: కేంద్రంలో ప్రజా వ్యతిరేక, తిరోగమన చర్యలు చేపడుతున్న కేంద్ర ప్రభుత్వంలో మార్పు రావడానికి సీఎం కేసీఆర్ నాయకత్వం ఎంతో అవసరం. స్వాతంత్య్రానంతరం కష్టపడి సంపాదించుకున్న ప్రజా సంపద, ఆస్తులను ఒక్కొక్కటి విక్రయిస్తూ, ప్రజా సంక్షేమాన్ని మోదీ సర్కారు గాలికి వదిలేసింది. ప్రజాకంఠక పాలనను, నైతిక విలువలను విస్మరిస్తున్నది. దేశ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేసే కోణంలో ప్రక్షాళనకు ముందడుగు పడాలి. చైతన్యవంతమైన సమాజాన్ని కాంక్షిస్తున్న దార్శనికుడైన కేసీఆర్ నాయకత్వం శరణ్యం.
– రామాచంద్రమౌళి, ప్రముఖ కవి, రచయిత
తెలంగాణ వచ్చాకే కవులకు గుర్తింపు..
చిట్యాల, సెప్టెంబర్ 21 : ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రత్యేక తెలంగాణను కొట్లాడి తెచ్చుకున్నాం. ప్రత్యేక రాష్ట్రం వచ్చాకే సీఎం కేసీఆర్ పాలనలో కవులకు, రచయితలకు, కళాకారులకు గుర్తింపు వచ్చింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమైన కవుల పేరిట అవార్డులు అందజేసి రాష్ట్రంలోని కవులకు గుర్తింపునివ్వడమే కాదు.. వారిని సన్మానించి ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా కల్పించారు. రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ దేశంలో ఆదర్శంగా తీర్చిదిద్దారు. ఇలాంటి విజన్ ఉన్న నాయకుడు.. దేశ రాజకీయాల్లో ఉంటే గొప్ప మార్పు వస్తుంది. అన్ని అంశాలపై సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తి జాతీయ స్థాయిలో కీలకంగా ఉండాల్సిన అవసరమున్నది. కేంద్రం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్న కేసీఆర్ వల్లే కా ర్మికులు, కర్షకులు.. అందరికీ మేలు జరుగుతుంది. ప్రజలందరికీ సంక్షేమఫలాలు అందాలంటే కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలి.
– మ్యాదరి సునీల్, కవి, రచయిత, జూకల్, చిట్యాల, భూపాలపల్లి జిల్లా
కేసీఆరే సమర్థుడు
మహదేవపూర్, సెప్టెంబర్ 21 : సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని యావత్ దేశం కోరుకుంటోంది. తెలంగాణలోనే కవులు, రచయితలకు సముచిత గౌరవం దక్కింది. కళలను, కళాకారులను ప్రోత్సహిస్తూ వారికి తగిన ప్రాధాన్యమిచ్చారు. అలాగే మొట్టమొదటిసారి కనీవినీ ఎరుగని రీతిలో ప్రపంచ తెలుగు మహాసభలు ఏర్పాటుచేసి కవులు, రచయితలు, సాహితీవేత్తలను గౌరవించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కింది. ప్రముఖ కవులు, రచయితల జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తూ వారి స్ఫూర్తిని కొనసాగిస్తున్నారు. అన్ని వర్గాల శ్రేయస్సు కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూనే సాహితీవేత్తలను గౌరవిస్తూ సముచిత ప్రాధాన్యమిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజావ్యతిరేక నిర్ణయాలతో ప్రజలు విసుగుచెందారు. బీజేపీపై పోరాడే ప్రత్యామ్నాయ శక్తి కేసీఆర్.
– ప్రముఖ సాహితీవేత్త, వెన్నంపల్లి మహేశ్, మహదేవపూర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా
కీలక పాత్ర పోషించాలి..
పాలకుర్త్తి, సెప్టెంబర్ 21: సమైక్య పాలనలో చారిత్రక ప్రాంతాలను పట్టించుకోలేదు. రాష్ట్రం వచ్చిన తరువాత ఉద్యమ నేత, సీఎం కేసీఆర్ చారిత్రక ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగానే మహాకవులు నడయాడిన నేల పాలకుర్తి ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దుతున్నారు. పాలకుర్తిలో పాల్కురికి సోమన, బమ్మెరలో మహాకవి పోతన స్మారక మందిరాలు నిర్మిస్తున్నారు. వల్మిడిలో వాల్మికి మహర్షి స్మారకార్థం అభివృద్ధి పనులు చేపట్టారు. వీటన్నింటికీ రూ.27 కోట్లు కేటాయించారు. జనగామ జిల్లా మొత్తానికి రూ40 కోట్లతో పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్తో చారిత్రక ప్రదేశాలకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. జాతీయ స్థాయిలోనూ సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషిస్తే దేశంలోని చారిత్రక ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయనడంలో సందేహం లేదు.
– డాక్టర్ రాపోలు సత్యనారాయణ, కవి, రచయిత (అధ్యక్షుడు, సోమనాథ కళాపీఠం పాలకుర్తి),
దేశీయ భాషలు వికసిస్తాయి..
జనగామ చౌరస్తా, సెప్టెంబర్ 21 : సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం చారిత్రక అవసరం. విభిన్న భాషలు, కళలు, సంస్కృతులు మేళవించిన మన దేశంలో కేసీఆర్ లాంటి భాషాభిమాని దేశీయ భాషలన్నీ వికసించే ప్రయత్నం చేయగలడు. ఏకభాష ఆధిపత్యం లేకుండా చేసే అవకాశం కలుగుతుంది. కవులు, కళాకారులు గుర్తించబడిన చోట ప్రజారంజక పాలన అమలవుతుంది. అది నేడు తెలంగాణలో సాధ్యమైంది. రేపు దేశమంతా అమలుకావాలని ఆశ. తెలంగాణలో జరిగినట్లు దేశమంతా భాష సాహిత్య, సాంస్కృతిక పునరుజ్జీవనం జరిగి సర్వతోముఖ వికాసం దిశగా భారతదేశం పురోగమిస్తుందని నా భావన.
– పానుగంటి రామమూర్తి, కవి, సాహిత్య పరిశోధకుడు, జనగామ
దేశాన్ని నడిపే సత్తా ఉన్న నాయకుడు..
కురవి, సెప్టెంబర్ 21 : పరమదార్శనికుడు, ధార్మికవేత్త. ఆధ్యాత్మికవేత్త.. నిజమైన రైతుబంధువు.. అన్నివర్గాల కష్టాలు తెలిసిన ఏకైక నాయకుడు కేసీఆర్. తన ప్రాణాలను లెక్కచేయకుండా ఉద్యమానికి ఊపిరిపోసి తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసిన మహనీయుడాయన. సంక్షేమ తెలంగాణగా తీర్చిదిద్ది సుపరిపాలన అందిస్తున్న నాయకుడు. అన్ని వర్గాలతో పాటు కవులను, కళాకారులను గుర్తించి సాంస్కృతిక కార్యక్రమాలకు పెద్దపీట వేసిన కళాపోషకుడు. తెలంగాణ రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో దేశానికి దిక్సూచిగా మలిచిన రాజకీయ నాయకుడు. ఇన్ని ప్రత్యేకతలున్న కేసీఆర్కే దేశాన్ని పాలించే సత్తా ఉంది. దేశంలోని సబ్బండ వర్గాల అభ్యున్నతి కోసం అడుగులు వేస్తున్న సీఎం కేసీఆర్కు రాష్ట్ర ప్రజలంతా బాసటగా నిలువాల్సిన సమయం వచ్చింది.
– బొల్లోజు భరత్, కవి, పురోహితుడు
కేసీఆర్ ఆలోచనా విధానం గొప్పది..
మహబూబాబాద్ రూరల్, సెప్టెంబర్ 21 : రాష్ట్రంలోని రచయితలు, కవులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సముచిత స్థానం కల్పిస్తున్నారు. గౌరవం కల్పిస్తూ వారి అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్ డే రోజున సంబురంగా వేడుకలను నిర్వహించి రచయితలను ఘనంగా సన్మానించడం గొప్ప విషయం. గుర్తింపు ఇవ్వడమే గాక వారి ప్రతిభ, నైపుణ్యం ఆధారంగా బహుమతులను సైతం అందజేస్తున్న తీరు అద్భుతం. ఎక్కడా లేని విధంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో కూడా రచయితలకు ప్రతిభా పోటీలను నిర్వహించి జ్ఞాపికలు ఇచ్చి ప్రభుత్వం ఘనంగా సత్కరించడం మరచిపోలేము. కేసీఆర్ ఆలోచనా విధానంతో తెలంగాణలోనే గాక దేశంలోని రచయితలందరికీ గుర్తింపు, గౌరవం దక్కుతుంది. అభివృద్ధి, సంక్షేమంతో పాటు అన్ని వర్గాలను ఆదరిస్తున్న కేసీఆర్ దేశానికి నాయకత్వం వహిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
– సంకెపల్లి శ్రీనివాసరెడ్డి, రచయిత, మానుకోట